Showing posts with label చలం. Show all posts
Showing posts with label చలం. Show all posts

భగవాన్ స్మృతులు | చలం - 6 | 'తిట్టేవారు. ధిక్కరించేవారు. నువ్వెంత అని ప్రశ్నించేవారు. . .'

Tuesday, June 30, 2009
వారిని దర్శించడానికి వచ్చేవారు కూడా వారిని చూడగానే అనేక విధాల reactions చూపేవారు. ధ్యానంలో పడేవారు. indifferentగా లేచిపోయేవారు. నవ్వేవారు పాపులమని ఏడ్చేవారు. అరచేవారు. హిస్టీరియాలోకి పోయేవారు. వెనక్కు విరుచుకుపడేవారు. స్తుతించేవారు. శ్లోకాలు చదివేవారు. అశుకవిత్వంలోకి break అయేవారు. ఆయన్ని కౌగలించుకోవాలని ఆయన వేపు పరిగెత్తేవారు. ఒకటే అంతులేని నమస్కారాలు పెట్టేవారు. ఆయన పాదాలు అద్దుకోవాలనుకునేవారు. తిట్టేవారు. ధిక్కరించేవారు. నువ్వెంత అని ప్రశ్నించేవారు. పాడేవారు. సోఫా దిగి, లోకాన్నుద్దరించమనేవారు. మూర్చలు పోయేవారు. ఒళ్ళు తెలియక తన్నుకునేవారు.

ఆశ్రమం వారు భోజనం పెట్టము పొమ్మంటే, ఒక్కొక్కరే సరాసరి భగవాన్ దగరికి వచ్చి భోజనం పెట్టించమని అడిగేవారు. భగవాన్ కొందరితో అసలు మాట్లాడరు. కొందరితో 'నాకు వీళ్ళు పెడుతుంటే తింటున్నాను. వీళ్ళు పొమ్మంటే నేనూ పోవాలి. నాకేం అధికారముంది?' అని వూరుకునేవారు. ఇంకొకరు అడిగితే, దగ్గర వున వాళ్ళని పిలిచి అన్నం పెట్టించమని పంపేవారు. ఒక్కొక్కరిని పిలిచి 'భోజనం చేశావా? వెళ్ళి చెయ్యి ' అనేవారు.

ఆశ్రమానికి డబ్బు కూడిన మొదటి రోజుల్లో, ముందు వాకిట్లో కాచుకొని వున్న బీదలకి, ఆవులకి, తక్కిన ప్రాణులకు భోజనం పెడితే కాని భగవాన్ భోజనానికి లేచేవారు కారు. ఆశ్రమంవారు బీదలకి వేరే పల్చని సాంబారు వొండితే, వారితో పోట్లాడి, తానా పల్చని సాంబారు వేసుకుని, వారికి మంచి సాంబారు పోయించేవారు. తను తినే ఇడ్లీలు ఆవులకు పెట్టించేవారు. ఆశ్రమం వారికి ఆ పనులు చాలా కష్టంగా వుండి, యెట్లాగన్నా ఆయన కన్ను కప్పాలని చూసేవారు. విసుగు పుట్టి ఆయన ఆ విషయమై కల్పించుకోవడం మానేశారు. తన భక్తులకి భిన్నంగా తనకేమి అధికంగా పెట్టినా ఉగ్రులయేవారు. తనకి జబ్బుగా వున్నా తనకి తెచ్చిన పళ్ళు పలు అందరికీ పంచాల్సిందే. ఆ విధంగా తనకు ప్రత్యేకత చూపించినందుకు కోపించి - కాఫీ - పాలు మానేశారు భగవాన్ , చాలాకాలం.

భగవాన్ కి ఎప్పుడూ ఏదో జబ్బు చేస్తూనే వుండేది. మందులిప్పించ చూసేవారు. ఎప్పుడూ భగవాన్ మందులు వద్దనేవారు. కాని, వొత్తిడి చేస్తే మీ ఇష్టం కానిమ్మనేవారు. తరువాత ఏ మందులు యెంతకాలం పోసినా మింగేవారు. చివరిదశలో ఆయన దేహాన్ని అంతం చేసిన కురుపు లేచినపుడు ఏ మందూ, ఏ కోతా వద్దన్నారు. ఎట్లా వచ్చిందో అట్లానే పోతుందన్నారు. కాని, రెండుమూడేళ్ళు దానికోసం పోసిన మందల్లా తాగారు. కోసినకోతల్లా కోయించుకున్నారు.

ఏది ఏమైనా ఈ జ్ఞానులందరూ ప్రేమమయులు.
వారు ఏది చేసినా యెట్లా చేసినా అది వారినాశ్రయించినవారి పురోభివృధ్ధికే జరిగేది.

