Showing posts with label చావు పుట్టుకలు. Show all posts
Showing posts with label చావు పుట్టుకలు. Show all posts

ఒక వ్యక్తి చిన్నతనంలోనే మరణించడం, మరొకరు చిరకాలం. . .

Tuesday, July 7, 2009
భగవాన్ ని ఒకరు అడిగారు - 'ఒక వ్యక్తి చిన్నతనంలోనే మరణించడం, మరొకరు చిరకాలం జీవించడం జరుగుతూనే వుంది కదా, వీరిద్దరిలో ఎవరెక్కువ పాపం చేసిన వారు ? '
భగవాన్ మౌనంగా వున్నారు.
మళ్ళీ అతనే 'ఒకరు ఎక్కువ కాలం జీవిస్తే మోక్షాన్ని చేరడం కొరకు
ప్రయత్నించడానికి ఎక్కువ అవకాశముంటుంది గదా?' అని ప్రశ్నించాడు.

దానికి భగవాన్ 'ఎక్కువ కాలం బ్రతికి ప్రయత్నించే వ్యక్తికన్నా
చిన్నతనంలో మరణించి పునర్జన్మలో మోక్షానికి అనుకూలమైన అవకాశాలు ఎక్కువగా వుంటాయి '

'కర్మలను త్యాగం చేయవలెనని చెప్పడానికి అర్థం వీలయినంతవరకు కర్మలను తగ్గించుకోవాలనేనా?'

'కర్మలను వదలమనడంలోని అర్థం కర్తవు నీవనుకోకుండా కర్మలమీదా, కర్మఫలం మీదా మోహాన్ని వదలమని, నీ కర్మలను అనుభవించడం కోసంగా యీ దేహం లభించిందో వాటిని అనుభవించే తీరాలి. వాటిని వదలివేయడమన్నది వ్యక్తియొక్క ఇష్టాయిష్టాలమీద ఏ మాత్రం ఆధారపడదు'.

భగవాన్! పునర్జన్మలు వున్నాయా? మరణం అంటే ఏమిటి? మళ్లీ పుట్టడం ఎందుకు ?

Saturday, June 20, 2009
1938 నవంబరులో రమణాశ్రమం వచ్చిన స్పానిష్ అమెరికన్ వనిత మెర్సిడెజ్ డి. అకోస్తా. ఆమె రమణ భక్తురాలు. హాలీవుడ్ సినిమాలకు స్క్రిప్ట్ రాస్తుంది. 24 సం. తర్వాత ఆమె ఒక పుస్తకం రాసింది. 'Here lies the heart' ఆ పుస్తకం పేరు. అందులో ఆమె పాతికేళ్ల భక్తి నిక్షిప్తం చేసింది. ఆమె మొదట పాల్ బ్రంటన్ ' Search in secret India ' చదివి ప్రభావితురాలైంది. ఆమె అంటారు 'ఆ పుస్తకం చదివిన తర్వాత నాలుగు రోజుల పాటు నేను వేరొక విషయం ఆలోచించలేకపోయాను. నా మనసంతా శూన్యమైంది. నన్ను రమణ మహర్షి ఆత్మ పూనినట్లయింది. ఎవరితో మాట్లాడబుద్ది అయ్యేది కాదు. నేను మహర్షిని కలుసుకోగలనని గట్టిగా నమ్మకం కలిగింది. '

ఆమె రమణ సన్నిధికి వచ్చి వాలిపోయింది. ఏ ప్రశ్నలు అడగవలసిన అవసరం కనిపించలేదు. ఆమెకు అనుమానాలన్నీ తీరిపోయాయి. ఎన్నో ప్రశ్నలు తయారు చేసుకుని వచ్చి, చివరికి రెండే ప్రశ్నలు అడిగింది భగవాన్ ని.

'నా అంతరాత్మ చెప్పినట్టు నడుచుకోమంటారా ? '
'నీ అంతరాత్మ గురించి నాకేం తెలుసు. నీ ఆత్మ చెప్పినట్లు చేయి.
ఆత్మ నడిపించినట్లు నడువు. ఎవరు ఎవరినీ అనుసరించవలసిన పనిలేదు. '

'మతాలు, గురువుల్ని గురించి?'
'హృదయంలోకి చొచ్చుకుపోతే మతాలుండవు. గురువులుండరు.
ఆత్మ దర్శనమవుతుంది. అది చాలు.'

మొదటిసారిగా డి. అకోస్తా మహర్షిని కలిసినప్పుడు ఆయన పాదాల చెంత ఎదురుగా కూర్చుని ఆయన కళ్లలోకి చూసింది . మహర్షి ఆమె కళ్లలోకి ప్రేమగా చూడసాగారు. 'ఆ క్షణంలో నన్ను నేను మరచిపోయినాను. ఏమని చర్ణించను? నాలోని ఆత్మ ఉన్నత శిఖరాన్ని చేరినట్లు అనిపించింది. అప్పుడు భగవాన్ మందహాసం చేశారు. అప్పటి ఆనందం నేను జన్మలో మరచిపోలేను. ఆ ఒక్క క్షణం చాలు. అప్పుడు వచ్చిన మార్పు జీవితాంతం సరిపోతుంది. '

అమెరికా తిరిగి వెళ్లిన తర్వాత ఆమె కొన్ని ప్రశ్నలు భగవాన్ కి పంపింది. మరొక అమెరికన్ భక్తుడు తెచ్చి భగవాన్ కిచ్చాడు. ఆయన పేరు గేహగ్స్. గేహగ్స్ కొంతకాలంగా ఆశ్రమవాసి. ఆమె పంపిన ప్రశ్నలు పునర్జన్మలు, గతం, భవిష్యత్తుకు సంబంధించినవి.

