భగవాన్! కలియుగం ఎప్పుడు అంతం అవుతుంది? యుగాల గురించి చెప్పండి!

Sunday, July 26, 2009
ఎంతో కాలం నుంచీ అరవిందాశ్రమంలో ఉంటున్న గిరిధారీలాల్ ఒకరోజు సాయంత్రం వచ్చి ఆశ్రమంలోనే ఉన్నారు. ఆయన మర్నాటి ఉదయం భగవాన్ ను

'కలియుగం కొన్ని వేల సంవత్సరాలు ఉంటుందనీ, ఇన్ని సంవత్సరాలు గడిచాయి. ఇంకా ఎన్నో సంవత్సరాలు ఉన్నాయి అనీ పురాణాలలో చెప్పబడి ఉందే. ఈ యుగం ఎప్పుడు అంతమౌతుందో తెలుపుతారా ?' అని అడిగారు.

భగవాన్ 'నేను కాలం నిజం అని అనుకోను. కాబట్టి ఈ రకమైన విషయాలను నేను పట్టించుకోను. గడచిన యుగాలను గురించిగానీ, గడపబోయే వాటిని గురించిగానీ మనకేమి తెలీదు. వర్తమానం ఉందని మాత్రం తెలుసు. మొదట దానిని గురించి తెలుసుకుందాం. అప్పుడు ఇంకే సందేహాలూ మిగులవు ' అన్నారు.

కొంతసేపు ఆగి తిరిగీ భగవాన్ 'కాలదేశాలు ఎప్పుడూ మారుతూనే ఉంటాయి. కానీ, నిత్యమైనదీ, మారనిదీ ఒకటుంది. ఉదా. ప్రపంచమూ, కాలమూ - అది గతముగానీ, భవిష్యత్తుగానీ - ఏవీ మన నిద్రలో ఉండవు. కానీ మనం ఉంటాం. కాబట్టి ఎప్పుడూ మారనిది, ఎప్పుడూ ఉండేది ఏదో దాన్ని కనుక్కోవాలని ప్రయత్నిస్తాం. కలియుగం ఫలాన అప్పుడు పుట్టిందనీ, ఇంకా ఇన్నేళ్ళ తరువాత ఫలాన సంవత్సరం అంతమవుతుందనీ తెలుసుకోవడం వల్ల మనకేం ప్రయోజనం ?'

గిరిధారి లాల్: 'కాల దేశాల కతీతులుగా ఉన్నవారి దృష్టిలో ఈ ప్రశ్నల కర్థంలేదని నాకు తెలుసు. కానీ సమస్యలలో కొట్టుకుంటూ ఉన్న మాలాంటివారికి ఇవి ముఖ్యమే. ముందు యుగాల్లో - సత్యయుగంలో మనిషి ఈ కలియుగంలోలాగా ఇంత దుస్థితికి దిగజారలేదని, ఆ కాలాల్లో ముక్తిని సాధించడం ఇప్పటికన్నా ఎంతో తేలికనీ అన్నారు కదా?'

భగవాన్ : 'దానికి విరుధ్ధంగా సత్యయుగంలో కంటే ఈ కలియుగంలోనే ముక్తి చాలా సులభంగా సాధించవచ్చని కూడా చెప్పి ఉన్నారే! ఆ యుగాల్లో ఎన్నో ఏండ్ల తపస్సుచేత మాత్రమే ఫలించేది. ఈ యుగంలో కొద్దిరోజులు లేదా కొన్ని గంటలు తపస్సుతోనే ఫలించగలదని గ్రంధాలలో చెప్పి ఉందే. ఇంతకూ సాధించేదీ లేదు. ఇంతకాలంలో అన్నమాటా లేదు. నీవు ఎప్పుడూ ఉన్నట్లే ఉన్నావు. నీవు దేనినీ సాధించాల్చిన పనీ లేదు. నీవు పరిమితుడననీ ఉపాధిని ఆశ్రయించి ఉన్నావనీ అనుకోవడాన్ని మానేయడం మాత్రమేనీవు చేయవలసింది.'