భగవాన్ స్మృతులు | చలం - 5 | ' స్థానం కోసం పోట్లాడుకునేవారు ఘరానా పెద్దలు . . .'

Monday, June 29, 2009
భగవాన్ యే ఆచారాలను పాటించేవారు కారు. తన దగ్గర చేరిన ఆచారవంతుల్ని, ఆ ఆచార బంధనాలనుంచి తప్పించాలని చాలా ప్రయత్నించారు. అంతటి గురువుని యెదురుగా పెట్టుకొని, ఆయన్ని సాక్షాత్ ఈశ్వరావతారమని స్తుతిస్తో - గర్వపడుతూనే, వారి దేవతార్చనలు, వ్రతాలు, మొత్తుబళ్ళు, తీర్థయాత్రలు సమస్తమూ చేస్తోనే వుండేవారు భక్తులు. భగవాన్ని అడిగితే, 'ఏదీ వొద్దు. నిశ్చలంగా కూర్చో. అదే ఉత్తమమైన యాత్ర. . . ' అంటో వారిస్తూ వున్నా పోతూనే వుండేవారు. ఆయన గొప్ప భక్తురాలు, ఎచ్చెమ్మ, ఒకసారి లక్ష తులసి పత్రి వ్రతం చేసి , అలా చేశానని భగవాన్ తో చెప్పుకుంది. 'ఆ చెట్టుని అన్నిసార్లు గిల్లడం కన్న, లక్షసార్లు నిన్ను నువ్వు గిల్లుకోకపోయినావా? ' అన్నారట.

తల్లి చచ్చిపోయిన ఉడత పిల్లని పెంచి, కిందపడి బీటలుపడ్డ పిచిక గుడ్డును తాను స్వయంగా జాగ్రత్తచేసి, పిల్ల ఐతే అందరికీ చూపి ఆనందించేవారు భగవాన్, కాని, ఆయనకి చాలా ఆత్మీయులని అందరూ అనుకునేవారు చచ్చిపోతే, 'అట్లాగా!' అని వూరుకొనేవారు.

పుస్తకాలు బైండువేస్తూ వుంటే, అలమారు చేస్తోవుంటే , ఆ చేసే వారిని విసిగించి, బలవంతం చేసి, పావు అంగుళంలో పదో వంతు కొలతలు కూడా సరిచేయించే వారు. వంటలూ అంతే. ఎట్లా వుండాలో, అన్నో details చెప్పి, చేయించి సరిగా చేస్తున్నారో లేదో లేచి వెళ్ళి చూస్తో వుండేవారు. మళ్ళీ యెంత విలువైనవి కనపడలేదన్నా, పాడైనా ఆయన వినిపించుకోనన్నా వింపించుకోరు.

ఆయన ముందే హాల్లో స్త్రీలను గడకర్రలు పెట్టి నెట్టేవారు సేవకులు. స్థానం కోసం పోట్లాడుకునేవారు ఘరానా పెద్దలు. భోజనం దగ్గర కూచున్న కొత్త వాళ్ళని బయటికి గెంటేవారు. అయినా అట్లా చూస్తో వుండేవారు భగవాన్. కాని, ఒక పిట్టకు, ఒక చెట్టుకు ఏ హాని కలిగినా జాగ్రత్తగా నయం చేసేవారు. హాని చేసేవారిని చూసి ఉగ్రులయేవారు. ఆశ్రమంలో ఏది జరుగుతున్నా ఏమి పట్టించుకోరనీ, అన్నిటికీ ఆయన అతీతులనీ అనిపించేది. ఇంకోప్పుడు ప్రతి చిన్న విషయమూ పట్టుకుని సాగదీస్తో వుంటే, ఆశ్చర్యం వేసేది.

ఎంత గొప్పతనం, ఐశ్వర్యం, అందం, అధికారం లోకంలో ఔన్నత్యం, ఆధ్యాత్మిక సాధన, తపస్సు, కీర్తి, లోకోపకారం, స్వార్థ రాహిత్యం ఆయన ముందు ఏ difference చెయ్యదు. తలెత్తి చూడరు. ఎవరన్నా introduce చేసినా పలుకరు. ఒకర్ని చూసి నిష్కారణంగా పలకరిస్తారు. నవ్వి ఆదరిస్తారు. వారినే మళ్ళీ indifferent గా చూస్తారు. ఒకరు యెంత silly ప్రశ్నలు వేసినా సావధానంగా జవాబు చెబుతారు. వాళ్ళ level కి వచ్చి, ఇంకొకరికి అసలు జవాబు చెప్పరు, ఒకటే ప్రశ్నయినా.

