Showing posts with label పశు-పక్ష్యాదులు. Show all posts
Showing posts with label పశు-పక్ష్యాదులు. Show all posts
Tuesday, April 12, 2022
పశు-పక్ష్యాదులు | ఉడతలు 


తన చుట్టూ చేరిన యావత్ మానవేతర ప్రాణికోటిని ఉద్దేశించి, 
'ఆ రూపాల్లో, ఆ దేహాల్లో వున్న ఆత్మలు యెటువంటివో, 
అవి మన సాన్నిహిత్యాన్ని యెందుకు కోరతాయో మనకు తెలియదు. 

పరిపూత్రి కాని కర్మను, పూర్తిచేసుకోవడానికి యీ పశుపక్ష్యాదులు 
మనని చేరుతున్నాయేమొ! మనకు తెలియదు ' అనేవారు భగవాన్.

భగవాన్ గురుమూత్రంలో ఉన్నప్పుడు పక్షులు, 
ఉడతలు ఆయన చుట్టూ తిరిగి, ఆడుకునేవి. కొన్ని 
ఆయనకు దగ్గరలో గూళ్లు కట్టుకుని, పిల్లల్ని పెట్టేవి. 
అవి ఏ దశల్లో, ఎన్నెన్ని రోజులకు యెటువంటి పరిణామాలు 
చెందుతున్నవీ కనిపెట్టి చూసేవారు, భగవాన్. అలా చూడ్డం వినోదం కోసం కాదు. 

వాటిని జాగ్రత్తగా, శ్రద్ధగా, ప్రేమగా పరిశీలించేవారు. 
ఆయన యెప్పుడూ, యే జంతువునూ, యే పక్షిని 'ఇదీ-అదీ' అనలేదు. 
'లక్ష్మి ' కి అన్నం పెట్టండి, 'పిల్లలకు తిండి పెట్టారా?' అని పేర్లు పెట్టి అడిగేవారు.

ఒకసారి ఒక ఉడుతపిల్ల గూట్లోంచి కింద పడింది. 
దాన్ని తీసి గూట్లో పెట్టారు, భగవాన్. కాస్సేపటికి అది మళ్ళా కింద పడింది. 
దాన్ని తీసి మళ్ళా గూట్లో పెట్టారు. అది మళ్లా కింద పడింది. 
భగవాన్ మళ్ళా దాన్ని గూట్లో పెట్టారు. అది కింద పడటం, 
భగవాన్ దాన్ని తీసి గూట్లో పెట్టడం అదంతా చూసి, 
'మనసు విషయ వాసనల వైపు పోతూ వుంటే, దాన్ని స్వస్థానం చేర్చాలి. 
మనసూ ఉడత పిల్లంత చంచలం ' అన్నారు భగవాన్. 

పిపీలికాది బ్రహ్మపర్యంతం ఒకటిగా చూసే భగవాన్ కి, 
గూట్లోంచి ఉడుతపిల్ల కింద పడిందని గొడవపడ్డారంతే, 
అది మనం గొడవ పడినట్లు కాదు. 
ఆయన సహజ, సంపూర్ణ యెరుకలోంచే గొడవ పడతారు. 
అదంతా వారి ప్రేమ.

పశు-పక్ష్యాదులు | కోతి, ముంగిస



భగవాన్ విరూపాక్ష గుహలో వుండే రోజుల్లో ఒక పెద్ద కోతి 
మరో కోటిపిల్లను బాగా కరిచింది. ఆ పిల్ల మూర్చపోతే చనిపోయిందనుకుని, 
తక్కిన కోతులన్నీ దాన్ని వదలి వెళ్ళిపోయాయి. 
కాని, ఆ కోతిపిల్ల కాస్సేపటికి కోలుకుని, నెమ్మదిగా భగవాన్ దగ్గరకు చేరింది. 

అది బ్రతికి బైటపడింది కాని, దాని కాలు కుంటుపడింది, 
అందుచేత అందరూ దాన్ని 'నొండి ' అంటే 'కుంటి ' అని పిలిచేవారు. 
భగవాన్ దాన్ని శ్రద్ధగా చూసి కాపాడారు. 