గిరిధార్ లాల్ : 'అయితే ఈ పురాణాలు యుగాల కాలపరిమితిని గురించి ఇంత ఖచ్చితంగా ఎందుకు చెప్పాయంటారు ?' భగవాన్ : ' ప్రతి యుగానికీ నిర్ణయించిన సంవత్సర సంఖ్యలో ఏదో విశేషార్థం ఇమిడి ఉంటుంది. అలా కాకుంటే ప్రతి యుగానికి అంత కాల పరిమితి నిర్ణయించడంలో ఉద్దేశం - మనుష్యుడు నిండు నూరేళ్ళూ బ్రతికి ఉన్నా విశ్వం యొక్క పూర్ణాయుర్థాయంలో అతని వయస్సు అత్యంత అల్పమనీ, అనంత సృష్టి క్రమంలో అతని పాత్రకు ఏమాత్రం ప్రాముఖ్యత లేదని గుర్తించి, గర్వంతో తన గొప్పలు చాటుకోకుండా వినయంగా ఉండాలని తెల్పడానికేమో? నిత్యమైన వస్తువుతో పోలిస్తే మనుష్యుని జీవిత ప్రమాణమెంత ? అని అనే బదులు నీ జీవితం ఎంత పరిమితమో ఆలోచించు అని వాళ్ళూ నేర్పారు. అంతే కాకుండా ఆ యుగాలకు ఒక క్రమబద్దమైన అనుక్రమము ఉందని కూడా సూచింపబడింది. అలాంటి మహాయుగాలు ఎన్నెన్ని వచ్చి పోయాయో ఎవరికి తెలుసు? ప్రతి మహా యుగాన్ని నాలుగు యుగాలుగా విభజించారు. ఈ లెక్కలకు అంతు అంటూ లేదు. వివిధ వర్గాల వారికి ఇప్పటి ఈ కలియుగ అంతం గురించి వేర్వేరు సిద్ధాంతాలున్నాయి.

నిద్రలో లాగా కాలమే లేనపుడు ఈ సమస్యలతో ఇంతగా తికమక పడడంలో ప్రయోజనమేమి?

కోరికల్ని ఎలా జయించాలి? తృప్తిపరిచా ? లేక అణచివేశా ?

Saturday, July 18, 2009
ఒకసారి కొన్ని ప్రశ్నలు రాసి వున్న కాగితాన్ని ఒకతను భగవాన్ కు అందించారు.

ప్రశ్న: ఎవరయినా చెప్పినదాన్ని వెంటనే నమ్మే అలవాటును ఎలా వదుల్చుకోవాలి? ఒకరు ఒక ఆదర్శాన్ని చెపితే తక్షణమే నమ్మేసి ఆచరిస్తూ, ఇంకెవరన్నా వచ్చి వేరే ఆదర్శాలను గురించి పొగిడితే వాటిని నమ్మి పాతవి వదిలి వేయడానికి తయారవుతానే!

భగవాన్ : అవునవును. మనకున్న బాధే ఇది. సత్యాన్ని తప్ప మిగతా అన్నిటినీ నమ్మేస్తాం. మనకున్న తప్పు నమ్మకాలను వదిలివేయాలి. ఇది మాత్రమే మనం చేయాల్సింది. అపుడు సత్యం స్వయంగా ప్రకాశిస్తుంది.

ప్రశ్న: ఎంతో ఉత్సాహంగా ఏదో ఒక ఆదర్శం కోసం ప్రయత్నాన్ని ప్రారంభిస్తాను. కానీ రాను రాను ఆ ఉత్సాహం కాస్తా తగ్గి పట్టుదల సడలిపోతుంది. అలా జరగడానికి కారణమేమి? అలా కాకుండా ఉండడానికి నేనేమి చేయాలి?

భగవాన్: ఆరంభంలో నీ ఉత్సాహానికి కారణం ఒకటి ఉన్నపుడు తరువాత నీ నిరుత్సాహానికి కూడా ఒక కారణం ఉండాలి కదా!