'ఇంకా లోకాలున్నాయా? జన్మలున్నాయా ?' అంటే
'ప్రశ్నించే వారెవరు ?' అంటారూ.

ఇంకొకరికి తక్కిన లోకాలసంగతి, చావు అంటే ఏమిటో - అంతా detailed గా explain చేస్తారు.

భగవాన్ స్మృతులు | చలం - 4 | ' ఒక్కొక్కసారి భగవాన్ పడిపోయేవారు కూడా . . .'

Saturday, June 27, 2009
భగవాన్ని పలకరించడమంటేనే యెంతో భయం. ఏ అధికారమూ, పరివారమూ లేని, బలంలేని ఆ వృధ్ధ స్వరూపం ముందు, గొప్ప పదవుల్లో, అధికారాలలో వుండేవారు, అతి గర్విష్టులు, సైన్యాధికారులు నమస్కరించడానికి వొణికిపోయేవారు. రోజుకి మూడు నాలుగుసార్లు, ఆశ్రమం నించి కొండమీదికి వెళ్ళేవారు భగవాన్. ఆయన ముందు నడుస్తో, వెనక కమండలం పట్టుకుని శిష్యుడూ, ఒక్కొక్క మెట్టే ఎక్కుతూ వుండేవారు. అప్పుడప్పుడు కొండను ఇటూ అటూ చూసి, వెనక్కి తిరిగి శిష్యుడికో చల్లగా మాట్లాడుతూ వుండేవారు. కింద నుంచున్న నా బోటివారు తదేక దృష్టితో ఆయన వంకే చూస్తో, నుంచునేవారు, వారు కనుమరుగయిందాకా, ఏమనిపించేదంటే - అట్లా ఒక్కొక్క మెట్టే యెక్కుతో కొండ చివరికి వెళ్ళి, అక్కడనించి అట్లా ఆకాశంలోకి మాయమై ఇంక తిరిగి రారేమోననిపించేది ప్రతీసారీ.

భగవాన్ చివరి రోజుల్లో కురుపు లేచి ఆపరేషన్లు అయి శరీరం బలహీనమైన తరువాత ఆయన సోఫా మీదనుంచి లేవడానికి చేసే ప్రయత్నం చూస్తే చుట్టూ కూచున్నవారికి ఆ బాధ తను దేహాలలో పలుకుతున్నట్లుండేది. అట్లా బాధ పలకడానికే ఆయన ఆ నెప్పిని పోగొట్టుకునేవారు కారేమో! ఆయన పొందిన మహోన్నత స్థితీ, అనిర్వచనీయమైన ఆనందమూ, అవే కాదు, ఆయన శరీరానికి తటస్థించిన బాధలు కూడా యీ ప్రజల కోసమే గావును! కొన్ని ఏళ్ళు ఆయనకు మోకాళ్ళు నెప్పులు వుండేవి. ఎవరో ఒకరు పంపిన ముందు తైలాన్ని మర్ధన చేస్తోనే వున్నారు, పిసికేవారు.

సోఫామీదనించి లేస్తో భగవాన్ తన మోకాళ్ళని పిసుక్కునేవారు. ఎవరన్నా పిసకపోతే 'వుండవయ్యా! అంతపుణ్యమూ మీకేనా, ఈ మోకాళ్ళని పిసికి నన్ను కొంచెం పుణ్యం సంపాయించుకోనీ ' అనేవారు. ఆయన లేచి నుంచుని కర్రనానుకుని ఒక్కొక్క అడుగు వేస్తోవుంటే, భక్తుల్లో ప్రతివారి వూపిరి యెగిరిపోతూ వుండేది, ఆయన వేసే ప్రతి అడుగుకి.

ఆశ్రమాధికార్లు కట్టించిన కొత్త హాలు రాతి గుమ్మం దాటాడం, అతి ప్రయాస అయేది భగవాన్ కి. చూసేవారికి, చిన్న పిల్లలకి కూడా యెట్లనన్నా కూడా ఆయన్ని పట్టుకుని దాటించాలనిపించేది. కాని తమ భుజాల్ని వూతగా ఇవ్వాలని వెళ్ళే పరిచారకుల్ని విదిలించి పంపించేవారు భగవాన్.

ఒక్కొక్కసారి ఆయన పడిపోయేవారు కూడా. కాని సహాయం మాత్రం తీసుకునేవారు కాదు.

భగవాన్ స్మృతులు | చలం - 3 | 'చాలాసార్లు భగవాన్ మీదే ఆంక్షలూ...'

