'నీకేమి తెలియదనేది ఎట్లా తెలిసింది?'

Friday, January 29, 2010
ఒకానొక ఉదయం ఆశ్రమానికి ఒక యువకుడొచ్చాడు. వచ్చిన రెండు మూడు రోజులు సత్రం భోజనంతో, మఠంలో సుఖ నిద్రతో తింటో పడుకుంటో భగవాన్ సన్నిధి సందర్శన భాగ్యం అనుభవిస్తూ కాలం వెళ్ళబుచ్చుతున్నాడు. వెళ్ళిపోయేముందు ఒకరోజు భగవాన్ ని సమీపించి జంకుతూ

'స్వామీ! ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా మిమ్మల్నేదో అడగటం మీరేదో సెలవిస్తూ వుండటం జరుగుతోంది. ఇదంతా చూస్తుంటే నాకూ యేదో ఆశ కలుగుతోంది. కాని ఏం అడగాలో తెలియకుండా వుంది. ఇక తరించే దెట్లాగా?' అన్నాడు దీనంగా.

భగవాన్ సాదరంగా చూచి 'నీకేమి తెలియదనేది ఎట్లా తెలిసింది?' అన్నారు నవ్వుతూ.

'ఇక్కడికి వచ్చిన వారంతా అడిగే ప్రశ్నలూ మీరు సెలవిచ్చే ప్రత్యుత్తరాలూ వింటూ వుంటే అయ్యో మనకు ఏమీ తెలియదే అనిపిస్తోందీ అన్నాడతను.

దానికి భగవాన్ 'ఆ! ఇంకేం ! ఏమీ తెలియదన్న విషయం తెలుసుకున్నావు. అదే చాలు. ఇంకేం కావాలి?' అన్నారు భగవాన్.

'అంత మాత్రానా తరించేదెట్లాగా స్వామీ?' అన్నాడా పృచ్ఛకుడు.

'ఎట్లాగేమి? ఏమీ తెలియదే అన్నది తెలుసుకునేటందుకు ఒకడున్నాడు కదా. ఆ తెలుసుకునే వాడేవడని చూస్తే తీరిపోతుంది. అన్నీ తెలుసునని అనుకుంటే అహం పెరుగుతుంది. అంతకంటే ఏమీ తెలీదే ఎట్లాగా తరించటం, అన్న తెలివి కలగటం ఎంతో మేలు కదా!' అన్నారు భగవాన్ '.

అంతటితో ఆ యువకుడు యెంతో సంతోషించి బయలుదేరి వెళ్ళిపోయాడు.

భగవాన్! నేను సంసారాన్ని వొదిలేద్దామనుకుంటున్నాను!

Monday, January 25, 2010
ఒకసారి మధ్యాహ్నం మూడు గంటలకు కొత్తగా వచ్చిన ఆంధ్రులొకరు, నడివయస్సు వారు, భగవాన్ ని సమీపించి 'స్వామీ! నేను రామనామం నియమంగా ఉదయం ఒక గంటా, సాయంత్రం ఒక గంటా జపిస్తూ వుంటే, కొంచెం సేపటికే తలపులు ఒకటొకటిగా బయలుదేరి, అంత కంతకు అధికమై, ఎప్పటికో మనం చేసే జపం మరచి పోయామే అని తోస్తుంది. ఏం చేసేది? ఈ అంతరాలు రావడానికి కారణం సంసారం గదా.
అందువల్ల సంసారం వదలివేద్దామా, అని యోచిస్తున్నానన్నాడు.

 'ఓహో! అట్లాగా! అసలు సంసారమంటే యేమి? అది లోపల వున్నదా? బయట వున్నదా?' అన్నారు భగవాన్.

'భార్య పిల్లలూనూ ఇత్యాదులండీ ' అన్నాడాయన.

 'అదేనా సంసారం? వారేం చేశారు? అసలు సంసారమంటే ఏదో తెలుసుకోండి ముందు. ఆ వెనక విడవటం యోచిద్దాం'. అన్నారు భగవాన్. ఆయన నిరుత్తరుడై తలవంచి వూరుకున్నాడు.

