Showing posts with label భగవాన్ కరుణ. Show all posts
Showing posts with label భగవాన్ కరుణ. Show all posts

'ఆ గిన్నెను ముట్టుకున్నావెలాగ ? మాలవాడు తెచ్చి పెట్టాడిప్పుడే ' అన్నారు భగవాన్.

Wednesday, July 15, 2009
భగవాన్ జాతి కుల మత భేదాలు ఆటించరు. అళగమ్మ పూర్వాచార పరాయణురాలు. తల్లి మూడనమ్మకాలూ, అర్థంలేని ఆచారాలూ మానిపించడానికి ఎంతో పాటుపడ్డారు.

'నీ మడిబట్టనెవరో తాకారం' టారు భగవాన్. అళగమ్మ మళ్ళీ బట్ట తడిపి ఆరేసుకుని స్నానం చేస్తుంది. 'ఆ గిన్నెను ముట్టుకున్నావెలాగ ? మాలవాడు తెచ్చి అక్కడ పెట్టాడిప్పుడే ' అంటారు భగవాన్. అళగమ్మ మళ్ళీ స్నానం చేస్తుంది. పాపం, వయసు మళ్ళిన తల్లి, రోజుకెన్నిమాట్లని స్నానం చెయ్యగలదూ !

ఎవరో చెప్పారు భగవాన్ నిత్యశుచి, వారిని తాకితే చాలు, వేరే స్నానం చెయ్యక్కర్లేదని. అప్పటినుంచీ అలా చెయ్యడం ప్రారంభించింది. అళగమ్మకు ఉల్లిపాయలూ, మునగ కాయలూ, వగైరా నిషిద్దం. ఈ పిచ్చి ఊహలని పోగొట్టాలని భగవాన్ ప్రయత్నం.

'అమ్మా, యీ వేళ ఆశ్రమంలో ఉల్లిపాయలూ, మునగకాయలూ తప్ప మరింకేవీ లేవు. తిన్నావో, నువ్వు స్వర్గానికెళ్లేటపుడు ఉల్లిపాయ పర్వతాలూ, మునగమహారణ్యాలు అడ్డొస్తాయి, ఎలాగమ్మా ' ? అంటారు. ఎన్ని విధాలో ప్రయత్నించారు భగవాన్ - తల్లి మూడనమ్మకాలు పోగొట్టడానికి, చివరికి పోయాయి కూడానూ. అళగమ్మ పూర్తిగా మారిపోయింది. భగవాన్ ఆమెను దిద్దవలసినరీతిగా తీర్చిదిద్దారు. భగవాన్ తల్లిననే తన ప్రత్యేకతను విస్మరించింది. ఇప్పుడామె భగవాన్ భక్తులలో భక్తాగ్రగణ్య. భగవాన్ కి సంపూర్ణ శరణాగతి చెందింది. కర్తవ్య నిర్వహణనాచరిస్తూ వుంటోంది.

భగవాన్ అతనితో - ' శివ శివ అనుకో - పో ' అన్నారు.

Saturday, July 11, 2009
ఆశ్రమం ఏర్పడ్డ మొదటి రోజులలో హరిజనుడు ఒకడు ఆశ్రమం బయట గుమ్మం దగ్గర నుంచుని ఉండేవాడు, తనని లోపలకు రానీయరు కనుక. భగవాన్ బయటికి వెళ్ళినప్పుడల్లా వారి వెంట అతను వెళ్ళేవాడు. తిరిగి భగవాన్ ఆశ్రమంలోకి వెళ్ళేటప్పుడు గుమ్మం దగ్గర నిలిచిపోయేవాడు ఆ భక్తుడు.

కొన్నాళ్ళు అలా జరిగింది.
ఒక సాయంత్రం భగవాన్ బయటికి వెళ్ళివచ్చి, బావి దగ్గర నించున్న ఆ హరిజనుణ్ణి తన వద్దకు రమ్మని పిలిచారు. అతను సాష్టాంగపడి నించున్నాడు.

భగవాన్ అతనితో -
'శివ శివ అనుకో - పో ' అన్నారు.

అతను వెళ్ళిపోయినాడు అంతే. తిరిగి యెవ్వరికీ కనబడలేదు.