Friday, June 26, 2009

contd from here


ఆశ్రమంలో తనకి ఇష్టంలేని పని కాని, తను వొద్దన్న పనికాని జరుగుతూ వుంటే పిలిచి చీవాట్లు వేసేవారు. కాని, అప్పటి కి వినకపోతే మాట్లాడకుండా వూరు కొనేవారు. చాలాసార్లు భగవాన్ మీదే ఆంక్షలూ, ఆజ్ఞలూ పెట్టేవారు ఆశ్రమాధికార్లు. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటలదాకా భగవాన్ని ఎవరూ చూడకూడదని నిర్ణయించి, భగవాన్ని, అడగకుండానే హాలు తలుపులు వేయించి వేశారు.



భగవాన్ 'ఇదేమిటి? ' అని అడిగితే, 'మీ ఆరోగ్యం కోసం ' అన్నారు. తలుపులు మ్య్యడానికి వీల్లేదనీ, 24 గంటలూ తలుపులు తెరిచి వుండాలనీ భగవాన్ అన్నా, వినిపించుకోలేదు అధికార్లు. అందుకని ఆయనే హాల్లోంచి బైటికి వొచ్చి కూచున్నారు. కాని, అప్పటికీ ఆశ్రమంవారు ఆయన మాటవినలేదు. ఒకటే బతిమాలారు. చివరికి అట్లాగే కానీ అని హాల్లోనే వుండిపోయినారు భగవాన్. అనేకమంది భగవాన్ కని ఫలహారాలు తెచ్చిపెట్టేవారు, వేళగాని వేళలకూడా ఆయనకి అని జీర్ణమవుతాయా, లేదా అనే ఆలోచన కూడా లేకుండా. చాలాసార్లు తిని బాధపడేవారు భగవాన్. ఒకరు యెంత తెచ్చిపెట్టినా తినేవారు. ఇంకోరు యెంతో భక్తితో విలువైన ఫలహారాలు పెట్టి తినమంటే- అటు తలతిప్పి కూడా చూసేవారు కారు. కొందరు ఆయన ముందు ఫలహారం పెట్టి, ఆయన పలక్కపోతే, అట్లానే చేతులు కట్టుకుని నించుని , నించుని , ఇంక గతిలేక వెళ్ళిపోయేవారు. ఒకరి చేతినుంచి ఇవాళ తిని ఇంకోసారి వాళ్ళు తెస్తే, వాళ్ళవంక చూడనే చూడరు. భగవాన్ demeanour ఎప్పటికప్పుడు మారేది.



ఆయన ఏ ఆనంద నిబిడీకృతమైన తేజోశూన్యంలోకో కిటికీలోంచి దిక్కుల అంచుల్ని దాటి చూస్తున్నప్పుడు, ఆయన ధ్యానముద్రలో కూచున్న సాక్షాత్ దక్షిణామూర్తి అనిపించేవారు. ఫోజులేని ఆ శాంభవీ ముద్ర యెంతో ఆర్టిస్టిక్ గా వుండేది! ఆ అందం నించి కళ్ళు తిప్పుకోలేక పోయేవాళ్ళం. కదలని సూర్యోదయాన్ని చూసినట్లుండేది. ఆయన ముఖంకాని , ఆయన దేహం కాని, మామూలుగా అందాలు అలవాటైనా నా కళ్ళకి అందంగా కనపడేవి కావు.



కాని, ఆయన నిశ్చలంగా, గంభీరంగా కూచున్నారా - (ఆయన దేహం అట్లాగే వుండేది ) కాని, మరి ఏమిటో యింత అందం, ఇంత లావణ్యం! అవేం కాదు, ఏదో మనకు అలవాటైన సౌందర్యాలకి art కూడా అందుకోలేనిదేదో ఆయన్ని వెలిగిస్తున్నట్టుండేది. ఒక్క కౌపీనం పెట్టుకున్న ఆయన , చక్రవర్తి దుకూలాలు కట్టుకుని, రాజలాంఛనాలతో, నవ రత్న సిమ్హాసనంపై కూచున్నట్లుగా వుండి దిగ్ర్భమ చెందేవాళ్ళం.



ఆ స్థితిలోనైనా సరే, ఎవరన్నా 'భగవాన్ ' అన్నారూ - ఎక్కడనించి దిగివొచ్చేదో ఆయనకి యీ లోకస్మృతి,

కాని సర్వాంతర్యామి అయిన ఆయన దృష్టి దిగిరావడమేముంది!

భగవాన్ స్మృతులు | చలం - 2 | భగవాన్ ఆయుష్షు కోసం గ్రహశాంతి, హోమాలు. . .'

