Showing posts with label శృంగభంగం. Show all posts
Showing posts with label శృంగభంగం. Show all posts

యీ కాఫీ భగవాన్ ప్రసాదం, తాగి తీరాల్సిందే . . .

Friday, July 10, 2009
ఒకసారి ఓ భక్తుడు ఆశ్రమానికి వచ్చాడు. అతనికి కాఫీ, టీ మొదలైనవి అలవాటు లేవు. ఆశ్రమంవారు అతనికి కాఫీ ఇచ్చి తాగమన్నారు. అతను తనకు అలవాటు లేదంటే,
'భగవాన్ ప్రసాదం, తాగి తీరా' లన్నారు .అతను వెళ్ళి భగవాన్ ని అడిగాడు
'స్వామీ, కాఫీ మీ ప్రసాదమట. నాకు అలవాటు లేకపోయినా, అయిష్టమయినా తాగితీరాలా?
తమరు అది తమ ప్రసాదమంటే, తాగుతాను ' అని.

భగవాన్ ఆశ్రమాధికారులతో ఇట్లా అన్నారు.
'నే నెన్నడన్నా మిమ్మల్ని అడిగానా, నాకు కాఫీ యిమ్మని? నేను తాగకపోయినా మీరు ఎట్లాగూ తాగేదానికి, కొంత స్వామికి పోసేది, అది స్వామి ప్రసాదమని వొంక పెట్టుకు తాగేది. పైగా ఎవరన్నా తాగను, వద్దంటే అదో నింద, స్వామి ప్రసాదం నిరాకరిస్తున్నారని. ఈ ఆశ్రమం వారికి ఏదేది యిష్టమో దానికంతా స్వామి ప్రసాదమని పేరు. '

భగవాన్ కి ఆ రాత్రి భోజనం లేదు

Sunday, June 21, 2009
ఒకసారి చంద్ర గ్రహనం: సాయమ్రం 5:30 గంటలకే భోజనానికి గంట కొట్టారు, భోజనాలు గ్రహణానికి ముందే తినాలని, ఆ సంగతి ముందే భగవాన్ తో చెప్పలేదు. అందరూ వెళ్ళి కూచున్నారు, విస్తళ్ళముందు.

'ఆ గంట ఏమిటా?' అని అడిగారు భగవాన్.
'గ్రహణానికి ' అని చెప్పారు. విని 'అట్లాగా ' అని వూరుకున్నారు.
భగవాన్ భోజనానికి లేవలేదు. భోనజానికి పిలిస్తే వినిపించుకోలేదు.

చూసి చూసి ఎవరో ఇద్దరు ముగ్గురు తప్ప మిగిలినవారు భోజనం చెయ్యకుండానే లేచి వచ్చారు.భోజనానికి మామూలుగా గంటకొట్టే సమయానికి 7:30 కి భగవాన్ గడియారం వైపు చూశారు. కాని ఎవరూ మాట్లాడలేదు. వారిని ఎవరూ పిలవలేదు. గంట కొట్టలేదు. గ్రహణం అయిపోయింది. 9:30 కి భోజనానికి గంట కొట్టారు. భగవాన్ లేవలేదు. అందరూ వెళ్ళి భోజనం చేశారు.

భగవాన్ కి ఆ రాత్రి భోజనం లేదు , కొందరు మాత్రం 'భగవాన్ భోజనం చెయ్యలేదు ' అని కలవరపడ్డారు.

స్వామికి ఒక్క నమస్కారం పెడితే సరిపోతుంది ?!

