Showing posts with label నేనెవరు. Show all posts
Showing posts with label నేనెవరు. Show all posts

'నీకేమి తెలియదనేది ఎట్లా తెలిసింది?'

Friday, January 29, 2010
ఒకానొక ఉదయం ఆశ్రమానికి ఒక యువకుడొచ్చాడు. వచ్చిన రెండు మూడు రోజులు సత్రం భోజనంతో, మఠంలో సుఖ నిద్రతో తింటో పడుకుంటో భగవాన్ సన్నిధి సందర్శన భాగ్యం అనుభవిస్తూ కాలం వెళ్ళబుచ్చుతున్నాడు. వెళ్ళిపోయేముందు ఒకరోజు భగవాన్ ని సమీపించి జంకుతూ

'స్వామీ! ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా మిమ్మల్నేదో అడగటం మీరేదో సెలవిస్తూ వుండటం జరుగుతోంది. ఇదంతా చూస్తుంటే నాకూ యేదో ఆశ కలుగుతోంది. కాని ఏం అడగాలో తెలియకుండా వుంది. ఇక తరించే దెట్లాగా?' అన్నాడు దీనంగా.

భగవాన్ సాదరంగా చూచి 'నీకేమి తెలియదనేది ఎట్లా తెలిసింది?' అన్నారు నవ్వుతూ.

'ఇక్కడికి వచ్చిన వారంతా అడిగే ప్రశ్నలూ మీరు సెలవిచ్చే ప్రత్యుత్తరాలూ వింటూ వుంటే అయ్యో మనకు ఏమీ తెలియదే అనిపిస్తోందీ అన్నాడతను.

దానికి భగవాన్ 'ఆ! ఇంకేం ! ఏమీ తెలియదన్న విషయం తెలుసుకున్నావు. అదే చాలు. ఇంకేం కావాలి?' అన్నారు భగవాన్.

'అంత మాత్రానా తరించేదెట్లాగా స్వామీ?' అన్నాడా పృచ్ఛకుడు.

'ఎట్లాగేమి? ఏమీ తెలియదే అన్నది తెలుసుకునేటందుకు ఒకడున్నాడు కదా. ఆ తెలుసుకునే వాడేవడని చూస్తే తీరిపోతుంది. అన్నీ తెలుసునని అనుకుంటే అహం పెరుగుతుంది. అంతకంటే ఏమీ తెలీదే ఎట్లాగా తరించటం, అన్న తెలివి కలగటం ఎంతో మేలు కదా!' అన్నారు భగవాన్ '.

అంతటితో ఆ యువకుడు యెంతో సంతోషించి బయలుదేరి వెళ్ళిపోయాడు.

భగవాన్! కలియుగం ఎప్పుడు అంతం అవుతుంది? యుగాల గురించి చెప్పండి!

Sunday, July 26, 2009
ఎంతో కాలం నుంచీ అరవిందాశ్రమంలో ఉంటున్న గిరిధారీలాల్ ఒకరోజు సాయంత్రం వచ్చి ఆశ్రమంలోనే ఉన్నారు. ఆయన మర్నాటి ఉదయం భగవాన్ ను

'కలియుగం కొన్ని వేల సంవత్సరాలు ఉంటుందనీ, ఇన్ని సంవత్సరాలు గడిచాయి. ఇంకా ఎన్నో సంవత్సరాలు ఉన్నాయి అనీ పురాణాలలో చెప్పబడి ఉందే. ఈ యుగం ఎప్పుడు అంతమౌతుందో తెలుపుతారా ?' అని అడిగారు.

భగవాన్ 'నేను కాలం నిజం అని అనుకోను. కాబట్టి ఈ రకమైన విషయాలను నేను పట్టించుకోను. గడచిన యుగాలను గురించిగానీ, గడపబోయే వాటిని గురించిగానీ మనకేమి తెలీదు. వర్తమానం ఉందని మాత్రం తెలుసు. మొదట దానిని గురించి తెలుసుకుందాం. అప్పుడు ఇంకే సందేహాలూ మిగులవు ' అన్నారు.

