Showing posts with label పాశ్చాత్యులతో భగవాన్. Show all posts
Showing posts with label పాశ్చాత్యులతో భగవాన్. Show all posts

భగవాన్ ! ప్రపంచం క్లిష్ట సమయంలో ఉంది. దీనికి పరిష్కారం సూచించండి

Sunday, June 21, 2009
రమణ మహర్షి ధ్యాన సంపత్తిని సముద్రాలు దాటించి మహర్షిని విశ్వర్షిగా మలిచిన తొలి పాశ్చాత్య భక్త వరేణ్యుడు పాల్ బ్రంటన్. పాల్ బ్రంటన్ ఇంగ్లండులో ప్రముఖ జర్నలిస్టు. మంచి రచయిత, సాహితీపరుడు. ఆంత్రోపాలజీ, మతం వంటి విషయాలపట్ల ఆసక్తి కలవాడు. చేస్తున్న ఉద్యోగం వదిలి 1930 లో భారతదేశం వచ్చాడు. భారతదేశంలోని యోగులు,మహర్షులపైన పరిశోధన చేయాలన్నది అతని సంకల్పం. భారతదేశం వేదభూమి, కర్మభూమి, తపోభూమి. ఇక్కడ అడుగడుగునా యోగులుంటారని, ఇది అంతా కీకారణ్యమని పాశ్చాత్యుల భావన.పాల్ బ్రంటన్ తన తత్వజిజ్ఞాసలో భాగంగా చాలా దేశాలు పర్యటించాడు. ఈజిఫ్టులో రహస్య స్థావరాలలో ఉండే మాంత్రికుల్ని, తాంత్రికుల్ని కలిశాడు. ముంబాయిలో మహమూద్ బే అనే సూఫీ యోగి ని కలిశాడు. నాసిక్ లో మెహర్ బాబాను, ఆయన గురువును దర్శించాడు. పూనేలో బాబాజాన్ ని పరిచయం చేసుకున్నాడు. సుఖానంద రాజగోపాలస్వామిని, కాంచీపురంలో శంకరాచార్యను కలుసుకున్నాడు.

కంచి శంకరాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర స్వామిని సేవించి తనకు జ్ఞానమార్గం చూపమని అర్థించాడు. ఆయనే పాల్ బ్రంటన్ ను రమణ మహర్షివద్దకు వెళ్లమని సలహా చెప్పాడు. తన శిష్యుడు వెంకటరమణిని బ్రంటన్ కు తోడుగా పంపారు. తాను దేశ పర్యటనలో వున్నానని, తర్వాత వచ్చి దర్శనం చేసుకుంటానని చెప్పమని మరీ చెప్పి పంపారు. కంచి శంకరాచార్య రమణ మహర్షిని తన హృదయస్థ గురువుగా భావించేవారు.

పాల్ బ్రంటన్ మద్రాసు నిండి తిరువణ్ణామలై చేరుకున్నాడు. ఆశ్రమం చేరి మహర్షికి నమస్కారం చేసి ఎదురుగా కూర్చున్నాడు. మహర్సి సన్నిధిలో చాలా మంది భక్తులున్నారు. అందరూ నిశ్శబ్దంగా, ధ్యానంలో ఉన్నారు. మహర్షి ఎంతో నిర్మలంగా, ప్రశాంతంగా ఉన్నారు. భక్తుల తృప్తికోసం అలా కూర్చున్నారేమో అనిపించింది. అంత నిబ్బరంగా, ప్రపంచ, పరిసరాలు ఏవీ పట్టనట్లు ఉండడం ఎలా సాధ్యం !