Thursday, June 11, 2009
వొక భక్తురాలు వారణాసి సుబ్బలక్షమ్మ మాటల్లో -

మొదటి నుంచీ కూడా భగవాన్ వాకిట్లోకి వెళ్ళేటప్పుడూ వచ్చేటప్పుడూ నేను ఆయనని చూడగానే లేచి నుంచుంటో వుండేదాన్ని. ఆయన చూస్తోనే వుండేవారు. ఆయన మా ఎదురుగా వస్తే చాలు - అందరం కూడా భయ భక్తులతో ఒక పక్కకి ఒదిగి వుండేవాళ్ళం. నేను వూళ్ళో కాపురం వుండి ఆయన దర్శనార్థం వొచ్చేకాలంలో నేను వచ్చినప్పుడల్లా కొంచెం ద్రాక్షపళ్ళు కొని తీసుకొని వచ్చి ఆయనకిచ్చే అలవాటు. ఒక సాయంత్రం అదే ప్రకారం తెచ్చిన ద్రాక్షపళ్ళను ఆయన ముందు పెట్టాను. దానిని చూసి,

'ఇప్పుడెందుకు తెచ్చావు? ' అని నవ్వి, 'ఎప్పుడు తెచ్చావు ఇవి? పొద్దున తెచ్చావా, వొచ్చేటప్పుడు? అయితే, యివి ఇప్పుడెందుకు పెట్టావు? ' అని నన్నూ - అందర్నీ కలిపి - 'ఇదంతా ఎందుకు? స్వామిని చూసి నుంచునేదీ, చాలా భక్తి వున్నట్టు నటించేదీ, యీ వేషాలన్నీ ఇక్కడికి వచ్చిన తరువాత యిది నేర్చుకున్నది. ఇవన్నీ యెందుకు ? వీటివల్ల ఏం ఫలం? మామూలుగా వుంటే చాలదా? మనసు నిర్మలంగా వుండాలిగాని; యీ నమస్కారాలూ, మన్ననలూ - యివన్నీ వేషం. స్వామి కన్ను తుడిచి ఏమార్చాలని చూసే పనులు ' అని మురుగునారుతో అన్నారు.

యింకా యిలా అన్నారు
'యీ నమస్కారాలు అన్నీ యేం ప్రయోజనం? మొదట మనుషులు ఇక్కడికి వచ్చేటప్పుడు భక్తి వినయాలతో వస్తారు. తరువాత త్వరలోనే సర్వమూ వారిదే. అంతా వారి ఇష్టమే. అధికారమే. వారు చెప్పినట్లు స్వామి వినాలి. స్వామిది యేదీ లేదు. వారు యెన్ని తప్పులు చేసినా వూరికే నోరుమూసుకు వుండవలసిందే స్వామి.

వారు ఒక్క నమస్కారం చేశారా, అర్థం ఏమిటంటే - మేము నమస్కారం పెట్టాం గదా, మా తప్పులకీ ఇక మీరు ఏమీ అనడానికి వీలులేదు అని ' ఇట్లా చాలా కోప్పడ్డారు.

రైలుకి టైమవుతోంది! వూ ! తొందరగా మోక్షాన్ని పొందేటట్టు ఉపదేశించండి

Wednesday, June 10, 2009
ఒకసారి కుంభకోణం నిండి యిద్దరు స్త్రీలు వచ్చారు. వాళ్లలో ఒకామె గురువు, ఇంకో ఏమె శిష్యురాలు వాళ్ళే భోజనం వండుకొని, దాంట్లో సగం భగవాన్ కి ప్రసాదం కింద అర్పించారు. ఆ సాయంత్రమే రైలుకి వెళ్ళాలన్నారు. గురువును భగవాన్ హాలులోకి తీసుకుని వచ్చి ఓ చోట భక్తిగా కూచోపెట్టింది శిష్యురాలు. తానూ కూచుంది. ఉండుండి శిష్యురాలు

భగవాన్ తో ' ఆమె ఉందే అంతా , మీ రకమే ' అనీ,
ఇంకోసారి 'ఆమెదీ అంతా మీ స్థితే ' అనీ -
అట్లా అంటో 'తమ ఆశీర్వచనం కావాలి మాకు ' అంది మళ్ళీ.
'శీఘ్రంగా మోక్షం అందుకోకలిగేట్టు ఏదన్నా ఉపదేశించండి.' అంది.

ఆ మాటలకి దేనికీ భగవాన్ పలకలేదు.