Thursday, June 25, 2009


భగవాన్ జబ్బుగా వున్నప్పుడు ఆయన ఆయుష్షు కోసం గ్రహశాంతి, హోమాలు చేశారు. దాంట్లో వుండే Anomaly ఏమీ తోచలేదు, ఆయన ఆయుష్షు కోరేవారికి. ఆ హోమాలు , హారతులు, తీర్థం తీసుకున్నారాయన. తనకు జబ్బు చేస్తే మందు అవసరం లేదంటారు భగవాన్. కాని భక్తులు దిగాలుపడ్డా, మందు తీసుకోమని బతిమాలినా, 'సరే, తెండి ' అని, ఏ మందిచ్చినా అట్లా మింగుతూనే వుండేవారు. వొచ్చిన ప్రజలు సాష్టాంగపడి నమస్కరించేవారు. కాని, భగవాన్ తలతిప్పి కూడా చూసేవారు కారు. కాని, ఎందుకో ఎప్పుడో ఎక్కడో శూన్యంలోకి చూస్తున్నవారు కాస్తా, చప్పున తనకు నమస్కరించేవారి వంక చూసేవారు. ఒక్కొక్కరిని పలకరించేవారు కూడా , నవ్వేవారు. ఎన్నో కుశల ప్రశ్నలు వేసేవారు. దూరదేశాల నించి వొచ్చిన వారిని, పసిపిల్లలని, నడవలేని వృద్దుల్నీ ప్రత్యేకంగా చూసేవారు. అధికారులు, బిచ్చగాళ్ళు, ధనవంతులు, సన్యాసులు, భక్తులు, స్త్రీలు - ఎవ్వరూ దృష్టిని తీసుకోలేకపోయారు.

కొందరు ఎన్నో ప్రశ్నలతో వచ్చి, అడగడం ప్రారంభిస్తే ఎంతకీ పలికేవారు కారు. ఒకర్ని పిలిచి పలకరించి, ఎన్నో విషయాలు చెప్పేవారు. కొందరిని ఏ కారణం లేకుండా, తనని పలకరించగానే కసిరికొట్టేవారు. కొందరిని గట్టిగా తిట్టేవారు. హాస్యం పట్టించి, వెక్కిరించి, అందరూ నవ్వేటట్లు చేసేవారు. కొందరు భక్తులు ఆశ్రమం నుంచి వెళ్ళిపోయిన తరువాత భగవాన్ కలల్లో కనపడి రమ్మంటారు. లేదా, ఆ భక్తుడినే యెంతో నిలువలేని ఆతృత కలుగుతుంది. భగవాన్ని యెప్పుడు చూస్తానా అని, దూరాల నించి ఇబ్బందుల్లోనుంచి ఏదీ లక్ష్యం చేయక యెప్పుడు అంటూ వొస్తాడు ఆశ్రమానికి.

అతను వొచ్చేప్పతికి భగవాన్ తల రెండోవేపు తిరిగి వుంటుంది. అటు చూడరు, పలకరించరు, చిరునవ్వు నవ్వరు కొన్నిరోజులు. యీ లోపల యెందర్ని పలకరిస్తారో? ప్రేమగా పిలిచి, మాట్లాడి కుశల ప్రశ్నలు వేస్తారో!

కొందరు వుండేవారు. వారికి అందరిముందూ భగవాన్ తో మాట్లాడడం గొప్ప. అందరివంకా చూస్తో, కాయితాలో పుస్తకమో పట్టుకుని, ఏదో సందేహాన్ని కల్పించుకుని వెళ్ళీ భగవాన్ని పలకరించి మాట్లాడతారు - మధ్య మధ్య చుట్టూవున్న వారివంక గర్వంగా చూస్తో. యెంతో దూరం నించి వొచ్చి త్వరలో వెళ్ళవలసిన ఇంకోరు తమ సందేహాలతో రోజులకి రోజులు వుండిపోవలసిందే. యెవ్వరికేది అవసరమో, ఏది వారిని తనకి కట్టివేస్తుందో, ఏది వారి అహాన్ని అణుస్తుందో - ఆ విధంగా జరిగిపోయేది భగవాన్ ద్వారా.

భగవాన్ స్మృతులు | చలం - 1 | 'లోకంలో జరిగే అత్యాచారాలకీ, ఈశ్వరుడికీ సంబంధం..'