ఒక రోజున నొండి కోసం భగవాన్ వేడి పాలు చల్లారుస్తో వుంటే , 
తన వాటా పాలు భగవాన్ తాగేస్తున్నారనుకుని, నొండి ఆయన్ని 
చెంపమీద కొట్టింది. అయినా భగవాన్ దాన్ని ప్రేమగా తీసుకున్నారు.

నొండి క్రమంగా కోలుకుంది. అది చనువుగా భగవాన్ తొడమీద కూర్చునేది. 
ఆయన పక్కన చక్కగా కూర్చుని భోజనం చేసేది. 
ఒక రోజున అది అన్నం వెదజల్లుతూ తింటూ వుండే, 'శుభ్రంగా తిను ' అన్నారు భగవాన్. 
ఆ మాటకు దానికి రోషం వచ్చి, భగవాన్ని చెంప మీద కొట్టింది. 
ఆ తర్వాత భగవాన్ దాన్ని కొన్నాళ్ళు తన తొడ మీద కూర్చోనివ్వలేదు. 
అది పశ్చాత్తాప్పడి, భగవాన్ని బ్రతిమాలింది, ప్రార్థించింది. 

అది ఆయన దగ్గరకు వెళ్ళి, మనుష్యులు మాదిరిగా గెడ్డం పట్టుకుని బ్రతిమాలింది, ప్రాధేయపడింది. చివరికి అది ఆయన అనుగ్రహం పొంది, 
మళ్ళా ఆయన తొడపై కూర్చోవడం ఆరంభించింది. 
నొండి అంటే భగవాన్ కి యెంతో ప్రేమ.
భగవాన్ స్కందాశ్రమంలో వున్నప్పుడు ఒక రోజున కొందరు భక్తులు 
ఆయన చుట్టూ కూర్చుని వున్నారు. అంతలో ఒక ముంగిస వచ్చి, 
భగవాన్ తొడమీద నిర్భయంగా కూర్చున్నది. దన్ని చూస్తో, 
'వీరు ఎందుకు వచ్చారో, యెవరికి తెలుసు? ఇది సామాన్యమైనది కాదు ' అన్నారు.

భగవాన్ పాముల్ని చంపనిచ్చేవారు కాదు. 
'మనం వాటి స్థానంలోకి వచ్చాం. వాటిని బాధించడానికీ, చంపడానికీ, 
కనీసం వాటిని కదల్చడానికీ, యేం చెయ్యడానికీ మనకు హక్కులేదు. 
అవి మనల్ని తొందర పెట్టవు ' అన్నారు.

పశు-పక్ష్యాదులు | నెమళ్ళు, కుక్క







 
'చిరుకరప్పన్ '  అనే ఓ నల్ల కుక్క వుండేది. అది అందరితో స్నేహంగా, 
ప్రేమగా వున్నట్లే, ఆశ్రమానికి వచ్చే ప్రతి కొత్తవారితోనూ 
అంత ప్రేమగా, స్నేహంగా, చనువుగా వుండేది. 

అది ఒకసారి ఆశ్రమానికి కొత్తగా వచ్చిన ఒక చాదస్తపు బ్రాహ్మణుని దగ్గరకు వెళ్ళింది. 
అప్పుడు ఆయన జపం చేసుకుంటున్నారు, మడి కట్టుకుని, 
ఆయన దాన్ని భరించలేక కర్రతో కొట్టారు. 
ఆ కుక్క అభిమానంతో వెళ్ళి, మళ్ళా ఆశ్రమానికి తిరిగి రాలేదు.
 దాని మనసు అంతం సున్నితం. 

ఇంకోసారి పలనిస్వామి ఓ కుక్కను కొడితే, 
అది వెళ్ళి కొలనులో పడి ఆత్మహత్య చేసుకుంది. 

శ్రీరమణాశ్రమం ఏర్పడ్డాక భగవాన్ భోజన సమయంలో 
మొదట కుక్కలకు అన్నం పెట్టమనేవారు. 
తర్వాత ఎవరైనా భిక్షకులు వస్తే, వారికి భోజనం పెట్టాలి. 
చివరకు మిగిలింది ఆశ్రమవాసులు తినాలి.