'ఏదో అంటారు. మమకారం అంటారు. మాయ పోవాలంటారు. కనుక భగవాన్ మాకేమన్నా ఉపదేశిస్తే బాగుంటుంది.' అంది. మధ్యాహం దాటుతోంది. ఆమెకి తొందర పుట్టింది.

'వూ, కానీయండి మరి - టైమవుతోంది ' అంది,
మళ్ళీ 'కానీండి, ఉపదేశించండి. మేము రైలుకి వెళ్ళాలి ' అంది.
'మేము రైలుకి వెళ్ళాలి, కానీండి ' . ఇట్లా హెచ్చరిక లాగు చేస్తోంది.

స్వామి ఏం మాట్లాడలేదు.
చివరికి కొంచెం తగ్గి 'స్వామీ ! ఆమెకి ఏదన్నా చెప్పండి. అజ్ఞానం అంటారు - అదేమిటో కొంచెం ఉపదేశించండి. ఆ అజ్ఞానం అదీ ఏమిటో కొంచెం వివరించండి. మేము వెళ్ళాలి, రైలు టైమయింది ' అంది.

భగవాన్ ఏమీ కోపించకుండా మురుగనార్ తో 'అజ్ఞానం ఎవరికో అది తెలిసికోమనండి ' అన్నారు.
'మీకు కావలసిన ఉపదేశం అయింది . ఇంక మీరు రైలుకి వెళ్ళవచ్చును ' అన్నారు మురుగనార్.

వాళ్ళు వెళ్ళాక భగవాన్ అన్నారు. 'తొందర, ఆలస్యమవుతూంది రైలుకి, వెళ్ళీతీరాలి. వీలైతే ఆ కాసేపట్లో శీఘ్రంగా మోక్షాన్నీ వెంట తీసుకొని వెళ్ళాలి స్వామినుండి. మోక్షమేమన్నా అంగట్లో దొరుకుతుందా? అవీ, ఇవీ పుస్తకాల్లో అర్థం కానివన్నీ చదివి పండితులమైనామనుకుంటున్నారు ' అన్నారు.

వాటిని నువ్వు కొట్టే దెబ్బలన్నీ నాకు తగులుతున్నాయి

Saturday, June 6, 2009
ఆశ్రమంలో వుండే యింకో భక్తుడు కృష్ణస్వామి కోతుల్ని ఒక్కటే కొట్టేవాడు ఎప్పుడూ. కోతులు హాలులోకి వచ్చి అల్లరి చేసినా, పళ్ళు ఎత్తుకుపోయినా, ఏమి చేసినా, కొట్టేటప్పుడు కొట్టవద్దనేవారు భగవాన్.

ఒకసారి అతను కోతుల్ని కొడుతూ వుంటే,

'నువ్వు కోతుల్ని కాదు, నన్నుకొడుతున్నావు.
వాటిని నువ్వు కొట్టే దెబ్బలన్నీ నాకు తగులుతున్నాయి.
ఆ బాధంతా నేను పడుతున్నాను ' అన్నారు భగవాన్.

ఆమె భగవాన్ వేపు కాళ్ళు జాపి కూర్చుంది

Friday, June 5, 2009
కొత్తగా యూరపు నించి ఒకామె వచ్చింది. ఆమెకు కాళ్ళు ముడుచుకొని కూచోటం చాలా కష్టం. కాళ్ళు చాచింది కొంతసేపటికి. అవి భగవాన్ వేపుకు వున్నాయి. భగవాన్ వెంట నుండి సేవచేసే అనుచరుడు మండిపడి '

సరిగా కాళ్ళు ముడుచుకొని కూచో' మని ఆజ్ఞాపించాడు.
ఆమె ముడుచుకుంది భయంతో.

వెనక్కి ఆనుకొని కాళ్ళు చాచుకొని కూచున్న భగవాన్ వెంటనే ఆమె మల్లేనే తానూ కాళ్ళు ముడుచుకొని కూచున్నారు. అంతే, ఎన్ని గంటలైనా అట్లానే కూచున్నారు. భగవాన్ కాళ్ళు అసలే నెప్పులు. చాలాసేపు ఒకే భంగిమలో కూచోలేరు. అందరూ ప్రార్థించారు. ఆయన్ని కాళ్ళు జాపుకోమని.