అంతా మాయ కదా! అన్నమూ మాయె, మీరు తినడమూ మాయె.

Sunday, July 5, 2009
భక్తులు అనేకమంది తీసుకొని వచ్చి యిచ్చేవారు, పంపేవారు పోస్టులో మందులు భగవాన్ కి - కాళ్ల నెప్పులకు రాసుకోటానికి, వంటికి బలానికీ, ఇట్లా ఎన్నో బుడ్లు చేరాయి భగవాన్ దగ్గిర అన్ని రకాల వైద్యాలవి. ఒకసారి భగవాన్ ఒక పెద్ద ఖాళీ బుడ్డి తెమ్మన్నారు. తెచ్చాక తన దగ్గర చేరుకున్న బుడ్లలోని మందులన్నీ దాంట్లో పోయమన్నారు. తాగేవి, రాసుకునేవీ అన్నీ పోశాక వాటి నన్నింటిని కలిపినదాన్ని రోజూ ఒకగరిటెడు తనకు తాగటానికిమ్మన్నారు. ఇలా కలిపిన మిశ్రమం వల్ల వాటిల్లో కొన్ని విషాలు.

'ఇదేమిటి భగవాన్ ?' అన్నారు.
'అవును, నామీద ప్రేమతో, భక్తితో యిన్ని మందులు, పంపుతారు, యిస్తారు.
ఇవన్నీ ఎట్లా తాగి, రాసుకుని వారిని తృప్తి పరచను? కలిపి తాగేస్తే సరిపోతుంది ' . అన్నారు.

డాక్టరు పరుగెత్తుకుంటూ వచ్చాడు అలోపతీ, ఆయుర్వేదం, హోఇయోపతి మందులు, పూతలు, తైలాలు, విషాలు, అన్నీ చూశాడు. హడలిపోయినాడు. అందరూ కలిసి ఒక్కటే మొర, తాగవదని భగవాన్ తో. బుడ్డి తీసుకుపోయి దాచెయ్యడం చాలా కష్టమైపోయింది.

ఒకసారి భక్తురాలు ఎచ్చెమ్మ తాను చేసిన ప్రసాదం వడ్డించింది భగవాన్ విస్తట్లో.
'ఏమిటి, యింత ఎట్లా తినను?' అన్నారు భగవాన్.
దానికి ఆమె -
'అంతా మాయ కదా!
అన్నమూ మాయె, మీరు తినడమూ మాయె.
దీంట్లో సత్యమెక్కడ వుంది, మీకు జబ్బు చేసేందుకు?' అంది.

భగవాన్ , 'చూశారా, మనం అన్నమాటలు మనకే ఎట్లా వప్పగిస్తారో!' అని నవ్వారు.

భగవాన్! మీరు చిక్కిపోతున్నారు, హార్లిక్సు చేసి తీసుకొచ్చాను.

Saturday, July 4, 2009
ఎవరు ఏ వేళప్పుడు ఏం తీసుకొచ్చినా భగవాన్ తినేవారు. ఆయన వంటికి జబ్బు చేసేది చాలాసార్లు ఆ ఫలహారాలవల్ల, ఎవరన్నా తన దగ్గర వుంటే అందరికీ పంచితీరాలి, ఆ ఫలహారాల్ని. కాని, ఒక్కొక్కరు తీసుకొని వస్తేనా, అదే పనిగా తీసుకొస్తూ వుంటేనూ తాకేవారు కారు, ఆ తీసుకొచ్చిన వాటిని.

ఒక భక్తురాలు హార్లిక్సు చేసి తీసుకువచ్చి పెట్టింది భగవాన్ ముందు తాగమని, అందరిలోనూ,

'ఏమిటిది? నా కెందుకు?'
'హార్లిక్సు. మీరు చిక్కిపోతున్నారు. తాగి తీరాలి ' అందామె.
'నేనేం పాపాయినా? తీసుకుపో!' అని కఠినంగా పంపేశారు.