ప్రశ్న: ఎందరో గురువులు ఎన్నెన్నో మార్గాలు ఉపదేశిస్తారు. అందులో ఎవర్ని గురువుగా ఎన్నుకోవాలి?

భగవాన్: శాంతి ఎవ్వరి దగ్గర లభిస్తుందో అతనినే.

ప్రశ్న: కోరికలను వదల్చుకోవడానికి వాటితో ఏ విధంగా వ్యవహరించాలి? వాటిని తృప్తిపరిచా? లేక అణచివేశా?

భగవాన్ : తృప్తి పరచితే కోరిక నశించేటట్లయితే తృప్తిపడటంలో నష్టంలేదు. కానీ సామాన్యంగా కోరికలేవీ ఆ రకంగా నశించిపోవు. అలా చేయడం మంటలను ఆర్పడానికి పెట్రోలును మంటలమీద పోయడంలాంటిది. బలవంతంగా కోరికలను అణచడం సరియైన మార్గం కాదు. అణచిన కోరికలు అపుడు కాకపోయినా ఇంకొక్కప్పుడైనా విజృంభించి చెడు ఫలితాలకు కారణమవుతాయి.

కోరికలను వదల్చుకోవడనికి సరియైన మార్గం -
ఈ కోరిక లెవరికి? మూలమేమి ? అని తెలుసుకోవడమే.


అలా తెలుసుకున్న తరువాత ఆ కోరిక సమూలంగా నశించిపోతుంది. ఆ తరువాత అని మళ్ళీ తలెత్తడం, పెరగడం ఉండదు. కాలకృత్యాలు తీర్చుకోవడం, తినడం, తాగడం లాంటి చిన్న అవసరాలు తీర్చడంలో ఇబ్బందిలేదు. అవి నీ మనసులో వాసనలను నాటి ఇంకో జన్మకు కారణం కాదు. ఆ పనులన్నీ జీవితాన్ని గడపడానికి అవసరమౌతాయేగానీ వాసనలుగా మారే అవకాశం లేదు. తృప్తి పరచడం ద్వారా ఇంకా ఇంకా కోరికలు పెరిగి మనసులో కొత్త వాసనలను కల్పించనట్టి కోరికలను తృప్తిపరచడంలో నష్టంలేదు అని సామాన్యమైన సూత్రం.

'ఆ గిన్నెను ముట్టుకున్నావెలాగ ? మాలవాడు తెచ్చి పెట్టాడిప్పుడే ' అన్నారు భగవాన్.

Wednesday, July 15, 2009
భగవాన్ జాతి కుల మత భేదాలు ఆటించరు. అళగమ్మ పూర్వాచార పరాయణురాలు. తల్లి మూడనమ్మకాలూ, అర్థంలేని ఆచారాలూ మానిపించడానికి ఎంతో పాటుపడ్డారు.

'నీ మడిబట్టనెవరో తాకారం' టారు భగవాన్. అళగమ్మ మళ్ళీ బట్ట తడిపి ఆరేసుకుని స్నానం చేస్తుంది. 'ఆ గిన్నెను ముట్టుకున్నావెలాగ ? మాలవాడు తెచ్చి అక్కడ పెట్టాడిప్పుడే ' అంటారు భగవాన్. అళగమ్మ మళ్ళీ స్నానం చేస్తుంది. పాపం, వయసు మళ్ళిన తల్లి, రోజుకెన్నిమాట్లని స్నానం చెయ్యగలదూ !

ఎవరో చెప్పారు భగవాన్ నిత్యశుచి, వారిని తాకితే చాలు, వేరే స్నానం చెయ్యక్కర్లేదని. అప్పటినుంచీ అలా చెయ్యడం ప్రారంభించింది. అళగమ్మకు ఉల్లిపాయలూ, మునగ కాయలూ, వగైరా నిషిద్దం. ఈ పిచ్చి ఊహలని పోగొట్టాలని భగవాన్ ప్రయత్నం.