కొంతసేపు ఆగి తిరిగీ భగవాన్ 'కాలదేశాలు ఎప్పుడూ మారుతూనే ఉంటాయి. కానీ, నిత్యమైనదీ, మారనిదీ ఒకటుంది. ఉదా. ప్రపంచమూ, కాలమూ - అది గతముగానీ, భవిష్యత్తుగానీ - ఏవీ మన నిద్రలో ఉండవు. కానీ మనం ఉంటాం. కాబట్టి ఎప్పుడూ మారనిది, ఎప్పుడూ ఉండేది ఏదో దాన్ని కనుక్కోవాలని ప్రయత్నిస్తాం. కలియుగం ఫలాన అప్పుడు పుట్టిందనీ, ఇంకా ఇన్నేళ్ళ తరువాత ఫలాన సంవత్సరం అంతమవుతుందనీ తెలుసుకోవడం వల్ల మనకేం ప్రయోజనం ?'

గిరిధారి లాల్: 'కాల దేశాల కతీతులుగా ఉన్నవారి దృష్టిలో ఈ ప్రశ్నల కర్థంలేదని నాకు తెలుసు. కానీ సమస్యలలో కొట్టుకుంటూ ఉన్న మాలాంటివారికి ఇవి ముఖ్యమే. ముందు యుగాల్లో - సత్యయుగంలో మనిషి ఈ కలియుగంలోలాగా ఇంత దుస్థితికి దిగజారలేదని, ఆ కాలాల్లో ముక్తిని సాధించడం ఇప్పటికన్నా ఎంతో తేలికనీ అన్నారు కదా?'

భగవాన్ : 'దానికి విరుధ్ధంగా సత్యయుగంలో కంటే ఈ కలియుగంలోనే ముక్తి చాలా సులభంగా సాధించవచ్చని కూడా చెప్పి ఉన్నారే! ఆ యుగాల్లో ఎన్నో ఏండ్ల తపస్సుచేత మాత్రమే ఫలించేది. ఈ యుగంలో కొద్దిరోజులు లేదా కొన్ని గంటలు తపస్సుతోనే ఫలించగలదని గ్రంధాలలో చెప్పి ఉందే. ఇంతకూ సాధించేదీ లేదు. ఇంతకాలంలో అన్నమాటా లేదు. నీవు ఎప్పుడూ ఉన్నట్లే ఉన్నావు. నీవు దేనినీ సాధించాల్చిన పనీ లేదు. నీవు పరిమితుడననీ ఉపాధిని ఆశ్రయించి ఉన్నావనీ అనుకోవడాన్ని మానేయడం మాత్రమేనీవు చేయవలసింది.'

గిరిధార్ లాల్ : 'అయితే ఈ పురాణాలు యుగాల కాలపరిమితిని గురించి ఇంత ఖచ్చితంగా ఎందుకు చెప్పాయంటారు ?' భగవాన్ : ' ప్రతి యుగానికీ నిర్ణయించిన సంవత్సర సంఖ్యలో ఏదో విశేషార్థం ఇమిడి ఉంటుంది. అలా కాకుంటే ప్రతి యుగానికి అంత కాల పరిమితి నిర్ణయించడంలో ఉద్దేశం - మనుష్యుడు నిండు నూరేళ్ళూ బ్రతికి ఉన్నా విశ్వం యొక్క పూర్ణాయుర్థాయంలో అతని వయస్సు అత్యంత అల్పమనీ, అనంత సృష్టి క్రమంలో అతని పాత్రకు ఏమాత్రం ప్రాముఖ్యత లేదని గుర్తించి, గర్వంతో తన గొప్పలు చాటుకోకుండా వినయంగా ఉండాలని తెల్పడానికేమో? నిత్యమైన వస్తువుతో పోలిస్తే మనుష్యుని జీవిత ప్రమాణమెంత ? అని అనే బదులు నీ జీవితం ఎంత పరిమితమో ఆలోచించు అని వాళ్ళూ నేర్పారు. అంతే కాకుండా ఆ యుగాలకు ఒక క్రమబద్దమైన అనుక్రమము ఉందని కూడా సూచింపబడింది. అలాంటి మహాయుగాలు ఎన్నెన్ని వచ్చి పోయాయో ఎవరికి తెలుసు? ప్రతి మహా యుగాన్ని నాలుగు యుగాలుగా విభజించారు. ఈ లెక్కలకు అంతు అంటూ లేదు. వివిధ వర్గాల వారికి ఇప్పటి ఈ కలియుగ అంతం గురించి వేర్వేరు సిద్ధాంతాలున్నాయి.

