Showing posts with label భక్తులు. Show all posts
Showing posts with label భక్తులు. Show all posts

రమణాశ్రమానికి పక్కన విభూతి స్వామి ఆశ్రమం

Thursday, September 22, 2011
భగవాన్ కి కాళ్లనొప్పులు తగ్గటానికి విటమిన్లు గల ఆహారం ఇస్తే మంచిదని డాక్టర్ల సలహావల్ల ఆహారపదార్థాలలో ఏమేమో మార్పులు చేసి సేవకులు అప్పుడప్పుడు తైలం రుద్దీ, కాళ్లు ఒత్తీ తోచిన ఉపచారాలు చేస్తూ వుంటే భగవాన్ ఛలోక్తిగా 'ఇంటికి చుట్టం వస్తాడు. చూచి చూడనట్లుంటే త్వరగా వెడతాడు గాని మర్యాద చేస్తే వెళ్లనే వెళ్లడు. వ్యాధిన్నీ అంతే. మీరట్లా ఉపచరిస్తే అదెందుకు పోతుందీ? లక్ష్యపెట్టకుంటే, తానే పోతుంది ' అంటూ పరిహాసమాడుతూ వుంటారు. 

ఆ మధ్య విభూతి ఇచ్చి రోగాలు పోగొడతానని ఒక యువకుడు వచ్చి ఆశ్రమం దాటి ప్రదక్షిణం వెళ్లే రోడ్డున ఒక మైలు దూరంలో మకాం వేశాడు. జనానికి వేలం వెఱ్ఱిగాదూ. ఆ విభూతి స్వామిని చూడాలని నేల యీనినట్లు వ్యాధిగ్రస్తులూ, దయ్యాలు పట్టినవారూ, భూతాలు పట్టినవారూ, అక్కడికి పోతూ వస్తూ ఆశ్రమానికిన్నీ వచ్చేవారు. ఇక్కడేం, విభూతులా? రక్షరేకులా? దర్శనం చేసుకొని హాలు చుట్టూ తిరిగి పోయేవాళ్లు. 

ఆ సమయంలో సేవకులెవరన్నా కాళ్లకు తైలం రుద్దటానికి ఆరంభిస్తే భగవాన్ మందహాసం చేస్తూ 'భేష్! ఇదీ ఒకందుకు మేలే! ఈ జనమంతా నన్ను చూచి 'ఈ స్వామి తానే కాళ్లనొప్పులతో బాధపడుతూ, ఇతరులచేత పట్టించుకుంటున్నాడు, మనకేం చేస్తాడురా ' అని దగ్గరకు రాకుండానే పోతారు. మంచి ఉపాయం ' అనేవారు.

ఎప్పుడో యిస్తానంటే కాదు స్వామీ. ఇప్పుడే మోక్షమివ్వండి !!

Monday, February 1, 2010
కానొక రోజు మధ్యాహ్నం మూడు గంటల వేళ ఒక స్త్రీ కొత్తగా వచ్చి హాలులో కొంతసేపు కూర్చుంది. ఆ కూర్చున్నంత సేపూ భగవాన్ ని యేదో అడగాలని ఆరాటంగా కనిపించింది. భగవాన్ యేదో చదువుకుంటూ వుండటం వల్ల తనూ అడగలేకపోయింది చాలాసేపు. భగవాన్ తను చదువుతూ వున్న పుస్తకాన్ని పక్కన పెట్టగానే ఆమె లేచి సోఫా దగ్గరకు వెళ్ళి 
'స్వామీ! నాకు ఒక్క కోరిక వున్నది. చెప్పమంటారా?'  అంది. 
'సరే! ఏం కావాలి?' అన్నారు భగవాన్.
'మోక్షం ' అన్నదామె. 
భగవాన్ 'ఓహో! అట్లాగా!' అన్నారు. 
'అవును స్వామీ!' మోక్షం ఒక్కటి ప్రసాదిస్తే  చాలు' .
సరేనన్నారు భగవాన్. 
'ఎప్పుడో యిస్తానంటే కాదు స్వామీ. ఇప్పుడే ఇవ్వాలి ' అన్నదామె. మళ్ళీ సరేనన్నారు భగవాన్. ఆమె వెళ్లిపోయింది సెలవు తీసుకుని. ఆమె అలా వెళ్ళగానే అక్కడే హాలులో వున్న సుబ్బాక్ష్మమ్మ అనే ఒకావిడ అందుకొని 