Tuesday, June 23, 2009


భగవాన్ జీవితంలో ఎన్నో విషయాలు అర్థంకావు - అయన మానవాతీతుడు. ఆయనలో కనపడే వైరుధ్యాలకి మానవుల్లో వెతికినట్లు కారణాలు వెతకటం కాని, విమర్శించడంగాని అజ్ఞానం , ఏ మనిషికి అవసరమైనట్టు ఆ విధంగా మాట్లాడేవారు, ఆచరించేవారు ఆయన. తన చుట్టూ ఆశ్రమంలో జరిగే వాటిలో ఆయనకి ఎంతసంబంధం వుందో చెప్పలేం. సంబంధం వుండనూ వుంది. ఉండనూ లేదు. లోకంలో జరిగే అత్యాచారాలకీ, ఈశ్వరుడికీ సంబంధం వున్నట్టా, లేనట్టా? ఆశ్రమాధికారులూ, ఆశ్రమవాసులూ తరచు ఆయనని అడక్కుండానే ఎన్నో చేసేవారు, భగవాన్ కి ఇష్టం కాదని తెలిసికూడా.

ఆ పనులు భగవాన్ కంటనో, చెవినో పడితేనే గాని, భగవాన్ వాటిని గమనించేవారుకారు. గమనించినప్పుడు ఒక్కొక్కసారి పిలిచి చీవాట్లు వేసే వారు. ఒక్కొక్కసారి యేమీ అనేవారు కారు. ఆశ్రమాధికారి (భగవాన్ తమ్ముడు - చిన్నస్వామి ) మాత్రం భగవాన్ కంటపడకుండా, నిరంతరం నేరస్థుడివలె ఇటూ అటూ తప్పుకు తిరిగేవాడు.

భగవాన్ని దర్శించవచ్చినవారు ఆశ్రమంలో జరిగే ఘోరాలు, అన్యాయాలు, పక్షపాతాలు, డబ్బుగుంజడాలు - ఇవి భగవాన్ తో చెపితే, 'మీరెందుకు వొచ్చారు? ఈ ఆశ్రమంలో జరిగే లోపాల్ని యెంచి సంస్కరించేందుకా అంత దూరం నుంచి వచ్చారు? మీ దేశంలో ఏమీ లేదా సంస్కరించేందుకు? మీరు వచ్చిన పని ఏదో అది చూసుకుని వెళ్ళరాదా?' అనేవారట. ఆశ్రమ ధనం దుర్వినియోగమవుతోందనీ, ధనార్జనే ముఖ్యంగా వుందనీ భగవాన్ తో అంటే, 'వాళ్ళు ధనం కోసం చేరారు, నీకూ ఆ ఆశ వుంటే వాళ్ళలో చేరి చూడు. భాగం పెడతారేమో?' అన్నారట.

తన పేర నెలనెలా వసూలవుతున్న ధనం యెట్లా వినియోగమౌతోందో భగవాన్ పట్టించుకోలేదు. తన పేర యాచించడం భగవాన్ కి యెన్నడూ ఇష్టం లేదు. లక్షలు ఖర్చు పెట్టి కట్టించిన ఆశ్రమాలయానికై యాచించకపోతే, గట్టిగా నిషేధించారు భగవాన్. కాని, విన్నదెవరు? అయినా, పూజలూ, ఊరేగింపులూ, ఉత్సవాలు - ఏవీ లక్ష్యం లేవు భగవాన్ కి. ముఖ్యంగా తనమీద పువ్వులు వెయ్యడం, తనముందు కొబ్బరికాయలు కొట్టడం, హారతులివ్వడం మొదలైనవి ఇష్టం లేదు. పుట్టిన జయంతి చేసినా, చేస్తున్నారు గనుక చూస్తూ కూచునేవారు - కూచోమంటే.

ఆయన దేవతా విగ్రహాల కిచ్చిన హారతి తెచ్చి యిస్తే అందరికి మల్లేనే కళ్ళ కద్దుకుని, విభూతి పెట్టుకునేవారు.

ఆయన్ని తలుచుకుంటే ?

Tuesday, June 2, 2009
భగవాన్ కి జబ్బుగా వుంది. చివరి రోజులవి. దర్శనానికి వచిన వందలాది జనన్ని మధ్యాహ్నం నుంచి క్యూలో నడిపించి దూరమ్నుండి భగవాన్ దర్శనం చేయిస్తున్నారు.

ఆయన ఎవరి వంకా చూసేవారు కాదు.

తన వంక ప్రతిరోజు చూస్తారని చెప్పింది నర్తకి చలంతో.
'ఎట్లా?' అన్నాడు చలం ఆశ్చర్యంతో.

'ఏం లేదు! వెళ్ళేముందు మ్నసులో
'భగవాన్ ! నా వంక చూడండి అనుకుంటాను. చూస్తారు ' అన్నదామె.

ధ్యానంలో వూపిరి ఆగిపోయి

Monday, June 1, 2009
ఒకసారి చలం అడిగాడు

'ధ్యానంలో వూపిరి ఆగిపోయి ఉక్కిరి బిక్కిరై మెళుకువ వస్తుంది.
ఏం చెయ్యను, భగవాన్ ?'