నిద్రలో లాగా కాలమే లేనపుడు ఈ సమస్యలతో ఇంతగా తికమక పడడంలో ప్రయోజనమేమి?

కోరికల్ని ఎలా జయించాలి? తృప్తిపరిచా ? లేక అణచివేశా ?

Saturday, July 18, 2009
ఒకసారి కొన్ని ప్రశ్నలు రాసి వున్న కాగితాన్ని ఒకతను భగవాన్ కు అందించారు.

ప్రశ్న: ఎవరయినా చెప్పినదాన్ని వెంటనే నమ్మే అలవాటును ఎలా వదుల్చుకోవాలి? ఒకరు ఒక ఆదర్శాన్ని చెపితే తక్షణమే నమ్మేసి ఆచరిస్తూ, ఇంకెవరన్నా వచ్చి వేరే ఆదర్శాలను గురించి పొగిడితే వాటిని నమ్మి పాతవి వదిలి వేయడానికి తయారవుతానే!

భగవాన్ : అవునవును. మనకున్న బాధే ఇది. సత్యాన్ని తప్ప మిగతా అన్నిటినీ నమ్మేస్తాం. మనకున్న తప్పు నమ్మకాలను వదిలివేయాలి. ఇది మాత్రమే మనం చేయాల్సింది. అపుడు సత్యం స్వయంగా ప్రకాశిస్తుంది.

ప్రశ్న: ఎంతో ఉత్సాహంగా ఏదో ఒక ఆదర్శం కోసం ప్రయత్నాన్ని ప్రారంభిస్తాను. కానీ రాను రాను ఆ ఉత్సాహం కాస్తా తగ్గి పట్టుదల సడలిపోతుంది. అలా జరగడానికి కారణమేమి? అలా కాకుండా ఉండడానికి నేనేమి చేయాలి?

భగవాన్: ఆరంభంలో నీ ఉత్సాహానికి కారణం ఒకటి ఉన్నపుడు తరువాత నీ నిరుత్సాహానికి కూడా ఒక కారణం ఉండాలి కదా!

ప్రశ్న: ఎందరో గురువులు ఎన్నెన్నో మార్గాలు ఉపదేశిస్తారు. అందులో ఎవర్ని గురువుగా ఎన్నుకోవాలి?

భగవాన్: శాంతి ఎవ్వరి దగ్గర లభిస్తుందో అతనినే.

ప్రశ్న: కోరికలను వదల్చుకోవడానికి వాటితో ఏ విధంగా వ్యవహరించాలి? వాటిని తృప్తిపరిచా? లేక అణచివేశా?

భగవాన్ : తృప్తి పరచితే కోరిక నశించేటట్లయితే తృప్తిపడటంలో నష్టంలేదు. కానీ సామాన్యంగా కోరికలేవీ ఆ రకంగా నశించిపోవు. అలా చేయడం మంటలను ఆర్పడానికి పెట్రోలును మంటలమీద పోయడంలాంటిది. బలవంతంగా కోరికలను అణచడం సరియైన మార్గం కాదు. అణచిన కోరికలు అపుడు కాకపోయినా ఇంకొక్కప్పుడైనా విజృంభించి చెడు ఫలితాలకు కారణమవుతాయి.

కోరికలను వదల్చుకోవడనికి సరియైన మార్గం -
ఈ కోరిక లెవరికి? మూలమేమి ? అని తెలుసుకోవడమే.


అలా తెలుసుకున్న తరువాత ఆ కోరిక సమూలంగా నశించిపోతుంది. ఆ తరువాత అని మళ్ళీ తలెత్తడం, పెరగడం ఉండదు. కాలకృత్యాలు తీర్చుకోవడం, తినడం, తాగడం లాంటి చిన్న అవసరాలు తీర్చడంలో ఇబ్బందిలేదు. అవి నీ మనసులో వాసనలను నాటి ఇంకో జన్మకు కారణం కాదు. ఆ పనులన్నీ జీవితాన్ని గడపడానికి అవసరమౌతాయేగానీ వాసనలుగా మారే అవకాశం లేదు. తృప్తి పరచడం ద్వారా ఇంకా ఇంకా కోరికలు పెరిగి మనసులో కొత్త వాసనలను కల్పించనట్టి కోరికలను తృప్తిపరచడంలో నష్టంలేదు అని సామాన్యమైన సూత్రం.