భగవాన్ కరుణాదృష్టితో చూస్తూ 'భార్యా పిల్లలను  వదలి వచ్చి  ఇక్కడుంటే ఇదొక విధమైన సంసారమవుతుంది. సన్యసిస్తే కఱ్ఱ, కమండలం  ఇత్యాదులతో అదొకరకపు సంసారంగా పరిణమిస్తుంది. ఎందుకదీ? సంసారమంటే మనస్సంసారమే. ఆ సంసారాన్ని విడిస్తే ఎక్కడ వున్నా ఒకటే, ఏదీ బాధించదు ' అన్నారు భగవాన్.

భగవాన్! మీరీ ఔషధం సేవించండి !

Thursday, January 21, 2010
 కసారి 1945 నవంబరులో రామచంద్రరావు గారని ఆయుర్వేద వైద్యులు భగవాన్ శరీరానికి బలమిచ్చే ఔషధం చేయటానికని దినుసులన్నీ జాబితా రాసుకొని భగవాన్ కు  చూపారు. చెప్పగానే వినే బుద్దిమంతుడైన పిల్లవాడిలాగ అవన్నీ చదివి వాటివాటి గుణాలు పొగడి 'ఎవరికయ్యా ఈ మందు?' అన్నారు భగవాన్. 'భగవానులకే ' అన్నారాయన. 'సరి సరి ,పెద్ద జాబితాయే పట్టుకొచ్చావు గానీ, డబ్బులకెక్కడికి పోయేది ? పది రూపాయలవుతుంది. యెవరిని యాచించాలి?' 'అయ్యో! ఇదంతా యెవరిది స్వామీ?' అన్నారెవరో. 'సరేలే! నాకేముంది. అంతా ఆ సర్వాధికారిని (ఆశ్రమాధికారి) అడగాల్సిందే. ఎవరడుగుతారిప్పుడు. గంట కొట్టగానే పోతే పట్టేడన్నం పెడతారు. అందరితో పాటు తినివస్తాను. ఆలస్యమైతే పెట్టం పొమ్మంటారేమో అన్న భయంతో. ఆ వడ్డనలోనూ లాస్టులో ఫస్టే కదా '  అన్నారు భగవాన్. పాపమా వైద్యులు కంపిత హస్తాలు జోడించి 'వూరికే జాబితా చూపించానేగాని దినుసులు నేను తెస్తాను స్వామీ ' అంటే, 'సరే! ఇది నాకు మంచిదైతే వీరందరికీ మంచిది కాదా? నాతో పాటు అందరికీ ఇవ్వగలరా? పనిచేసేవాళ్లకు బలమిచ్చే మందు వద్దు గాని తిని కూర్చుండే నాకు మాత్రం కావాలీ? చాలు చాలు పొండి ' అన్నారుభగవాన్.

డాక్టరు శ్రీనివాసరావుగారొకప్పుడు ఇంగ్లీషు మందేదో బలమిచ్చేది వున్నది, భగవాన్ అది పుచ్చుకుంటే మంచిదన్నారు. మంచిదే. 'మీరు ధనవంతులు. ఏదైనా ఏదైనా తినవచ్చును. నేనో, బిచ్చగాడిని. అంత ఖరీదు గల మందులు నాకెట్లావస్తాయి?' అన్నారు భగవాన్. 'భగవాన్ అన్నీ వద్దంతాౠ గాని తినేటట్టయితే రావా, పోనీ మందులు కాకుంటే మానెయ్యండి, ఆహారమైనా బలకరమైనది తినగూడదా? అరవిందులు చూడండి, పాలూ, పళ్లూ, బాదం, మొదలైనవి తిని బలిష్ఠులై వుంటారు. వారి భోజనమే ప్రత్యేకం ' అన్నారు డాక్టరు. 'సరి సరి, ఇవన్నీ తినేందుకు నాకేముందీ? దరిద్ర నారాయణుణ్ణి, పైగా, నేనేం వంటరిగాణ్ణా యేమి? గంపంత సంసారం! అందరికీ పళ్ళూ, పాలూ, బాదం ఎట్లావస్తాయి?' అన్నారు భగవాన్.

Blessing

Blessing
Bhagavan Memories