Showing posts with label జ్ఞాని. Show all posts
Showing posts with label జ్ఞాని. Show all posts

'నీకేమి తెలియదనేది ఎట్లా తెలిసింది?'

Friday, January 29, 2010
ఒకానొక ఉదయం ఆశ్రమానికి ఒక యువకుడొచ్చాడు. వచ్చిన రెండు మూడు రోజులు సత్రం భోజనంతో, మఠంలో సుఖ నిద్రతో తింటో పడుకుంటో భగవాన్ సన్నిధి సందర్శన భాగ్యం అనుభవిస్తూ కాలం వెళ్ళబుచ్చుతున్నాడు. వెళ్ళిపోయేముందు ఒకరోజు భగవాన్ ని సమీపించి జంకుతూ

'స్వామీ! ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా మిమ్మల్నేదో అడగటం మీరేదో సెలవిస్తూ వుండటం జరుగుతోంది. ఇదంతా చూస్తుంటే నాకూ యేదో ఆశ కలుగుతోంది. కాని ఏం అడగాలో తెలియకుండా వుంది. ఇక తరించే దెట్లాగా?' అన్నాడు దీనంగా.

భగవాన్ సాదరంగా చూచి 'నీకేమి తెలియదనేది ఎట్లా తెలిసింది?' అన్నారు నవ్వుతూ.

'ఇక్కడికి వచ్చిన వారంతా అడిగే ప్రశ్నలూ మీరు సెలవిచ్చే ప్రత్యుత్తరాలూ వింటూ వుంటే అయ్యో మనకు ఏమీ తెలియదే అనిపిస్తోందీ అన్నాడతను.

దానికి భగవాన్ 'ఆ! ఇంకేం ! ఏమీ తెలియదన్న విషయం తెలుసుకున్నావు. అదే చాలు. ఇంకేం కావాలి?' అన్నారు భగవాన్.

'అంత మాత్రానా తరించేదెట్లాగా స్వామీ?' అన్నాడా పృచ్ఛకుడు.

'ఎట్లాగేమి? ఏమీ తెలియదే అన్నది తెలుసుకునేటందుకు ఒకడున్నాడు కదా. ఆ తెలుసుకునే వాడేవడని చూస్తే తీరిపోతుంది. అన్నీ తెలుసునని అనుకుంటే అహం పెరుగుతుంది. అంతకంటే ఏమీ తెలీదే ఎట్లాగా తరించటం, అన్న తెలివి కలగటం ఎంతో మేలు కదా!' అన్నారు భగవాన్ '.

అంతటితో ఆ యువకుడు యెంతో సంతోషించి బయలుదేరి వెళ్ళిపోయాడు.

మీ భగవాన్ గొప్పవారైనా, మీలాగే తిని నిద్రిస్తూ . . . జబ్బు పడుతో . . .

Monday, July 6, 2009
ఒకప్పుడు మరుళశంకరర్ అనే పేరుగలాయన ఒక మఠం వద్ద ఎంగిలాకులు పారవేసేచోట పిచ్చివానిలా నివసిస్తూ ఉండేవాడు . ఆ మఠాధిపతికి గాని, వారి శిష్యులకుగాని యీ వ్యక్తిని గురించి ఏమీ తెలియదు. ఒకసారి అల్లమప్రభువు ఆ దారిన వెళ్ళగా మరుళశంకరర్ లేచి వారి పాదాలకు నమస్కారము చేయగా అల్లమప్రభువు వారిని కౌగిలించుకొన్నారు. వారిరువురికి ఎదుటివాళ్ళ విలువ బాగా తెలుసు. జ్ఞాని మాత్రమే యింకొక జ్ఞానికి గుర్తించగలరేమో. క్రియా చర్యా, యోగములలాంటివి అభ్యసించే వాళ్ళను వాళ్ళ నడవడివల్లనే గుర్తిస్తారేమో.

రమణాశ్రమానికొచ్చేవాళ్ళల్లో ఎంతోమంది భగవాన్ గురించి

'మీ భగవాన్ ఎంతో గొప్పవారు,
ఆత్మజ్ఞాని అని మీరందరూ ఎలా అనుకుంటారు?
ఆయన కూడా మీలాగే తిని నిద్రిస్తూ
మిగిలిన పనులన్నీ చేసుకుంటున్నారు కదా?
అప్పుడప్పుడు ఆయనకి జబ్బు కూడా చేస్తుంది కూడానూ' అని అంటూంటారు

గిరి ప్రదక్షిణంలో చిరుతపులి

Monday, June 1, 2009
పూర్వం ఒకసారి భక్తులు కొందరు అర్థరాత్రి వెన్నెలలో వేదం చదువుకుంటో గిరి ప్రదక్షిణం చేస్తున్నారు. అడవిలో కొండమీద నుంచి ఒక చిరుతపులి దూకుతూ వచ్చి రోడ్డుమీద వాళ్ళ తోవకు అడ్డంగా నుంచుంది. వాళ్ళు హడిలిపోయినారు. నోట వేదం ఆగిపోయింది. వెనక్కి పరుగెత్తడానికి కాళ్ళు ఆడలేదు. ఆ చిరుతపులి అట్లాగే కొంచెంసేపు నుంచుని వాళ్ళకేసి కాస్సేపు చూసి తన తోవన వెళ్ళిపోయింది. మెల్లిగా నడుచుకొంటూ బతుకుజీవుడా అని వాళ్ళు ప్రదక్షిణం పని ముగించుకుకొని ఆశమానికి వచ్చి భగవాన్ తో చెప్పారు.

'ఎందుకు భయపడి వేదం చదవటం ఆపారు? వాడు ఒక జ్ఞాని.
మీ వేదం విని, ఇంకా దగ్గిరగా వినాలని ఆసక్తితో వచ్చాడు ' అన్నాడు భగవాన్.

మనసు పరిపరి విధాల పోతోంది

Saturday, May 30, 2009
ఒకరోజు ఒకామె వచ్చి భగవాన్ దర్శనం చేసుకొని వెళ్ళేటప్పుడు
'మనసు పరిపరి విధాల పోతోంది. ఏం చెయ్యను స్వామీ?' అని అడిగింది.

'ఒకే విధంగా పోయేట్టు చూడు ' అన్నారు.

ఆమె వెళ్ళాక రంగన్ అనే భక్తుడు అడిగాడు
'భగవాన్! అది చాతనైతే, ఇంకేం కావాలి? జ్ఞానమే కదా?'
'మరి ఏం చెయ్యను? రాగానే తాము జ్ఞానులై పోవాలని
ఆశపడతారు మనుషులు. చాలా సులభమనుకుంటారు.
దాంట్లో వుండే కష్టాన్ని గుర్తించరు ' అన్నారు భగవాన్.

జ్ఞాని

ఒకసారి ఓ భక్తుడు భగవాన్ ని అడిగాడు.
'ఓ జ్ఞాని ఇంకో జ్ఞానిని గుర్తించగలడా?'

దానికి భగవాన్
'జ్ఞానికి గుర్తించటానికి ఏముంటుంది?
తాను, తక్కిందీ అంతా ఒకటే ఆత్మ కదా జ్ఞానికి!' అన్నారు.

Blessing

Blessing
Bhagavan Memories