భగవాన్ ! ప్రపంచం క్లిష్ట సమయంలో ఉంది. దీనికి పరిష్కారం సూచించండి

Sunday, June 21, 2009
రమణ మహర్షి ధ్యాన సంపత్తిని సముద్రాలు దాటించి మహర్షిని విశ్వర్షిగా మలిచిన తొలి పాశ్చాత్య భక్త వరేణ్యుడు పాల్ బ్రంటన్. పాల్ బ్రంటన్ ఇంగ్లండులో ప్రముఖ జర్నలిస్టు. మంచి రచయిత, సాహితీపరుడు. ఆంత్రోపాలజీ, మతం వంటి విషయాలపట్ల ఆసక్తి కలవాడు. చేస్తున్న ఉద్యోగం వదిలి 1930 లో భారతదేశం వచ్చాడు. భారతదేశంలోని యోగులు,మహర్షులపైన పరిశోధన చేయాలన్నది అతని సంకల్పం. భారతదేశం వేదభూమి, కర్మభూమి, తపోభూమి. ఇక్కడ అడుగడుగునా యోగులుంటారని, ఇది అంతా కీకారణ్యమని పాశ్చాత్యుల భావన.పాల్ బ్రంటన్ తన తత్వజిజ్ఞాసలో భాగంగా చాలా దేశాలు పర్యటించాడు. ఈజిఫ్టులో రహస్య స్థావరాలలో ఉండే మాంత్రికుల్ని, తాంత్రికుల్ని కలిశాడు. ముంబాయిలో మహమూద్ బే అనే సూఫీ యోగి ని కలిశాడు. నాసిక్ లో మెహర్ బాబాను, ఆయన గురువును దర్శించాడు. పూనేలో బాబాజాన్ ని పరిచయం చేసుకున్నాడు. సుఖానంద రాజగోపాలస్వామిని, కాంచీపురంలో శంకరాచార్యను కలుసుకున్నాడు.

కంచి శంకరాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర స్వామిని సేవించి తనకు జ్ఞానమార్గం చూపమని అర్థించాడు. ఆయనే పాల్ బ్రంటన్ ను రమణ మహర్షివద్దకు వెళ్లమని సలహా చెప్పాడు. తన శిష్యుడు వెంకటరమణిని బ్రంటన్ కు తోడుగా పంపారు. తాను దేశ పర్యటనలో వున్నానని, తర్వాత వచ్చి దర్శనం చేసుకుంటానని చెప్పమని మరీ చెప్పి పంపారు. కంచి శంకరాచార్య రమణ మహర్షిని తన హృదయస్థ గురువుగా భావించేవారు.

పాల్ బ్రంటన్ మద్రాసు నిండి తిరువణ్ణామలై చేరుకున్నాడు. ఆశ్రమం చేరి మహర్షికి నమస్కారం చేసి ఎదురుగా కూర్చున్నాడు. మహర్సి సన్నిధిలో చాలా మంది భక్తులున్నారు. అందరూ నిశ్శబ్దంగా, ధ్యానంలో ఉన్నారు. మహర్షి ఎంతో నిర్మలంగా, ప్రశాంతంగా ఉన్నారు. భక్తుల తృప్తికోసం అలా కూర్చున్నారేమో అనిపించింది. అంత నిబ్బరంగా, ప్రపంచ, పరిసరాలు ఏవీ పట్టనట్లు ఉండడం ఎలా సాధ్యం !