Freedman అనే భక్తుడు ఒక గ్లాసునిండా నారింజరసం తీసుకొని వచ్చి యిచ్చాడు భగవాన్ కి తాగటానికి. ఆ గ్లాసు తీసుకొని చూసి భగవాన్,
'అంతేనా? ఇది చాలదే?' అన్నారు.
ఇంకా కావాలంటున్నారనుకుని ఆశ్చర్యపడి చూశాడు అతను.
'అందరికీ యివ్వటానికి' అన్నారు భగవాన్ కూచున్న వందలాది భక్తులకేసి చూస్తో.
'కాదు భగవాన్, మీరు పాలిపోయినట్లు కనబడుతున్నారు.
మీరు తాగండి, మీకోసం తెచ్చాను ' అన్నాడు.

'నాకన్న పాలిపోయి కనబడుతున్నావు,
నీకెక్కువ అవసరం, నువ్వు తాగు ' అని ఒక చంచాడు తీసుకొని తక్కింది యిచ్చేశారు.

విరిగినవన్నీ కూలి ఈశ్వరుడికి | ఈ ముక్కలన్నీ మీవి, తీసుకొచ్చాను

Wednesday, July 1, 2009
సుందరేశయ్యర్ జ్ఞాపకాల్లో ...

ఒక రోజు మా ఆవిడ దోసెలు చేస్తూంది. 'విరిగినవన్నీ కూలి ఈశ్వరుడికి ' అని నవ్వుతూ వెళ్ళిపోయాను. ఆకలితో దోసెలు తినాలని ఇంటికి వచ్చాను. 'అన్ని దోసెలు ముక్కలై వొచ్చాయి.' అని ఆ ముక్కల్ని చూపింది. ఏం చెయ్యను? ఏమి అనకుండా భగవాన్ దగ్గరికి తీసుకొనిపోయి వారి ముందర పెట్టాను.

'ఏమిటిది?' అన్నారు.
'నా భార్య దోసెలు చేస్తోవుంటే నవ్వులాటకి నేను, మాణిక్యవాచకర్ కథలో మల్లే,
విరిగినవన్నీ ఈశ్వరుడికి అనేసి వొచ్చాను.
ఒకటీ సరిగా రాలేదు. ఈ ముక్కలన్నీ మీవి గనక మీకు తీసుకొచ్చాను ' అన్నాను.

నవ్వుతో ఆయన నాలుగు ముక్కలు తిని, తక్కినవి భక్తులకు పంచి పెట్టించారు.

ఒకసారి చిన్నస్వామికి నా మీద అమితమైన కోపంగా ఉంది. ఆ దిగులులో నేను రాత్రి భోజనం చెయ్యలేదు. తెల్లారి ఆకలిగా ఉంది. ఆశ్రమంలో నిలువ మనస్కరించలేదు. భగవాన్ తెల్లారకట్ల ఇడ్లీ చేస్తున్నారు. వెళ్లి నమస్కరించాను. 'ఏమిటి సమాచారం?'
'టవునుకు వెడతాను.'
'ఎందుకు?'
'పిల్లలు ట్యూషన్ కు కాచుకుని ఉంటారు.'
'తెలుసు. నాకు తెలుసు నీ దొంగతనం, ఆదివారంనాడు నీకు ట్యూషన్ ఏమిటి? ఎవరికి చెప్పుతావు? వంకాయ సాంబారు చేశాను మధ్యాహ్నానికని. ఇప్పుడే నీకు వేసి పెడతాను. రా. తిను . పద, కూచో ' అని తొందరగా విస్తళ్ళు వేశారు.

తానూ నా పక్కన కూచుని నా దిగులు మరచిపోయేట్టు ఎన్నో కబుర్లు చెప్పి నవ్వించారు.
అట్లాంటిది భగవాన్ కరుణ.

జబ్బు నయం చెయ్యమని ఆయన కూతురు భగవాన్ని ప్రార్థిస్తూ

Friday, June 19, 2009
భగవాన్ భక్తుడు మహాదేవయ్యర్ ఓ నెల రోజుల నుంచి మద్రాసులో ఎక్కిళ్ళతో బాధపడుతున్నారు. ఆ జబ్బు నయం చెయ్యమని ఆయన కూతురు భగవాన్ని ప్రార్థిస్తూ ఉత్తరం రాసింది. బెల్లమూ, శొంటి పొడుం నూరి తింటే ఎక్కిళ్ళు నయమౌతాయని రాయమని, మాధవస్వామి (పరిచారకుడు) వేపు తిరిగి . . . 'తయారు చేసిన మందు మన దగ్గిర వుండాలి కదూ!' అని అడిగారు. మాధవస్వామి ఆ బుడ్డి తీసుకొచ్చాడు.