అలా అనుకున్న మరుక్షణంలో అతని మనస్సు శూన్యమైంది. నిరామయమైంది. లోపల ఒక్క భావం కదలడం లేదు. తనలో చకచక వస్తున్న మార్పులకు ఉక్కిరిబిక్కిరైనాడు. తన చూట్టూ కాంతి ప్రవాహాలు, తనలో శాంతి తరంగాలు. ఆలోచనలతో కలవరపడే మనస్సు క్షణంలో నిర్మలమైంది. ఇది ఎలా సాధ్యం? ఆ క్షణంలో అనిపించింది 'మనిషి వివేకమే సమస్యల్ని సృష్టిస్తుందని '. ఆ వివేకమే తను సృష్టించుకున్న సమస్యలకు పరిష్కారం వెదుకుతుంది. రెండింటికీ మనసే మూలం, ఆధారం. తనలో అంతటి శాంతికి, ప్రశంతతకి కారణం మహర్షి దర్శనం, మహర్షి వీక్షణం. ఆ విషయం తెలుసుకోడానికి క్షణకాలం పట్టలేదు బ్రంటన్ కు.

ఆ తర్వాత పాల్ బ్రంటన్ భగవాన్ తో చాలాసార్లు సంభాషణలు జరిపాడు. వాటిల్లో కొన్ని

'ప్రపంచ భవిస్యత్తు ఎలా ఉంటుంది? ప్రపంచం క్లిష్ట సమయంలో ఉంది. దీనికి పరిష్కారం సూచించండి!'
'భవిష్యత్తు గురించి ఇప్పుడెందుకు ఆలోచన. ప్రపంచం గురించి మీరెందుకు విచారిస్తారు? మీకు వర్తమానం తెలియదు. వర్తమానం గురించి తెలియనివారు భవిష్యత్తును ఏం బాగు చేస్తారు? మీరు ప్రస్తుతాన్ని చక్కదిద్దుకోండి. భవిష్యత్తు తన పని తను చూసుకుంటుంది.'

'భగవాన్ ! ప్రపంచ దేశాల మధ్య ఇకనైనా మైత్రి నెలకొంటుందా? లేక ఇలాగే వినాశం వైపు పరుగులు తీస్తుందా?'
'పాల్! లోకాన్ని పాలించే వాడొకడున్నాడు. తను చూసుకుంటాడు ప్రపంచం సంగతి. ఈ ప్రపంచం బాధ్యత ఆయనది, ఆ పని నీది కాదు.'

'ఏమిటో భగవాన్ ! చుట్టూ చూస్తుంటే అంతా అయోమయం. ఎక్కడ సహాయానుభూతి కనిపించదు. '
'నీవు ఎంతో ప్రపంచమూ అంతే. నిన్ను నీవు అర్థం చేసుకోకుండా ప్రపంచాన్ని ఏం అర్థం చేసుకుంటావు! అయినా అది సత్యాన్వేషుల పని కాదు. అలాంటి ప్రశ్నలతో కాలాన్ని, శక్తిని వృధా చేసుకోవద్దు. ముందుగా నీ వరకు సత్యాన్ని అన్వేషించు. సత్యాన్ని తెలుసుకో. తర్వాత నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, ప్రాపంచిక సత్యాన్ని అవగాహన చేసుకోవచ్చు. ప్రపంచంలో ఉన్నది నీవొక్కడివే కాదు. ప్రపంచం నీ వొక్కడితో లేదు. అసలు ప్రపంచానికి నీవు భిన్నం అని ఎందుకనుకుంటున్నావు?'

భగవాన్! పునర్జన్మలు వున్నాయా? మరణం అంటే ఏమిటి? మళ్లీ పుట్టడం ఎందుకు ?

Saturday, June 20, 2009
1938 నవంబరులో రమణాశ్రమం వచ్చిన స్పానిష్ అమెరికన్ వనిత మెర్సిడెజ్ డి. అకోస్తా. ఆమె రమణ భక్తురాలు. హాలీవుడ్ సినిమాలకు స్క్రిప్ట్ రాస్తుంది. 24 సం. తర్వాత ఆమె ఒక పుస్తకం రాసింది. 'Here lies the heart' ఆ పుస్తకం పేరు. అందులో ఆమె పాతికేళ్ల భక్తి నిక్షిప్తం చేసింది. ఆమె మొదట పాల్ బ్రంటన్ ' Search in secret India ' చదివి ప్రభావితురాలైంది. ఆమె అంటారు 'ఆ పుస్తకం చదివిన తర్వాత నాలుగు రోజుల పాటు నేను వేరొక విషయం ఆలోచించలేకపోయాను. నా మనసంతా శూన్యమైంది. నన్ను రమణ మహర్షి ఆత్మ పూనినట్లయింది. ఎవరితో మాట్లాడబుద్ది అయ్యేది కాదు. నేను మహర్షిని కలుసుకోగలనని గట్టిగా నమ్మకం కలిగింది. '