అలా అనుకున్న మరుక్షణంలో అతని మనస్సు శూన్యమైంది. నిరామయమైంది. లోపల ఒక్క భావం కదలడం లేదు. తనలో చకచక వస్తున్న మార్పులకు ఉక్కిరిబిక్కిరైనాడు. తన చూట్టూ కాంతి ప్రవాహాలు, తనలో శాంతి తరంగాలు. ఆలోచనలతో కలవరపడే మనస్సు క్షణంలో నిర్మలమైంది. ఇది ఎలా సాధ్యం? ఆ క్షణంలో అనిపించింది 'మనిషి వివేకమే సమస్యల్ని సృష్టిస్తుందని '. ఆ వివేకమే తను సృష్టించుకున్న సమస్యలకు పరిష్కారం వెదుకుతుంది. రెండింటికీ మనసే మూలం, ఆధారం. తనలో అంతటి శాంతికి, ప్రశంతతకి కారణం మహర్షి దర్శనం, మహర్షి వీక్షణం. ఆ విషయం తెలుసుకోడానికి క్షణకాలం పట్టలేదు బ్రంటన్ కు.

ఆ తర్వాత పాల్ బ్రంటన్ భగవాన్ తో చాలాసార్లు సంభాషణలు జరిపాడు. వాటిల్లో కొన్ని

'ప్రపంచ భవిస్యత్తు ఎలా ఉంటుంది? ప్రపంచం క్లిష్ట సమయంలో ఉంది. దీనికి పరిష్కారం సూచించండి!'
'భవిష్యత్తు గురించి ఇప్పుడెందుకు ఆలోచన. ప్రపంచం గురించి మీరెందుకు విచారిస్తారు? మీకు వర్తమానం తెలియదు. వర్తమానం గురించి తెలియనివారు భవిష్యత్తును ఏం బాగు చేస్తారు? మీరు ప్రస్తుతాన్ని చక్కదిద్దుకోండి. భవిష్యత్తు తన పని తను చూసుకుంటుంది.'

'భగవాన్ ! ప్రపంచ దేశాల మధ్య ఇకనైనా మైత్రి నెలకొంటుందా? లేక ఇలాగే వినాశం వైపు పరుగులు తీస్తుందా?'
'పాల్! లోకాన్ని పాలించే వాడొకడున్నాడు. తను చూసుకుంటాడు ప్రపంచం సంగతి. ఈ ప్రపంచం బాధ్యత ఆయనది, ఆ పని నీది కాదు.'

'ఏమిటో భగవాన్ ! చుట్టూ చూస్తుంటే అంతా అయోమయం. ఎక్కడ సహాయానుభూతి కనిపించదు. '
'నీవు ఎంతో ప్రపంచమూ అంతే. నిన్ను నీవు అర్థం చేసుకోకుండా ప్రపంచాన్ని ఏం అర్థం చేసుకుంటావు! అయినా అది సత్యాన్వేషుల పని కాదు. అలాంటి ప్రశ్నలతో కాలాన్ని, శక్తిని వృధా చేసుకోవద్దు. ముందుగా నీ వరకు సత్యాన్ని అన్వేషించు. సత్యాన్ని తెలుసుకో. తర్వాత నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, ప్రాపంచిక సత్యాన్ని అవగాహన చేసుకోవచ్చు. ప్రపంచంలో ఉన్నది నీవొక్కడివే కాదు. ప్రపంచం నీ వొక్కడితో లేదు. అసలు ప్రపంచానికి నీవు భిన్నం అని ఎందుకనుకుంటున్నావు?'

గీతా శ్లోకం పై భగవాన్

Friday, May 29, 2009
ఒకరోజు భగవాన్ భోజనానికి లేవబోతున్నారు. అప్పుడు ఒకరు -

'చాతుర్వర్ణం మయాసృష్టం
గుణకర్మ విభాగినః అని అంటారే!
అంటే గుణమునుబట్టి కదా వర్ణాన్ని తీర్మానించవలసింది? ' అని ప్రశ్న వేశారు. భ

గవాన్ కి తెలీదా? దేనికి ఆ ప్రశ్న lead చెయ్యబోతోందో.

'యీ ప్రశ్నలు తగూలూ తెచ్చిపెట్టడానికే కద! యీ దురుద్దేశాల వల్లనే అనర్థాలు పుట్టేది. నీ సంగతి నువ్వు చూసుకో. నిన్ను నువ్వు తెలుసుకోటానికి కులమూ, వర్ణమూ అడ్డం వొచ్చాయా? తానెవరో తెలీదు, నీకేం కావాలో తెలీదు, లోకానికేం కావాలో తెలుస్తుందా ? మీరా లోకాన్ని ఉద్దరించేవారు? ' అని మందలించారు.

Blessing

Blessing
Bhagavan Memories