దానికి భగవాన్,
'ఆ ఊపిరి పూర్తిగా ఆగిపోతే ఏ చిక్కూ ఉండదు. '
అని వేళాకోళం చేశారు. అందరూ నవ్వారు.

షౌ (చలం కూతురు ) స్పృతుల్లో భగవాన్

Thursday, May 28, 2009
భగవాన్ చనిపోవడమనే Shock ని నేను భరించగలనా అని బాధ పడేదాన్ని చాలాసార్లు. కాని సరిగ్గా ఆ సమయానికి నేను అరుణాచలంలో వుండకపోవటం సంభవించింది. ఆయన మరణవార్తని విన్నప్పుడు నాలో ఏ చలనమూ కలగలేదు. నా indifference ని చూసి నాకే ఆశ్చర్యమేసింది. కాని వెంటనే ఇది ఆయన నామీద చూపించిన కరుణ అని తెలుసుకున్నాను. నేను మద్రాసులో వుండగా, నాన్న దగ్గిర్నించి ఉత్తరం వొచ్చింది - భగవాన్ సమాధి దగ్గిర, అసలు భగవాన్ జీవించి వునప్పటి కన్నా ఎక్కువ spiritual potency ని feel అవుతున్నానని.

నేను ఆశ్రమానికి తిరిగి వొచ్చినప్పుడు ఆశ్రమమంతా ఎడారి లాగుంది. వెంటనే భగవాన్ presence ని feel అయ్యాను. భగవాన్ కంటికి కనపడనంత మాత్రాన యీ భక్తులందరూ ఎందుకు ఆశ్రమాన్ని వొదిలిపోతున్నారా అని ఆశ్చర్యమేసింది నాకు. సమాధి దగ్గిర కళ్ళు మూసుకుని కూచోగానే భగవాన్ నవ్వుతున్న మొహం ప్రత్యక్షమయేది. కాని ఎంత స్పష్టంగా భగవాన్ని feel అవుతున్నా నా కళ్ళు ఆయన భౌతిక శరీరంకోసం వెతికేవి.

భగవాన్ స్మృతుల్లో చలం అంతర్మథనం | క్లుప్తంగా

I

యీ జగత్తుకీ జీవితానికీ ఓ అర్థం వుంటే, వీటి వెనక ఓ సత్యం వుంటే, పరస్పర విరుద్దమైన యీ విలువలకీ ఓ సమన్వయముంటే, దాన్ని తెలుసుకునే మార్గం లేదనీ, మానవుడి మనసుకి అంతశక్తి లేదు గనక,ఎంత తరిచి చూసినా, అది ఓ గుడ్డి వలయంలో తిరగడం తప్ప, ఇంకేమీ సాధింపలేదనీ నిశ్చయించుకున్నాను. కాని ఎప్పుడూ అన్వేషించడం మాత్రం మానుకోలేదు. ఎంత అర్థం లేకపోయినా సత్యాన్వేషణ అనేది నా జీవితానికి ఓ ప్రధాన లక్షణమై పోయింది. ఏదో నా మనసునీ ఆలోచనలనీ మించిన విశ్వాసముండేది, నాకు దొరకనిదేదో సొల్యూషన్ వుందనీ, యీ లోకమూ జీవితమూ అర్థం విహీనం కావనీ, యీ అయోమయ స్థితిలోనే సగంపైగా నా జీవితం గడిచింది. అట్లాంటి సమయంలో దీక్షితులుగారు వొచ్చి నన్ను తనతో షికారుగా రమణాశ్రమానికి తీసుకొచ్చారు 1936లో.

II


తోవలో భగవాన్ కోసం పళ్ళు కొనమంటే కొననన్నాను. ఆయనకి సాష్టాంగ పడమంటే పడనన్నాను. భగవాన్ ముందు నిశ్చబ్దంగా కూచున్న ప్రజలలో కూచోడం నాకు బాధగా వుంది. వొచ్చినప్పటినించి ఎప్పుడు పోదామా అని దీక్షితులు గారిని వేధిస్తున్నాను. ఆశ్రమంలో మనుష్యుల్ని చూసిన కోద్దీ అసహ్యం పుడుతోంది. 'యీ మహర్షి ఏదో దివ్య పురుషుడంటారు మీరు. మనుషుల్నే మారుస్తాడన్నారు. ఇన్నేళ్ళమట్టి ఆయనని అంటిపెట్టుకొని వున్న వీళ్ళ మొహాలిట్లా వున్నాయేమిటి ?'