'అమ్మా, యీ వేళ ఆశ్రమంలో ఉల్లిపాయలూ, మునగకాయలూ తప్ప మరింకేవీ లేవు. తిన్నావో, నువ్వు స్వర్గానికెళ్లేటపుడు ఉల్లిపాయ పర్వతాలూ, మునగమహారణ్యాలు అడ్డొస్తాయి, ఎలాగమ్మా ' ? అంటారు. ఎన్ని విధాలో ప్రయత్నించారు భగవాన్ - తల్లి మూడనమ్మకాలు పోగొట్టడానికి, చివరికి పోయాయి కూడానూ. అళగమ్మ పూర్తిగా మారిపోయింది. భగవాన్ ఆమెను దిద్దవలసినరీతిగా తీర్చిదిద్దారు. భగవాన్ తల్లిననే తన ప్రత్యేకతను విస్మరించింది. ఇప్పుడామె భగవాన్ భక్తులలో భక్తాగ్రగణ్య. భగవాన్ కి సంపూర్ణ శరణాగతి చెందింది. కర్తవ్య నిర్వహణనాచరిస్తూ వుంటోంది.

భగవాన్ అతనితో - ' శివ శివ అనుకో - పో ' అన్నారు.

Saturday, July 11, 2009
ఆశ్రమం ఏర్పడ్డ మొదటి రోజులలో హరిజనుడు ఒకడు ఆశ్రమం బయట గుమ్మం దగ్గర నుంచుని ఉండేవాడు, తనని లోపలకు రానీయరు కనుక. భగవాన్ బయటికి వెళ్ళినప్పుడల్లా వారి వెంట అతను వెళ్ళేవాడు. తిరిగి భగవాన్ ఆశ్రమంలోకి వెళ్ళేటప్పుడు గుమ్మం దగ్గర నిలిచిపోయేవాడు ఆ భక్తుడు.

కొన్నాళ్ళు అలా జరిగింది.
ఒక సాయంత్రం భగవాన్ బయటికి వెళ్ళివచ్చి, బావి దగ్గర నించున్న ఆ హరిజనుణ్ణి తన వద్దకు రమ్మని పిలిచారు. అతను సాష్టాంగపడి నించున్నాడు.

భగవాన్ అతనితో -
'శివ శివ అనుకో - పో ' అన్నారు.

అతను వెళ్ళిపోయినాడు అంతే. తిరిగి యెవ్వరికీ కనబడలేదు.

యీ కాఫీ భగవాన్ ప్రసాదం, తాగి తీరాల్సిందే . . .

Friday, July 10, 2009
ఒకసారి ఓ భక్తుడు ఆశ్రమానికి వచ్చాడు. అతనికి కాఫీ, టీ మొదలైనవి అలవాటు లేవు. ఆశ్రమంవారు అతనికి కాఫీ ఇచ్చి తాగమన్నారు. అతను తనకు అలవాటు లేదంటే,
'భగవాన్ ప్రసాదం, తాగి తీరా' లన్నారు .అతను వెళ్ళి భగవాన్ ని అడిగాడు
'స్వామీ, కాఫీ మీ ప్రసాదమట. నాకు అలవాటు లేకపోయినా, అయిష్టమయినా తాగితీరాలా?
తమరు అది తమ ప్రసాదమంటే, తాగుతాను ' అని.

భగవాన్ ఆశ్రమాధికారులతో ఇట్లా అన్నారు.
'నే నెన్నడన్నా మిమ్మల్ని అడిగానా, నాకు కాఫీ యిమ్మని? నేను తాగకపోయినా మీరు ఎట్లాగూ తాగేదానికి, కొంత స్వామికి పోసేది, అది స్వామి ప్రసాదమని వొంక పెట్టుకు తాగేది. పైగా ఎవరన్నా తాగను, వద్దంటే అదో నింద, స్వామి ప్రసాదం నిరాకరిస్తున్నారని. ఈ ఆశ్రమం వారికి ఏదేది యిష్టమో దానికంతా స్వామి ప్రసాదమని పేరు. '

ఒక వ్యక్తి చిన్నతనంలోనే మరణించడం, మరొకరు చిరకాలం. . .