'మేమూ అందుకే వచ్చి వున్నాం. ఇంకేమీ వద్దు, మోక్షమిస్తే చాలు స్వామీ ' అంది. 'అట్లాగా. ఏమీ వద్దని అన్నీ విడిచిపెడితే వుండేది మోక్షమే. ఒకరిచ్చేదేమి? ' అన్నారు భగవాన్. 'అదంతా మాకు తెలియదు. భగవానే మాకు మోక్షమివ్వాలి.! ' అంటూ ఆమె వెళ్ళిపోయింది.  

'అదేమి మూటా ముల్లా?  కట్టి ఇచ్చేందుకు? ఇంక యేమీ కోరరట? ఒక్క మోక్షమిస్తే చాలట. అది మాత్రం కోరిక కాదు గాబోలును. ఉన్నవన్నీ పోగొట్టుకుంటే మిగిలేది మోక్షమే. అవి పోగొట్టుకునేందుకు సాధన చేయాలి ' అన్నారు భగవాన్.

భగవాన్! మీరీ ఔషధం సేవించండి !

Thursday, January 21, 2010
 కసారి 1945 నవంబరులో రామచంద్రరావు గారని ఆయుర్వేద వైద్యులు భగవాన్ శరీరానికి బలమిచ్చే ఔషధం చేయటానికని దినుసులన్నీ జాబితా రాసుకొని భగవాన్ కు  చూపారు. చెప్పగానే వినే బుద్దిమంతుడైన పిల్లవాడిలాగ అవన్నీ చదివి వాటివాటి గుణాలు పొగడి 'ఎవరికయ్యా ఈ మందు?' అన్నారు భగవాన్. 'భగవానులకే ' అన్నారాయన. 'సరి సరి ,పెద్ద జాబితాయే పట్టుకొచ్చావు గానీ, డబ్బులకెక్కడికి పోయేది ? పది రూపాయలవుతుంది. యెవరిని యాచించాలి?' 'అయ్యో! ఇదంతా యెవరిది స్వామీ?' అన్నారెవరో. 'సరేలే! నాకేముంది. అంతా ఆ సర్వాధికారిని (ఆశ్రమాధికారి) అడగాల్సిందే. ఎవరడుగుతారిప్పుడు. గంట కొట్టగానే పోతే పట్టేడన్నం పెడతారు. అందరితో పాటు తినివస్తాను. ఆలస్యమైతే పెట్టం పొమ్మంటారేమో అన్న భయంతో. ఆ వడ్డనలోనూ లాస్టులో ఫస్టే కదా '  అన్నారు భగవాన్. పాపమా వైద్యులు కంపిత హస్తాలు జోడించి 'వూరికే జాబితా చూపించానేగాని దినుసులు నేను తెస్తాను స్వామీ ' అంటే, 'సరే! ఇది నాకు మంచిదైతే వీరందరికీ మంచిది కాదా? నాతో పాటు అందరికీ ఇవ్వగలరా? పనిచేసేవాళ్లకు బలమిచ్చే మందు వద్దు గాని తిని కూర్చుండే నాకు మాత్రం కావాలీ? చాలు చాలు పొండి ' అన్నారుభగవాన్.

డాక్టరు శ్రీనివాసరావుగారొకప్పుడు ఇంగ్లీషు మందేదో బలమిచ్చేది వున్నది, భగవాన్ అది పుచ్చుకుంటే మంచిదన్నారు. మంచిదే. 'మీరు ధనవంతులు. ఏదైనా ఏదైనా తినవచ్చును. నేనో, బిచ్చగాడిని. అంత ఖరీదు గల మందులు నాకెట్లావస్తాయి?' అన్నారు భగవాన్. 'భగవాన్ అన్నీ వద్దంతాౠ గాని తినేటట్టయితే రావా, పోనీ మందులు కాకుంటే మానెయ్యండి, ఆహారమైనా బలకరమైనది తినగూడదా? అరవిందులు చూడండి, పాలూ, పళ్లూ, బాదం, మొదలైనవి తిని బలిష్ఠులై వుంటారు. వారి భోజనమే ప్రత్యేకం ' అన్నారు డాక్టరు. 'సరి సరి, ఇవన్నీ తినేందుకు నాకేముందీ? దరిద్ర నారాయణుణ్ణి, పైగా, నేనేం వంటరిగాణ్ణా యేమి? గంపంత సంసారం! అందరికీ పళ్ళూ, పాలూ, బాదం ఎట్లావస్తాయి?' అన్నారు భగవాన్.