ఆ రోజు భగవాన్ కొండమీదికి వెళ్ళి తిరిగి హాలులోకి. మా గుంపు వెనకనించి భగవాన్ వొస్తున్నారు. అందరూ పక్కకి తప్పుకొంటున్నారు. నేనే కదలలేదు, 'చోటు వుంది, పక్కకి తప్పుకుపోతారులే ఆయన ' అనుకుని. భగవాన్ సమీపించేటప్పటికి దీక్షితులుగారు నన్ను పక్కకి లాగేశారు. భగవాన్ నన్ను దాటి వెళ్ళి చప్పున ఆగి, వెనక్కి తిరిగి నన్ను ఓ గొప్ప చిరునవ్వుతో ఓ నిమిషం చూసి వెళ్ళిపోయినారు. ఆ నిమిషాన నాకేమనిపించలేదు గాని, ఇప్పుడు తలుచుకుంటే, ఆ నిమిషం నించే నన్ను జయించేసుకున్నారు భగవాన్ అనిపిస్తుంది.

III

పాత భక్తులూ, ఘరానా వాళ్ళూ భగవాన్ కి దగ్గిరగా కూచునేవారు. నేను చిట్ట చివర కూచుని ఆయన కళ్లలోకే చూస్తో వుండేవాడిని. ఒకసారి భగవాన్ తన దగ్గిర వున్నవాళ్ళని అడిగారు, అందరూ లేచిపోయినా కదలక కూచున్న నన్ను చూపి,

'ఎందుకు అన్ని గంటలూ అట్లా కూచుంటాడు ' అని.
వాళ్ళేదో అన్నారు. అది నా కర్థం కాలేదు. నాకేం కావాలి? ఆధ్యాత్మికోన్నతి. ఆ సంగతి భగవాన్ కి తెలీదా ? అనుకుని మాట్లాడకుండా వూరుకున్నాను. హాల్లోకి భగవాన్ వొస్తున్నపుడు సౌరీస్ దగ్గిర ఆగి చిరునవ్వుతో కొంతసేపు చీసి వెళ్ళేవారు. నేను బలవంతంగా హాల్లో కూచునేవాణ్ణి.
మళ్ళీ ఇంకోసారి అడిగారు దగ్గిరున్న వాళ్ళని,

'ఏం కావాలి? ఎందుకట్లా కూచుంటాడు ?' అని.
అప్పుడూ నేను మాట్లాడలేదు. 'ఏం భగవాన్ కి తెలీదా? '.

ఇప్పుడు తెలుస్తోంది భగవాన్ ప్రశ్నకి అర్థం.
'నన్ను చూస్తో కూచుంటే ఏమొస్తుంది? తనకి తాను సాధించుకోవాలి కాని '

IV

వొయ్యి చచ్చిపోయిన తొందరలోనే అరుణాచలం వెళ్ళాలని నిశ్చయించుకున్నాం. ఆనాడు మాకు మిత్రులు లేరు , ఆదాయం లేదు, ఒక్క భగవాన్ తప్ప ఎవరూ కనిపించలేదు. భగవాన్ కి కూడా చాలా జబ్బుగా వుంది . బతకరంటున్నారు. 1950 మొదట్లో వొచ్చి, ఓ ఇల్లూ పాకా అద్దెకి తీసుకుని వున్నాం. భగవాన్ అంత జబ్బులోనూ , ఎంతో ఆదరంగా చూశారు మా వంక, మా రాకకే ఎదురుచూస్తున్నట్లు. త్వరలోనే భగవాన్ అస్తమించారు. మేం ఆయన ముందు చావాలని వొస్తే, ఆయనే మా ముందు వెళ్ళిపోయారు. భక్తులందరూ వెళ్ళిపోయారు. ఆశ్రమం , మేమూ మాత్రమే మిగిలాం. భయం పుట్టించే వొంటరితనంలోనూ భగవాన్ మమ్మల్నిఆదుకుని, అర్థంగాని ధైర్యమిచ్చి రక్షించారు. భగవాన్ వెళ్ళేముందు తాను ఇక్కడే వుంటానన్నాడు.నా ఆరోగ్యమూ సన్నగిల్లుతోంది. చివరి దశను సమీపిస్తున్నాను.

ఇప్పటికీ నాకు దేవుడిలోగాని, కర్మలోగాని, చావు తరవాత బతుకులోగాని విశ్వాసం లేదు. ఏదన్నా చేస్తే భగవాన్ ఒక్కరే చెయ్యగలరని విశ్వాసం మాత్రం వుంది.


[కుదిరితే యింకెప్పుడైనా వివరంగా ' రమణాశ్రమంలో భగవాన్ తో చలం ' ]

Blessing

Blessing
Bhagavan Memories