Tuesday, July 7, 2009
భగవాన్ ని ఒకరు అడిగారు - 'ఒక వ్యక్తి చిన్నతనంలోనే మరణించడం, మరొకరు చిరకాలం జీవించడం జరుగుతూనే వుంది కదా, వీరిద్దరిలో ఎవరెక్కువ పాపం చేసిన వారు ? '
భగవాన్ మౌనంగా వున్నారు.
మళ్ళీ అతనే 'ఒకరు ఎక్కువ కాలం జీవిస్తే మోక్షాన్ని చేరడం కొరకు
ప్రయత్నించడానికి ఎక్కువ అవకాశముంటుంది గదా?' అని ప్రశ్నించాడు.

దానికి భగవాన్ 'ఎక్కువ కాలం బ్రతికి ప్రయత్నించే వ్యక్తికన్నా
చిన్నతనంలో మరణించి పునర్జన్మలో మోక్షానికి అనుకూలమైన అవకాశాలు ఎక్కువగా వుంటాయి '

'కర్మలను త్యాగం చేయవలెనని చెప్పడానికి అర్థం వీలయినంతవరకు కర్మలను తగ్గించుకోవాలనేనా?'

'కర్మలను వదలమనడంలోని అర్థం కర్తవు నీవనుకోకుండా కర్మలమీదా, కర్మఫలం మీదా మోహాన్ని వదలమని, నీ కర్మలను అనుభవించడం కోసంగా యీ దేహం లభించిందో వాటిని అనుభవించే తీరాలి. వాటిని వదలివేయడమన్నది వ్యక్తియొక్క ఇష్టాయిష్టాలమీద ఏ మాత్రం ఆధారపడదు'.

మీ భగవాన్ గొప్పవారైనా, మీలాగే తిని నిద్రిస్తూ . . . జబ్బు పడుతో . . .

Monday, July 6, 2009
ఒకప్పుడు మరుళశంకరర్ అనే పేరుగలాయన ఒక మఠం వద్ద ఎంగిలాకులు పారవేసేచోట పిచ్చివానిలా నివసిస్తూ ఉండేవాడు . ఆ మఠాధిపతికి గాని, వారి శిష్యులకుగాని యీ వ్యక్తిని గురించి ఏమీ తెలియదు. ఒకసారి అల్లమప్రభువు ఆ దారిన వెళ్ళగా మరుళశంకరర్ లేచి వారి పాదాలకు నమస్కారము చేయగా అల్లమప్రభువు వారిని కౌగిలించుకొన్నారు. వారిరువురికి ఎదుటివాళ్ళ విలువ బాగా తెలుసు. జ్ఞాని మాత్రమే యింకొక జ్ఞానికి గుర్తించగలరేమో. క్రియా చర్యా, యోగములలాంటివి అభ్యసించే వాళ్ళను వాళ్ళ నడవడివల్లనే గుర్తిస్తారేమో.

రమణాశ్రమానికొచ్చేవాళ్ళల్లో ఎంతోమంది భగవాన్ గురించి

'మీ భగవాన్ ఎంతో గొప్పవారు,
ఆత్మజ్ఞాని అని మీరందరూ ఎలా అనుకుంటారు?
ఆయన కూడా మీలాగే తిని నిద్రిస్తూ
మిగిలిన పనులన్నీ చేసుకుంటున్నారు కదా?
అప్పుడప్పుడు ఆయనకి జబ్బు కూడా చేస్తుంది కూడానూ' అని అంటూంటారు

అంతా మాయ కదా! అన్నమూ మాయె, మీరు తినడమూ మాయె.

Sunday, July 5, 2009
భక్తులు అనేకమంది తీసుకొని వచ్చి యిచ్చేవారు, పంపేవారు పోస్టులో మందులు భగవాన్ కి - కాళ్ల నెప్పులకు రాసుకోటానికి, వంటికి బలానికీ, ఇట్లా ఎన్నో బుడ్లు చేరాయి భగవాన్ దగ్గిర అన్ని రకాల వైద్యాలవి. ఒకసారి భగవాన్ ఒక పెద్ద ఖాళీ బుడ్డి తెమ్మన్నారు. తెచ్చాక తన దగ్గర చేరుకున్న బుడ్లలోని మందులన్నీ దాంట్లో పోయమన్నారు. తాగేవి, రాసుకునేవీ అన్నీ పోశాక వాటి నన్నింటిని కలిపినదాన్ని రోజూ ఒకగరిటెడు తనకు తాగటానికిమ్మన్నారు. ఇలా కలిపిన మిశ్రమం వల్ల వాటిల్లో కొన్ని విషాలు.