భగవాన్ కి ఆ రాత్రి భోజనం లేదు

Sunday, June 21, 2009
ఒకసారి చంద్ర గ్రహనం: సాయమ్రం 5:30 గంటలకే భోజనానికి గంట కొట్టారు, భోజనాలు గ్రహణానికి ముందే తినాలని, ఆ సంగతి ముందే భగవాన్ తో చెప్పలేదు. అందరూ వెళ్ళి కూచున్నారు, విస్తళ్ళముందు.

'ఆ గంట ఏమిటా?' అని అడిగారు భగవాన్.
'గ్రహణానికి ' అని చెప్పారు. విని 'అట్లాగా ' అని వూరుకున్నారు.
భగవాన్ భోజనానికి లేవలేదు. భోనజానికి పిలిస్తే వినిపించుకోలేదు.

చూసి చూసి ఎవరో ఇద్దరు ముగ్గురు తప్ప మిగిలినవారు భోజనం చెయ్యకుండానే లేచి వచ్చారు.భోజనానికి మామూలుగా గంటకొట్టే సమయానికి 7:30 కి భగవాన్ గడియారం వైపు చూశారు. కాని ఎవరూ మాట్లాడలేదు. వారిని ఎవరూ పిలవలేదు. గంట కొట్టలేదు. గ్రహణం అయిపోయింది. 9:30 కి భోజనానికి గంట కొట్టారు. భగవాన్ లేవలేదు. అందరూ వెళ్ళి భోజనం చేశారు.

భగవాన్ కి ఆ రాత్రి భోజనం లేదు , కొందరు మాత్రం 'భగవాన్ భోజనం చెయ్యలేదు ' అని కలవరపడ్డారు.

స్వామికి ఒక్క నమస్కారం పెడితే సరిపోతుంది ?!

Thursday, June 11, 2009
వొక భక్తురాలు వారణాసి సుబ్బలక్షమ్మ మాటల్లో -

మొదటి నుంచీ కూడా భగవాన్ వాకిట్లోకి వెళ్ళేటప్పుడూ వచ్చేటప్పుడూ నేను ఆయనని చూడగానే లేచి నుంచుంటో వుండేదాన్ని. ఆయన చూస్తోనే వుండేవారు. ఆయన మా ఎదురుగా వస్తే చాలు - అందరం కూడా భయ భక్తులతో ఒక పక్కకి ఒదిగి వుండేవాళ్ళం. నేను వూళ్ళో కాపురం వుండి ఆయన దర్శనార్థం వొచ్చేకాలంలో నేను వచ్చినప్పుడల్లా కొంచెం ద్రాక్షపళ్ళు కొని తీసుకొని వచ్చి ఆయనకిచ్చే అలవాటు. ఒక సాయంత్రం అదే ప్రకారం తెచ్చిన ద్రాక్షపళ్ళను ఆయన ముందు పెట్టాను. దానిని చూసి,

'ఇప్పుడెందుకు తెచ్చావు? ' అని నవ్వి, 'ఎప్పుడు తెచ్చావు ఇవి? పొద్దున తెచ్చావా, వొచ్చేటప్పుడు? అయితే, యివి ఇప్పుడెందుకు పెట్టావు? ' అని నన్నూ - అందర్నీ కలిపి - 'ఇదంతా ఎందుకు? స్వామిని చూసి నుంచునేదీ, చాలా భక్తి వున్నట్టు నటించేదీ, యీ వేషాలన్నీ ఇక్కడికి వచ్చిన తరువాత యిది నేర్చుకున్నది. ఇవన్నీ యెందుకు ? వీటివల్ల ఏం ఫలం? మామూలుగా వుంటే చాలదా? మనసు నిర్మలంగా వుండాలిగాని; యీ నమస్కారాలూ, మన్ననలూ - యివన్నీ వేషం. స్వామి కన్ను తుడిచి ఏమార్చాలని చూసే పనులు ' అని మురుగునారుతో అన్నారు.