ఆమె రమణ సన్నిధికి వచ్చి వాలిపోయింది. ఏ ప్రశ్నలు అడగవలసిన అవసరం కనిపించలేదు. ఆమెకు అనుమానాలన్నీ తీరిపోయాయి. ఎన్నో ప్రశ్నలు తయారు చేసుకుని వచ్చి, చివరికి రెండే ప్రశ్నలు అడిగింది భగవాన్ ని.

'నా అంతరాత్మ చెప్పినట్టు నడుచుకోమంటారా ? '
'నీ అంతరాత్మ గురించి నాకేం తెలుసు. నీ ఆత్మ చెప్పినట్లు చేయి.
ఆత్మ నడిపించినట్లు నడువు. ఎవరు ఎవరినీ అనుసరించవలసిన పనిలేదు. '

'మతాలు, గురువుల్ని గురించి?'
'హృదయంలోకి చొచ్చుకుపోతే మతాలుండవు. గురువులుండరు.
ఆత్మ దర్శనమవుతుంది. అది చాలు.'

మొదటిసారిగా డి. అకోస్తా మహర్షిని కలిసినప్పుడు ఆయన పాదాల చెంత ఎదురుగా కూర్చుని ఆయన కళ్లలోకి చూసింది . మహర్షి ఆమె కళ్లలోకి ప్రేమగా చూడసాగారు. 'ఆ క్షణంలో నన్ను నేను మరచిపోయినాను. ఏమని చర్ణించను? నాలోని ఆత్మ ఉన్నత శిఖరాన్ని చేరినట్లు అనిపించింది. అప్పుడు భగవాన్ మందహాసం చేశారు. అప్పటి ఆనందం నేను జన్మలో మరచిపోలేను. ఆ ఒక్క క్షణం చాలు. అప్పుడు వచ్చిన మార్పు జీవితాంతం సరిపోతుంది. '

అమెరికా తిరిగి వెళ్లిన తర్వాత ఆమె కొన్ని ప్రశ్నలు భగవాన్ కి పంపింది. మరొక అమెరికన్ భక్తుడు తెచ్చి భగవాన్ కిచ్చాడు. ఆయన పేరు గేహగ్స్. గేహగ్స్ కొంతకాలంగా ఆశ్రమవాసి. ఆమె పంపిన ప్రశ్నలు పునర్జన్మలు, గతం, భవిష్యత్తుకు సంబంధించినవి.

'పునర్జన్మ వాస్తవమా! నిజంగానే పునర్జన్మ ఉంటుందా?'

'ఇప్పటి జన్మ వాస్తవం అయితే, పునర్జన్మ వాస్తవమే.
ఇంతకుముందు జన్మించి ఉండటం నిజమైతే, మళ్లీ జన్మించడమూ నిజమే అవుతుంది. '

'మరణం అంటే ఏమిటి ? పుట్టడం అంటే ఏమిటి? ఎందుకు?'
'శరీరానికి పుట్టడం, చావడం రెండూ తప్పనిసరి పనులు. '

'మరణానికి , మరొక జన్మకు రావడానికి మధ్య విరామం ఎంత?'
'ఒక్కొక్కరు ఒక ఏడాదిలోపే జన్మిస్తారు లేదా మూడు సంవత్సరాలు పట్టవచ్చు. లేదూ , వేల సంవత్సరాలు పట్టవచ్చు. అయినా కాలాన్ని కొలవడం ఎలా? శూన్యానికి విరామం ఏమిటి? అసలు కాలం అంటేనే శూన్యం కదా.'