'ఇదేమిటి భగవాన్ ?' అన్నారు.
'అవును, నామీద ప్రేమతో, భక్తితో యిన్ని మందులు, పంపుతారు, యిస్తారు.
ఇవన్నీ ఎట్లా తాగి, రాసుకుని వారిని తృప్తి పరచను? కలిపి తాగేస్తే సరిపోతుంది ' . అన్నారు.

డాక్టరు పరుగెత్తుకుంటూ వచ్చాడు అలోపతీ, ఆయుర్వేదం, హోఇయోపతి మందులు, పూతలు, తైలాలు, విషాలు, అన్నీ చూశాడు. హడలిపోయినాడు. అందరూ కలిసి ఒక్కటే మొర, తాగవదని భగవాన్ తో. బుడ్డి తీసుకుపోయి దాచెయ్యడం చాలా కష్టమైపోయింది.

ఒకసారి భక్తురాలు ఎచ్చెమ్మ తాను చేసిన ప్రసాదం వడ్డించింది భగవాన్ విస్తట్లో.
'ఏమిటి, యింత ఎట్లా తినను?' అన్నారు భగవాన్.
దానికి ఆమె -
'అంతా మాయ కదా!
అన్నమూ మాయె, మీరు తినడమూ మాయె.
దీంట్లో సత్యమెక్కడ వుంది, మీకు జబ్బు చేసేందుకు?' అంది.

భగవాన్ , 'చూశారా, మనం అన్నమాటలు మనకే ఎట్లా వప్పగిస్తారో!' అని నవ్వారు.

భగవాన్! మీరు చిక్కిపోతున్నారు, హార్లిక్సు చేసి తీసుకొచ్చాను.

Saturday, July 4, 2009
ఎవరు ఏ వేళప్పుడు ఏం తీసుకొచ్చినా భగవాన్ తినేవారు. ఆయన వంటికి జబ్బు చేసేది చాలాసార్లు ఆ ఫలహారాలవల్ల, ఎవరన్నా తన దగ్గర వుంటే అందరికీ పంచితీరాలి, ఆ ఫలహారాల్ని. కాని, ఒక్కొక్కరు తీసుకొని వస్తేనా, అదే పనిగా తీసుకొస్తూ వుంటేనూ తాకేవారు కారు, ఆ తీసుకొచ్చిన వాటిని.

ఒక భక్తురాలు హార్లిక్సు చేసి తీసుకువచ్చి పెట్టింది భగవాన్ ముందు తాగమని, అందరిలోనూ,

'ఏమిటిది? నా కెందుకు?'
'హార్లిక్సు. మీరు చిక్కిపోతున్నారు. తాగి తీరాలి ' అందామె.
'నేనేం పాపాయినా? తీసుకుపో!' అని కఠినంగా పంపేశారు.

Freedman అనే భక్తుడు ఒక గ్లాసునిండా నారింజరసం తీసుకొని వచ్చి యిచ్చాడు భగవాన్ కి తాగటానికి. ఆ గ్లాసు తీసుకొని చూసి భగవాన్,
'అంతేనా? ఇది చాలదే?' అన్నారు.
ఇంకా కావాలంటున్నారనుకుని ఆశ్చర్యపడి చూశాడు అతను.
'అందరికీ యివ్వటానికి' అన్నారు భగవాన్ కూచున్న వందలాది భక్తులకేసి చూస్తో.
'కాదు భగవాన్, మీరు పాలిపోయినట్లు కనబడుతున్నారు.
మీరు తాగండి, మీకోసం తెచ్చాను ' అన్నాడు.