బరోడా మహారాణిగారు శ్రీ రమణాశ్రమానికి రెండు తెల్ల నెమళ్ళు పంపించారు. 
వాటికి పెట్టే మామిడి పళ్ళు సరిగ్గా పండాయో, 
లేదో భగవాన్ స్వయంగా రుచి చూసి, వాటికి పెట్టించేవారు. 
ఒక్క ఆ నెమళ్ళ మీదనే కాదు, ఆయనకు అన్నింటిపైనా 
అంత శ్రధ్దే, ప్రేమే! ఆయన ఆ నెళ్ల అరుపుల్ని అనుకరించి వాటిని పిలిచేవారు.

***

1924 ప్రాంతంలో శ్రీరమణాశ్రమంలో నాలుగు కుక్కలు వుండేవి. 
భగవాన్ చేత్తో తిండి పెడితేనేగాని, అవి తినేవిగావు. వాటిల్లో ఒక దాని పేరు 'కమల ' .
'కమలా, ఈ కొత్తవారిని గిరి ప్రకక్షిణం తీసుకువెళ్ళు ' అని భవాన్ చెపితే, 
అది వారి వెంట తొమ్మిది మైళ్ళూ గిరిప్రదక్షిణం వెళ్ళి గిరి చుట్టూ వున్న 
ఆలయాల్ని, గ్ఫురాల్ని, కొలనుల్ని, మండపాల్ని, తీర్ధాల్నీ 
విగ్రహాల్ని చూపించి తీసుకొచ్చేది.

అది అన్నింటికంటే పెద్ద కుక్క. దాని సంతతే ఆశ్రమంలో వుండేవి. 
అది స్కందాశ్రమానికి చిన్న పిల్లగా వచ్చింది. 
అప్పటి ఆశ్రమవాసులు దాన్ని తరిమెయ్యాలని చూశారు. 
'ఎందుకంటే, అది ఆడకుక్క. ప్రతి సంవత్సరమ పిల్లల్ని పెడుతుంది. 
చికాకు కలిగిస్తుంది ' అనే నెపంతో. కాని, 

అది భగవాన్ని వదిలి పోలేదు. అది అక్కడే స్థిరపడింది. 
ఆశ్రమంలో దాని సంతతే నిలిచింది. 
 
పశు-పక్ష్యాదులు | ఉడతలు




భగవాన్ రోజూ ఉదయం, సాయంత్రం కొండ మీదకు వెళ్ళేవారు. 
దారిలో కనిపించిన జంతువుల్నీ, పక్షుల్నీ శ్రద్ధగా పరిశీలించేవారు. 
ఆయన అమృతహస్తం కింద యెన్నో కుక్కలు, కోతులు, 
ఉడతలు, రక్షణ తీసుకుని, శాంతి పొందాయి.

ఒక రోజున్ భగవాన్ కొండదిగి ఆశ్రమానికి వస్తోవుంటే, 
ఓ కుక్క ఉడతను తరుముతోంది. 
ఆయన ఆ కుక్కను ఆపబోయి బోర్లాపడ్డారు. చేతి ఎముక విరిగింది. 
కుక్క పారిపోయింది. ఉడత రక్షింపబడింది. 

జంత్వులు ఆయన అనుగ్రహాన్ని చాలా సులభంగా సంపాదించేవి. 
ఆయన ప్రేమను చవి చూసేవి. ఆయన అమృతహస్తం కింద్ సురక్షితంగా వుండేవి.
ఆశ్రమం హాలులో భగవాన్ సోఫామీద కూర్చుంటే, 
కిటికీలోంచి ఉడతలు సోఫామిదికి దూకేవి. 
యన వాటికి వేరుశనగ గింజలు, పప్పులూ మొరమొరాలు పెట్టేవారు.

ఒక్కోసారి అవి ఆయన చేతుల్లోంచి పప్పులూ అవీ తీసుకుని, 
తినేవి. భగవాన్ వాటికోసం పప్పులు, గింజలు డబ్బాల్లో పోసి 
దగ్గర పెట్టుకునేవారు. 

భగవాన్ పశు-పక్ష్యాదులయందే కాదు, 
చెట్లయందూ అంతం ప్రేమ, దయ చూపేవారు. 
ఒకసారు ఒక భక్తురాలు వచ్చి, గొప్పగా, 'నేను లక్షపత్రి పూజ చేశాను ' అన్నది. 
దానికి భగవాన్ వెంటనే ' అంతకన్నా 
నిన్ను నువ్వు లక్షసార్లు గిల్లుకోకపోయినావా?' అన్నారు. 


Blessing

Blessing
Bhagavan Memories