యింకా యిలా అన్నారు
'యీ నమస్కారాలు అన్నీ యేం ప్రయోజనం? మొదట మనుషులు ఇక్కడికి వచ్చేటప్పుడు భక్తి వినయాలతో వస్తారు. తరువాత త్వరలోనే సర్వమూ వారిదే. అంతా వారి ఇష్టమే. అధికారమే. వారు చెప్పినట్లు స్వామి వినాలి. స్వామిది యేదీ లేదు. వారు యెన్ని తప్పులు చేసినా వూరికే నోరుమూసుకు వుండవలసిందే స్వామి.

వారు ఒక్క నమస్కారం చేశారా, అర్థం ఏమిటంటే - మేము నమస్కారం పెట్టాం గదా, మా తప్పులకీ ఇక మీరు ఏమీ అనడానికి వీలులేదు అని ' ఇట్లా చాలా కోప్పడ్డారు.

భగవాన్ సమక్షంలో సామాన్యురాలు

Thursday, June 4, 2009
ఎవరికన్నా తనకి అధికంగా ఏమి ఇచ్చినా భగవాన్ ఏ మాత్రం సహించేవారు కారు. తనని వొదిలి, వారికే ఎక్కువగా శ్రద్ద చూపమనేవారు. తనకి ఏవి ఎవరు సమర్పించినా, తనకి వొళ్ళు బావుండనప్పుడు కూడా వాటిని ముందు అందరికీ పంచవలసిందే. తనని, తన భక్తులలో చూడమనేవారు.

ఒకసారి, కొన్నాళ్ళనించి భగవాన్ భోజనంలో మజ్జిగ పోసుకోవటంలేదని గమనించారు వొడ్డించేవారు. భగవాన్ కి దగ్గిరగా కూచొని భోజనం చేసే దేవరాజ మొదలియార్ భరించలేక,

'భగవాన్! మేమందరమూ అన్నీ సమృద్దిగా తింటున్నాం. ప్రతి భోజనం లోనూ మీరేమో ఎప్పుడూను ఏదో ఒకటి సరిగా వెయ్యనీక వొదిలేసి భోజనం చేస్తూ వుంటారు, చూస్తూ చూస్తూ మేమెట్లా తినగలం? ' అని అడిగాడు.

దానికి భగవాన్ -
'భగవాన్ కి ఏం తక్కువ? భగవాన్ కి ఇష్టం వుండినా వుండకపోయినా, వూరికే ఇంతింత పోస్తారు. భగవాన్ భక్తులకూ పొయ్యాలంటే మాత్రం చేతులు రావు ' అన్నారు.

పని చేసేవారిని కనుక్కుంటే అసలు సంగతి తెలిసింది. బెంగుళూరునించి ఒక అమ్మాయి ఆశ్రమానికి వొచ్చింది. ఆమె భోజనం చేస్తో ఇంకొంచెం చారు అడిగింది. ఆ సమయాన మజ్జిగ పోస్తున్నారు. వొడ్డించేవారు ఆ అమ్మాయి అడిగింది వినీ లక్ష్యం చేయక, ఆమె తింటున్న చారు అన్నంలోకి మజ్జిగ పోసేశారు. ఆ ఒక్క సంగతే కాదు, వొడ్డించేవారికి తినేవారిపైన అశ్రద్దే కాదు, తృణీకారం కూడా వుండేది. భగవాన్ కి ముఖ్యులమనుకునే భగవాన్ సమీపవర్తులకి, సంపన్నులకీ శ్రద్దగా వొడ్డించి - కొత్తగా వొచ్చినవారికి, సామాన్యులకి, భగవాన్ దూరంగా భోజనానికి కూచున్నవారికి నిర్లక్ష్యంగా వొడ్డించేవారు. తనకోసం వచ్చిన భక్తుల్ని తనవలె చూడమని, సేవ చేయమని, భగవాన్ ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకునేవారు కాదు. అందుకని, తనని నమ్మివున్న ఆ ఆశ్రమ సేవకులకోసం వారికి సత్ప్రవర్తనా, సమదృష్టీ నేర్పదానికి భగవానే తాను సరిగా తినేవారు కాదు.

Blessing

Blessing
Bhagavan Memories