దాన్ని కొంచెం భగవాన్ తీసుకొని భక్తులకి కొంచెం పంచిపెట్టారు.
అది చూసి సుందరేశయ్యర్ అనే భక్తుడు 'ఇంకా ఉత్తరం కూడా ఎందుకు? మహాదేవయ్యర్ కి యీ పాటికి ఎక్కిళ్ళు నయమై వుంటాయి ' అని. ఆ సాయంత్రమే ఉత్తరం రాశాను. కాని ఆ ఉత్తరం అందకుండానే, మర్నాటికే ఉత్తరం వచ్చింది. మధ్యాహ్నం ఒంటిగంట నించి అయ్యర్ గారికి ఎక్కిళ్ళు కట్టాయి అని.

సరిగా అదే సమయానికి భగవాన్ మందు తిన్నది.

భగవాన్, మేము మీ దేహారోగ్యం కోసం అర్చన చేయించాం. ప్రసాదం తీసుకోండి

Wednesday, June 10, 2009
భగవాన్ కి కురుపు లేచి ఆపరేషను అవుతున్నపుడు ఓసారి వారికి ఎట్లాగో నయం చెయ్యాలనే ఆదుర్దాలో, రాజయ్యార్ అనే భక్తుడికి పని నేర్పిన ఓ పోస్టుమాష్టరుగారూ , రాజయ్యార్ , తంజావూరు దగ్గిర ప్రసిద్దికెక్కిన పచ్చయమ్మ దేవాలయానికి డబ్బు పంపి, అర్చనలు చేయించి ప్రసాదం తెప్పించారు. ఆ ప్రసాదం భగవాన్ కి అందివ్వాలి , అప్పటికి భగవాన్ దగ్గిరకి పోగూడదు, భగవాన్ తో మాట్లాడకూడదనే నిబంధనలు తీవ్రంగా ఉన్నాయి. ఎవరన్నా భగవాన్ దగ్గిరకు వెళ్ళడం ఆశ్రమ పెద్దలు చూశారా ఆశ్రమం బయటికి తరుముతారు. అందుకని భగవాన్ని ప్రార్థించుకుంటో, సహాయం కోసం చూస్తున్నారు. మధ్యాహ్నం రెండ్గంటలకి ఎవరూ లేరు.

వీళ్ళిద్దరూ పిల్లుల మల్లే లోపల దూరి,'భగవాన్, మేము మీ దేహారోగ్యం కోసం పచ్చయమ్మకి అర్చన చేయించాం. ఆ ప్రసాదం మీకు తీసుకొచ్చాం ' అన్నారు, ఏం కోప్పడతారనే భయంతోనే. కాని, వారు వారి హృదయంలోని భక్తి శ్రద్దల్ని మాత్రమే గమనించి వుంటారు. కాకపోతే, సర్వేశ్వరుడికి జబ్బు చేస్తే, పచ్చయమ్మ ప్రసాదం నయం చేస్తుందా? అయినా , భగవాన్ ఆ విభూతి కుంకుమలని చాలా ఆదరంతో తీసుకుని, మొహాన పెట్టుకుని, వొంటికి రాసుకుని, ఆ కురుపు మీద కూడా నెమ్మదిగా రుద్దుకున్నారు. పచ్చయమ్మ మహత్యం గురించి మాట్లాడారు. భక్తులిదరూ ఎంతో తృప్తి పడి సంతోషంతో వొచ్చేశారు.

ఏ విధాన, ఏ తాహతుతో, ఎట్లా ఏ భక్తుడు అయనని సమీపిస్తే
ఆ విధంగా వారి అంతస్తులోనే తృప్తినీ, ప్రీతినీ కలిగించేవారు.

ఏదో పిశాచం గావునని మరీ భయం వేసింది !

