|| చిన్నస్వామి ||
1916 చివరలో, స్వామి స్కందాశ్రమానికి మకాం మార్చారు.
అందరితో పాటు అలఘమ్మ కూడా అక్కడకు చేరింది. స్వామితో స్థిరపడింది.
అక్కడ ఆమె వంట చేసేది. ఓ స్థిరనివాసం, వంటా అన్నీ ఏర్పాటుకావడంతో, కొత్తవారు వచ్చి స్వామితో స్థిరపడ్డారు. వారూ తలొక పనీ చేసేవారు.
స్వామి కూడా వంటలో సహాయం చేసేవారు. కొందరు గోడలు, అరుగులు కట్టారు.
'ఆ అరుగులు ఎంతో సుఖంగా వుండేవి ' అన్నారు భగవాన్ ఒకసారి శ్రీరమణాశ్రమంలో.
ఆ అరుగులపై గడ్డిచాపలు పరచుకుని కూర్చునేవారు.
స్కందాశ్రమం ఋష్యాశ్రమాల్ని గుర్తు చేసేది.
నిరంతరం ప్రవహించే ఆ సెలయేరు ఆశ్రమవాసుల అవసరాలు తీర్చడమేకాక,
తోటలో మొక్కలకు కూడా నీటిని ఇచ్చేది.
అక్కడ కొత్త జీవివం ఆరంభమైంది.
స్కందాశ్రమం ఏర్పడిన ఆరు మాసాలకు అలఘమ్మ నారాయణ రెడ్డి
అనే అతన్ని పంపించి మూడో కొడుకు నాగసుందరాన్ని అరుణాచలం రప్పించింది.
మొదట్లో అతడు గంభీరం శేషయ్యగారి ఇంట్లో వుండేవాడు.
తర్వాత ఓ సత్రంలో తింటో, తిరిగేవాడు.
క్రమంగా అతనిలో మార్పు వచ్చింది.
1918 లో అతడు కాషాయం కట్టి నిరంజనానంద స్వామి అని పేరు మార్చుకున్నాడు.
భిక్షాన్నంతో జీవించేవాడు. అది చూసి 'ఇక్కడ అలఘమ్మ వంటచేసి పెడితే
ఇంతమంది తినగా లేనిది, కన్నకొడుకు భిక్షాటన చేసుకుని తినడం ఎందుకు?'
అని కొందరు అతన్ని స్కందాశ్రమానికి తీసుకొచ్చారు.