'మనిషికి గత జన్మల జ్ఞానం ఉండదు. ఎందుచేత?'
'గతించిన వన్నీ భ్రమలు. కరిగిపోయిన కలలు. వాటి జ్ఞాపకాలతో ఏంపని? నీవు ఒకసారి ఆత్మలోకి ప్రస్థానిస్తే గతంతో పనిలేదు. భవిష్యత్తు అవసరం ఉండదు. నిజానికి వర్తమానం సైతం శూన్యమై పోతుంది. ఏమీ మిగలదు. ఆత్మ కాలాతీతం. కాలరహితం. '

'యీ శరీరాన్ని వదిలిన ఆత్మ వెంటనే మరొక శరీరాన్ని ఆశ్రయిస్తుందా ?'
'శరీరం ఆధారం లేకుండా 'జీవి' ఉండదు.'

'ఎటువంటి శరీరాన్ని కోరుకుంటుంది?'
'అది యే రూపాన్నయినా తీసుకోవచ్చు. సూక్ష్మ శరీరం కావచ్చు. స్థూల శరీరం కావచ్చు.
ఆత్మకు ఏదో ఒక శరీరం ఆధారంగా ఉండాలి. '

'స్థూలం అంటే భౌతిక శరీరం అనే కదా! అదే మనకు తెలుస్తుంది? '
'ఆ తేడా నీకు అర్థం కావడానికి మత్రమే. జ్ఞానికి శరీరాల తేడా ఉండదు. '

'మరల జన్మించడానికి కారణం ఏమిటి?'
'తీరని కోరికలు, నెరవేరని ఆశయాలు, కోరికలు తీర్చుకోవాలన్న తపనతో మళ్లీ జన్మిస్తారు. ప్రతి శరీరానికి ప్రతిజన్మలో తీరని కోరికలు కొన్ని మిగిలి ఉంటాయి. కొన్ని కొత్తగా ఏర్పడుతుంటాయి. అందుచేతనే మనిషి మళ్లీ మళ్లీ జన్మించడం జరుగుతోంది.'

యీ జవాబుల చివరగా భగవాన్ ఒక సందేశం లాగ యిచ్చారు.

'నీ ప్రశ్నలు మంచివే. బావున్నాయి. డి. అకోస్తాతో చెప్పు. అతిగా ఆలోచించవద్దని. ధ్యానం చేసుకుంటూ ఆలోచనల్ని దూరం చేసుకోమను. చాలు. మనస్సు 'ఆత్మ'లో లయిస్తే ప్రశాంతత లభిస్తుంది. ఆధ్యాత్మపరులు హృదయ గుహలో విశ్రమించడం నేర్చుకోవాలి. ఆ పని సహజంగా జరుగుతుంది. జరగాలి. అప్పుడు యీ ప్రశ్నలేవీ మిగలవు. ప్రశ్నించే అవసరం ఉండదు. అలా స్థిమితంగా ఉండడం 'అకర్మణత్వం' కాదు. మౌనంగా, నిశ్చబ్దంగా, ప్రశాంతంగా ఉండడం ఒక్కటే నిజమైన పని.

ఆమె భగవాన్ వేపు కాళ్ళు జాపి కూర్చుంది

Friday, June 5, 2009
కొత్తగా యూరపు నించి ఒకామె వచ్చింది. ఆమెకు కాళ్ళు ముడుచుకొని కూచోటం చాలా కష్టం. కాళ్ళు చాచింది కొంతసేపటికి. అవి భగవాన్ వేపుకు వున్నాయి. భగవాన్ వెంట నుండి సేవచేసే అనుచరుడు మండిపడి '

సరిగా కాళ్ళు ముడుచుకొని కూచో' మని ఆజ్ఞాపించాడు.
ఆమె ముడుచుకుంది భయంతో.