'హాలులో అందరికి ఒకటే మాట.
ఎన్నడూ ముడుచుకుని కూచోని ఆమెకు ఆజ్ఞ పెడితే నాకు పెట్టినట్లు కాదా?' అని,
ఆ రోజంతా అట్లానే కూచున్నారు.

నన్ను శూద్రులు తాకేరు . మీరు నన్ను తాకితే ఆ దోషం పోతుంది!

Thursday, June 4, 2009
ఒకసారి ఓ కొత్తవాడు ఆశ్రమానికి వచ్చి ఓ గంగాళంలో నీళ్ళువుంటే, కొంచెం ముంచుకోపోయినారు. ఆశ్రమంలో ముఖ్యులుగా వుండే ఒకామె ఉగ్రంతో మీదికి దూకి 'ఎవరు నువ్వు? ఎవరి నీళ్ళనుకున్నావు?' అంటో తోసెయ్యటానికి సిద్దపడింది. ఆచారం పోలేదు సరే, ఆగ్రహం కూడా పోలేదు ఆమెకు.

ఆమెగారే, బ్రాహ్మలు కానివారు తనని తాకి నమస్కరించినా సరే ఆ పాపం ఆ మైల పోవడానికి వెళ్ళి భగవాన్ని తాకేది. భగవాన్ చుట్టూ వందలాది ప్రజలు చేరింతరువాత ఆయన్ని తాకడం సులభం కాకుండా పోయింది. ఒక జయంతికి వొచ్చిన గుంపులో ఎవరో పోతూ ఆమెగారికి తగిలారట.

ఆమె వెళ్ళి భగవాన్ ముందు నుంచుంది.
'భగవాన్ ! నన్ను శూద్రులు తాకేరు .
మీరు నన్ను తాకితే ఆ దోషం పోతుంది.'

'ఫో ! నేను తాకను ' అన్నారు భగవాన్

రమణాశ్రమంలో హెచ్చుతగ్గులు

Friday, May 29, 2009
ఆశ్రమం పైన ఒక పెద్ద ఫిర్యాదు వుంటో వుండేది, గొప్పవారిని ఎక్కువగా చూస్తారని, ఒకాయన యీ హెచ్చుతగ్గుల సంగతి భగవాన్ తో చెప్పుకుంటో వుండగా భగవాన్ కి మధ్యాహ్నం కాఫీ వచ్చింది. మధ్యాహ్నాలు భగవాన్ హాలులో అందరి మధ్యా కూచుని వుండగానే కాఫీ తీసుకొచ్చి ఇచ్చేవారు. ఫిర్యాదు చేసిన ఆ వ్యక్తి

'చూడండి పోనీ, మీకిచ్చే కాఫీ శ్రేష్టమైంది. మా మొహాన్న నీళ్ళు ' అన్నాడు. భగవాన్ తాకకుండానే, తనకు వచ్చిన కాఫీ గ్లాసును మాట్లాడకుండా ఆయనకు ఇచ్చి, ఆయనకు వచ్చిన కాఫీని తాను తీసుకొని తాగుతున్నారు.

ఆయనకి భగవాన్ ఇచ్చింది కాఫీ కానేకాదు, ఏదో ఔషధులు వేసి కాచిన కషాయం. అది భగవాన్ తాగవలసిందే కాని తదితరులకు దుసాధ్యం. తీరా తీసున్నాడు . వద్దనడానికి వీల్లేదు. అందరి మధ్య వున్నాడు. పారపొయ్యటానికి వీల్లేదు. భగవాన్ ప్రసాదం, ఆయన చేత్తో ఇచ్చింది. ఆనాటి ఆయన యాతన ఆ భగవాన్ కే ఎరుక.

Blessing

Blessing
Bhagavan Memories