'నాకన్న పాలిపోయి కనబడుతున్నావు,
నీకెక్కువ అవసరం, నువ్వు తాగు ' అని ఒక చంచాడు తీసుకొని తక్కింది యిచ్చేశారు.

...దించిన పాపపు మూటని, భుజాన పెట్టుకొని వెళ్ళిపోతాడు

Thursday, July 2, 2009
ఒక భక్తుడు వుండేవాడు.
అతను భగవాన్ దగ్గరకి వచ్చినప్పుడల్లా తన్మయుడై భక్తితో పాటలు పాడి నృత్యం చేసేవాడు.
ఒకసారి అతను వెళ్ళిన తరువాత భగవాన్ రంగన్ తో అన్నారు.
' ఇక్కడికి వొచ్చినప్పుడు ఆ విధంగా ఆనందంతో నృత్యం చేస్తాడు.
వెళ్ళేప్పుడు,
ఇక్కడికి వొచ్చినప్పుడు దించిన పాపపు మూటని,
భుజాన పెట్టుకొని
వెళ్ళిపోతాడు '

విరిగినవన్నీ కూలి ఈశ్వరుడికి | ఈ ముక్కలన్నీ మీవి, తీసుకొచ్చాను

Wednesday, July 1, 2009
సుందరేశయ్యర్ జ్ఞాపకాల్లో ...

ఒక రోజు మా ఆవిడ దోసెలు చేస్తూంది. 'విరిగినవన్నీ కూలి ఈశ్వరుడికి ' అని నవ్వుతూ వెళ్ళిపోయాను. ఆకలితో దోసెలు తినాలని ఇంటికి వచ్చాను. 'అన్ని దోసెలు ముక్కలై వొచ్చాయి.' అని ఆ ముక్కల్ని చూపింది. ఏం చెయ్యను? ఏమి అనకుండా భగవాన్ దగ్గరికి తీసుకొనిపోయి వారి ముందర పెట్టాను.

'ఏమిటిది?' అన్నారు.
'నా భార్య దోసెలు చేస్తోవుంటే నవ్వులాటకి నేను, మాణిక్యవాచకర్ కథలో మల్లే,
విరిగినవన్నీ ఈశ్వరుడికి అనేసి వొచ్చాను.
ఒకటీ సరిగా రాలేదు. ఈ ముక్కలన్నీ మీవి గనక మీకు తీసుకొచ్చాను ' అన్నాను.

నవ్వుతో ఆయన నాలుగు ముక్కలు తిని, తక్కినవి భక్తులకు పంచి పెట్టించారు.

ఒకసారి చిన్నస్వామికి నా మీద అమితమైన కోపంగా ఉంది. ఆ దిగులులో నేను రాత్రి భోజనం చెయ్యలేదు. తెల్లారి ఆకలిగా ఉంది. ఆశ్రమంలో నిలువ మనస్కరించలేదు. భగవాన్ తెల్లారకట్ల ఇడ్లీ చేస్తున్నారు. వెళ్లి నమస్కరించాను. 'ఏమిటి సమాచారం?'
'టవునుకు వెడతాను.'
'ఎందుకు?'
'పిల్లలు ట్యూషన్ కు కాచుకుని ఉంటారు.'
'తెలుసు. నాకు తెలుసు నీ దొంగతనం, ఆదివారంనాడు నీకు ట్యూషన్ ఏమిటి? ఎవరికి చెప్పుతావు? వంకాయ సాంబారు చేశాను మధ్యాహ్నానికని. ఇప్పుడే నీకు వేసి పెడతాను. రా. తిను . పద, కూచో ' అని తొందరగా విస్తళ్ళు వేశారు.

తానూ నా పక్కన కూచుని నా దిగులు మరచిపోయేట్టు ఎన్నో కబుర్లు చెప్పి నవ్వించారు.
అట్లాంటిది భగవాన్ కరుణ.

వంకాయ తొడిమల్ని కూర చెయ్యమన్నారు. తొడిమల కూర? ఎవరు తింటారు?

సంపూర్ణమ్మ జ్ఞాపకాల్లో ...