వెనక్కి ఆనుకొని కాళ్ళు చాచుకొని కూచున్న భగవాన్ వెంటనే ఆమె మల్లేనే తానూ కాళ్ళు ముడుచుకొని కూచున్నారు. అంతే, ఎన్ని గంటలైనా అట్లానే కూచున్నారు. భగవాన్ కాళ్ళు అసలే నెప్పులు. చాలాసేపు ఒకే భంగిమలో కూచోలేరు. అందరూ ప్రార్థించారు. ఆయన్ని కాళ్ళు జాపుకోమని.

'హాలులో అందరికి ఒకటే మాట.
ఎన్నడూ ముడుచుకుని కూచోని ఆమెకు ఆజ్ఞ పెడితే నాకు పెట్టినట్లు కాదా?' అని,
ఆ రోజంతా అట్లానే కూచున్నారు.

బట్టలు లేని ఇద్దరు గొప్పవారు

Monday, June 1, 2009
మొదటిసారి గ్రీన్ లీస్ అనే ఆయన భగవాన్ దర్శనానికి వచ్చినప్పుడు ఒకరితో అంటున్నాడు.

'నా చెల్లెలు ఇంగ్లాండు నుండి వస్తానంటుంది.
ఆమెకు భగవాన్ గురించి, గాంధీగారిని గురించి చాలా రాశాను
యీ దేశంలోకల్లా ముందు చూడవలసిన వాళ్ళు వారిద్దరేనని. కాని తీరా వస్తే ఎట్లా చూపను?
ఇద్దరికి వొంటిమీద బట్టలు సరిగా వుండవు.
ఇద్దరూ అందం లేనివారు.
వీరిద్దరే గొప్పవారంటే ఏమంటుందో ఏమో?' అని.

'భగవాన్ ! మీరు దేవుణ్ణి చూశారా ?'

Friday, May 29, 2009
ఒకరోజు సూటూ బూటూ వేసుకున్న పాశ్చాత్యుడు బూట్లు విడువకుండానే
భగవాన్ వున్న హాల్లోకి దర్జాగా వచ్చి

'భగవాన్! మీరు దేవుణ్ణి చూశారా ?' అని అడిగాడు.
భగవాన్ ఏమీ తెలీనివాని వలె, 'దేవుడా? ఎవరాయన ? ' అని అడిగారు.
అతను తెల్లబోయి నుంచున్నాడు. కొంచెం సేపుండి అతను

'భగవాన్ ! మీ ఫోటో నేను తీసుకోవచ్చునా ?' అని అడిగాడు.
సరేనన్నారు భగవాన్. ఆ వచ్చిన అతను ఒక snap తీసుకొని వెళ్ళాడు.

తరవాత భగవాన్ అన్నారు. 'వివేకానంద, రామకృష్ణుని 'దేవుణ్ణి చూశావా ' అని అడిగింది చదివి వుంటాడు. అదే అస్త్రం ప్రయోగించాడు. యీ వూరికి టిక్కెట్టుతో దేవుణ్ణి కొనుక్కోవాలని ప్రయత్నిస్తారు. ఏం చేస్తాం ? '

భగవాన్ స్మృతులు | తోవ తప్పిన భక్తుడు

Wednesday, May 27, 2009
ఒక పాశ్చత్య భక్తుడు అరుణాచల పర్వతాన్ని అడ్డదారిని ఎక్కి వెళ్ళాడు. వెంట ఎవరినీ తీసుకువెళ్ళలేదు. ప్రొద్దుటనగా వెళ్ళిన వాడు చీకటి పడినా రాలేదు. అతనికోసం ఆశ్రమంలోని వారంతా ఆరాటపడుతున్నారు. భగవాన్ కూడా దూరదర్శిని ( బైనాక్యులర్స్ ) తో కొండకేసి చూస్తున్నారు. అతగాడి జాడలేదు. రాత్రి పొద్దుపోయినతరువాత అలసి సొలసి వచ్చాడు.