'పునర్జన్మ వాస్తవమా! నిజంగానే పునర్జన్మ ఉంటుందా?'

'ఇప్పటి జన్మ వాస్తవం అయితే, పునర్జన్మ వాస్తవమే.
ఇంతకుముందు జన్మించి ఉండటం నిజమైతే, మళ్లీ జన్మించడమూ నిజమే అవుతుంది. '

'మరణం అంటే ఏమిటి ? పుట్టడం అంటే ఏమిటి? ఎందుకు?'
'శరీరానికి పుట్టడం, చావడం రెండూ తప్పనిసరి పనులు. '

'మరణానికి , మరొక జన్మకు రావడానికి మధ్య విరామం ఎంత?'
'ఒక్కొక్కరు ఒక ఏడాదిలోపే జన్మిస్తారు లేదా మూడు సంవత్సరాలు పట్టవచ్చు. లేదూ , వేల సంవత్సరాలు పట్టవచ్చు. అయినా కాలాన్ని కొలవడం ఎలా? శూన్యానికి విరామం ఏమిటి? అసలు కాలం అంటేనే శూన్యం కదా.'

'మనిషికి గత జన్మల జ్ఞానం ఉండదు. ఎందుచేత?'
'గతించిన వన్నీ భ్రమలు. కరిగిపోయిన కలలు. వాటి జ్ఞాపకాలతో ఏంపని? నీవు ఒకసారి ఆత్మలోకి ప్రస్థానిస్తే గతంతో పనిలేదు. భవిష్యత్తు అవసరం ఉండదు. నిజానికి వర్తమానం సైతం శూన్యమై పోతుంది. ఏమీ మిగలదు. ఆత్మ కాలాతీతం. కాలరహితం. '

'యీ శరీరాన్ని వదిలిన ఆత్మ వెంటనే మరొక శరీరాన్ని ఆశ్రయిస్తుందా ?'
'శరీరం ఆధారం లేకుండా 'జీవి' ఉండదు.'

'ఎటువంటి శరీరాన్ని కోరుకుంటుంది?'
'అది యే రూపాన్నయినా తీసుకోవచ్చు. సూక్ష్మ శరీరం కావచ్చు. స్థూల శరీరం కావచ్చు.
ఆత్మకు ఏదో ఒక శరీరం ఆధారంగా ఉండాలి. '

'స్థూలం అంటే భౌతిక శరీరం అనే కదా! అదే మనకు తెలుస్తుంది? '
'ఆ తేడా నీకు అర్థం కావడానికి మత్రమే. జ్ఞానికి శరీరాల తేడా ఉండదు. '

'మరల జన్మించడానికి కారణం ఏమిటి?'
'తీరని కోరికలు, నెరవేరని ఆశయాలు, కోరికలు తీర్చుకోవాలన్న తపనతో మళ్లీ జన్మిస్తారు. ప్రతి శరీరానికి ప్రతిజన్మలో తీరని కోరికలు కొన్ని మిగిలి ఉంటాయి. కొన్ని కొత్తగా ఏర్పడుతుంటాయి. అందుచేతనే మనిషి మళ్లీ మళ్లీ జన్మించడం జరుగుతోంది.'

యీ జవాబుల చివరగా భగవాన్ ఒక సందేశం లాగ యిచ్చారు.

'నీ ప్రశ్నలు మంచివే. బావున్నాయి. డి. అకోస్తాతో చెప్పు. అతిగా ఆలోచించవద్దని. ధ్యానం చేసుకుంటూ ఆలోచనల్ని దూరం చేసుకోమను. చాలు. మనస్సు 'ఆత్మ'లో లయిస్తే ప్రశాంతత లభిస్తుంది. ఆధ్యాత్మపరులు హృదయ గుహలో విశ్రమించడం నేర్చుకోవాలి. ఆ పని సహజంగా జరుగుతుంది. జరగాలి. అప్పుడు యీ ప్రశ్నలేవీ మిగలవు. ప్రశ్నించే అవసరం ఉండదు. అలా స్థిమితంగా ఉండడం 'అకర్మణత్వం' కాదు. మౌనంగా, నిశ్చబ్దంగా, ప్రశాంతంగా ఉండడం ఒక్కటే నిజమైన పని.

భగవాన్! నా కొడుకుని బతికించండి

Wednesday, June 10, 2009
రేపల్లె దగ్గిర మూరతోట గ్రామం నించి వొక శవాన్ని పెట్టెలో పెట్టి తీసుకొచ్చారు, ఆశ్రమం గుమ్మంలోకి, ఒకరు రాత్రి ఎనిమిదింటికి. వాళ్ళకి ఒక్కడే కొడుకు. అతని భగవాన్ బతికిస్తారని ఆశ. ఆ తల్లి రాత్రి పదింటివరకు భగవాన్ తో చెప్పుకుంది.

భగవాన్ ఏమీ మాట్లాడలేదు.
వాళ్ళు వూళ్ళోకి వెళ్ళారు. తెల్లారిందాకా చూసినట్టున్నారు. తెల్లారి దహనసంస్కారాలు చేశారు.

తరువాత భగవాన్ అన్నారు, 'విశ్వాసంతో చాలా దూరం వొచ్చారు. కాని ఒకర్ని బతికిస్తే ఇంక యీ బతికించడానికి అంతం వుంటుందా? ' అని.

తరువాత రెండు రోజులున్నారు వాళ్ళు . వెళ్ళేటప్పుడు దుఃఖమంతా మరిచి నవ్వుతో వెళ్ళారు.

Blessing

Blessing
Bhagavan Memories