ఒకసారి జయంతికి ఎన్నో వంకాయలు వొచ్చాయి. వరసగా కొన్ని పూటలు వొండాము. వాటినుంచి కోసిన తొడిమలన్నీ ఓ కుప్ప పడి వున్నాయి, ఏది పారెయ్యడానికి ఎవరికి సాహసం లేదు. వాటిని చూసి భగవాన్, ఆ తొడిమల్ని కూర చెయ్యమన్నారు. తొడిమల కూర! ఎవరు తింటారు?

చేశాం.
వాటిల్లో ఎండు బటానీలు కలిపి , ఎన్ని గంటలు వుడికించినా వుడకవు - తొడిమలుగాని, గింజలుగాని. ఎందుకు వొచ్చారో హాలులోంచి వంటింటిలోకి వొచ్చారు భగవాన్. ఎంత పనిలో వున్నా సరే, మా వంటలో ఏదన్నా సమస్య వొచ్చిందా, ఎట్లా వొచ్చేవారో - మా ఎదుట వుండేవారు. హాలు గుమ్మం దగ్గిర మేము కనపడ్డామా, వెంటనే లేచి వొచ్చేవారు మా వెంట. వంటచేసేవారి పైన వున్న అనుగ్రహం, ఎవరిపైనా వున్నట్టు కనపడేదికాదు, ఆ హాలులో కూచున్న వారిపైన.

'ఎట్లా వుంది కూర ?' అన్నారు.
'కూర ఏమిటి? అవి తొడిమలు కావు. ఇనపగుగ్గిళ్ళు, ఎన్ని గంటలకీ వుడకవు!' అన్నాను.'

ఏం? వుడకలేదా?' అంటూ ఓసారి గరిటతో తీసి చూసి, కలిపి, ఏ ఉపాయం చెప్పకుండానే వెళ్ళీపోయినారు.

వెళ్ళి చూస్తే -
తొడిమలు, ఎండు బటానీలు అన్నీ వుడికి వున్నాయి.
ఆ రాత్రి అందరూ చాలా బాగా తిన్నారు. ఆ కూర ఏమి కూర అని అడిగారు తినేవారు. ఎవరూ చెప్పుకోలేకపోయినారు. వొక్కసారే వొడ్డించాను అంత కష్టపడి చేసిన కూరని, భగవాన్ కి అంతా. అంతా ఒక్క ముద్దగా నోట్లో వేసుకుని మింగేశారు. నా ప్రాణం చివుక్కుమంది. అంత రుచైన కూరని, అంత కష్టపడి చేసిందాన్ని అట్లానా తినడం? తరువాత ఎన్నిసార్లు కూర వొడ్డిస్తానన్నా, వొద్దన్నారు.

మర్నాడు అన్నారు ఎవరితోనో, 'రాత్రి నేను కూర తినలేదని సంపూర్ణమ్మ మనసు నొచ్చుకుంది. నేను తింటేనేం, తినకపోతేనేం? తను శ్రద్దగా చేసింది నేను తిన్నట్టే ' అని. భక్తులకన్న స్వామికి ఎక్కువ వెయ్యాలని నా మనసులో ఏ మూలన్నా వుందో ఏమో ఆ వ్యత్యాసాన్ని తీసేసే సాధనం తాను తినకపోవటమే!

వంట బాగా వొచ్చినా, చెడిపోయినా, దాంట్లోంచి మాకో వేదాంతం. ఆ వాక్యాలే, ఎటు పడితే అటు అర్థం తీసుకునేవిగా వుండేవి. ఓసారి సేమియా పుట్టు చేస్తో వున్నాము - జాగర్తగా పొడి పొడిగా వొచ్చేట్టు.

భగవాన్ వొచ్చి అంతా అణిచేశారు. 'ఇదేమిటి భగవాన్, ఇట్ల అణిచివేశారు? అంతా ముద్దయి పోయిందే? ' '
అవును, విడివిడిగా వుంటే ఏం బావుంటుంది ? అంతా ఏకంకావాలి.'

చాలా రుచిగా వుంది సేమియా పుట్టు ఆ రోజున.

Blessing

Blessing
Bhagavan Memories