వచ్చి, ఒకచోట అలసటతో చతికిలబడ్డాడు. అక్కడికి కొంతమంది భక్తులు చేరారు. భగవాన్ కూడా వెళ్ళారు. 'ఇంత ఆలస్యంగా వచ్చారేమి? ' అని అడిగారు భగవాన్. ఆయన గుడ్లు మిటకరించి చూస్తూ

'భగవాన్, అదేమిటీ, మీరేకదా నేను తోవ తప్పి ఆదుర్దాపడుతుంటే కనపడి
ఆ అగాధాలను దాటించి తీసుకువచ్చారు? ' అన్నాడు.

Somerset Maugham తో భగవాన్

Monday, May 25, 2009
ఆంగ్ల రచయితలలో సోమర్సె ట్ మాం ( Somerset Maugham ) అగ్రశ్రేణికి చెందినవాడు. యీయన రాసిన కథలు ప్రపంచంలోని అనేక భాషలలోనికి అనువదించబడ్డాయి. 1936 లో భారతదేశం వచ్చాడు. భగవాన్ శ్రీ రమణ మహర్షులవారిని దర్శించాలని తిరువన్నామలై వచ్చాడు. ఆశ్రమంలోనికి అడుగుపెట్టాడో లేదో, అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు లోనై స్పృహతప్పి పడిపోయాడు. ఆశ్రమవాసులు ఒక కుటీరంలోనికి తీసుకువెళ్లి పడుకోబెట్టారు.

భగవాన్ కు యీ కబురందగానే వచ్చారక్కడికి. ఆయనకేసి సుమారు పావుగంట సేపు చూస్తూ కూర్చున్నారు. ఆయన కళ్లు తెరచి భగవాన్ ను చూశారు. కాని, మాట్లాడలేకపోయారు. 'మౌనమే ఎడతెగని భాష ' అన్నారు భగవాన్. ఆయన మనసులోని ఆవేదనను కనిపెట్టి, ఆ తరువాత మరికొన్నినిముషాలు కూర్చుని వెళ్లిపోయారు. మరునాటికి సోమర్సెట్ మాం భగవాన్ ఆసీనులై ఉన్న హాల్ లోనికి రాగలిగారు. చాలాసేపు కూర్చుని నమస్కరించి వెళ్లిపోయారు.

'నేను అనేకమంది మహాత్ములను గురించి విన్నాను. కొంతమందిని దర్శించాను.అయితే,
శ్రీ రమణుల సన్నిధిలో అనుభవించిన మధురానుభూతిని,ఆనంద సాగర తరంగాల మీద
తేలిపోతున్న అనుభూతిని ఎప్పుడూ పొందలేదు '
అని రాశారు తన రచన 'మహర్షి ' ( The Saint ) అనే పుస్తకంలో.

భగవాన్ని చూసిన ఫలితం

Sunday, May 24, 2009
పెరూ దేశం నుంచి వొక భార్యా భర్తా వొచ్చారు ఆశ్రమానికి . వాళ్ళు భగవాన్ని దర్శించి తమ కథనంతా చెప్పుకున్నారు. భగవాన్ విషయం చదివినప్పటి నుంచి జీసస్ తిరిగి భూమి మీద అవరతించినట్టుగా భావించి, ఆయనని దర్శించుకోవాలని ఆశించారు. కాని డబ్బులేదు. ప్రతి వారమూ తమ జీతంలో కొంత దాచి కొన్నేళ్ళకి స్టీమర్లో చాలా బీద ప్రయాణీకుల కింద బయలుదేరారు. కొన్ని నెలలు ప్రయాణంలో అవస్థలు పడ్డారు.
వారి చరిత్రనంతా భగవాన్ జాగ్రత్తగా విని -

'ఇన్ని కష్టాలుపడి ఇంత దూరం ఎందుకు వొచ్చారు?
అక్కడనించి నన్ను తలుచుకుంటే సరిపోదా?
ఇక్కడికి వొచ్చి నన్ను చూసినంత ఫలితమూ, తృప్తీ అక్కడే కలిగేది కద మీకు?' అన్నారు.

Blessing

Blessing
Bhagavan Memories