Friday, June 5, 2009
ఒకసారి రమణ భక్తులు సంపూర్ణమ్మా, సుబ్బలక్షమ్మా గిరి ప్రదక్షిణం బయలుదేరారు తెల్లారకట్టే. బాగా చీకటిగా వుంది. వుంది. ఎట్లా వెళ్ళాడం. వెళ్ళాలా ?లేదా?తోవలో పాములున్నాయేమో? కనబడవే అనుకున్నారు. ఇంతలో వారి ముందు తోవలో యేదో నీలం రంగు వెలుతురు పడ్డట్టు అయింది. ఏదో పిశాచం గావునని మరీ భయం వేసింది. కాని, చూస్తే ఆ వెలుతురు వల్ల ధైర్యం వొస్తోంది గాని, భయం కలగటం లేదు.

వాళ్ళ వెంటనే వొచ్చింది ఆ వెలుతురు -
పగటి వెలుతురు వొచ్చి వాళ్ళ భయాలు పోయిందాకా తోవ చూపుతో.

ఇంకోసారి వాళ్ళిద్దరూ కొండ చుడుతున్నారు, పొద్దున్న ఎనిమిదిగంటలకి, కబుర్లు చెప్పుకుంటో. రోడ్డు నిర్జనంగా వుంది. వాళ్ళ వెనక ఎవరో సామియార్ వొస్తున్నారు. ఇద్దరూ వయసులోవున్న ఆడవాళ్ళూ. ఇంకా అడవిలోకి పోయాం వెనక యీ పురుషుడెందుకని , ఆయనని ముందు పోనిద్దామని ఆగారు . ఆ సామియార్ ఆగారు. సంపూర్ణమ్మకు అనుమానమేసింది. మళ్ళీ నడిచారు. ఆయనా నడిచారు. మళ్ళీ ఆగారు. ఆయనా ఆగారు. ఇట్లా మూడు నాల్గుసార్లయ్యేటప్పటికి వాళ్ళకి భయం వేసింది. రోడ్డు మీద ముందూ వెనకా ఇంకేం మనుషులు కనపడరు. ఎట్లాగా అని - 'అరుణాచలేశ్వరా, నువ్వే ఎల్లకాలాలందూ శరణ్యం ' అని బిగ్గరగానే అన్నారు .

దానికి ఆ సామియార్
'అవును. అరుణాచలేశ్వరుడే సదా శరణ్యం. ఎప్పుడూ అట్లాగే తలుచుకోండి.
చూడండి, ఆ జ్యోతే లోకాన్నంతా తేజస్సుతో నింపుతోంది ' అన్నారు.
వారి వెంటనే వొస్తున్నారు.

కొంత దూరం వెళ్ళాక వెనక్కి చూస్తే ఆయన లేరు.
అన్ని దిక్కులా పరిశీలించి చూశారు.
దగ్గిర పొదల్లాంటివి, గుబురు చెట్లు లాంటివేమి లేవు,
అంతా , కనుచూపుమేర కనబడేంత విశాలంగా వుంది.

భక్తుడికి దర్శనం

Tuesday, June 2, 2009
భగవాన్ చివర రోజులు. ఆపరేషన్ చేసి, ఆయనను గదిలో పడుకోబెట్టి కదలకూడదనీ, ఎవ్వరూ ఆయనను డిస్టర్బ్ చేయకూడదనీ కావలి కూడా పెట్టారు ఆశ్రమంవారు . వొక రోజు మిట్ట మధ్యాహ్నం ఎక్కడ నుంచో ఒక సాధువు వచ్చి ఆశ్రమం గేటు దగ్గర ఒకరిని అడిగాడు, భగవాన్ ఎక్కడ అని. పరిస్థితి చెప్పి, భగవాన్ దర్శనాలు లేవని చెప్పారు. తాను వెంటనే వెళ్ళిపోవాలనీ, భగవాన్ దర్శనం అయితీరాలనీ అన్నాడా సాధువు. వీలులేదన్నారు ఆశ్రమంవారు.

యీ మాటలు భగవాన్ కి వినపడే ఆస్కారం లేదు.

సాధువు మాత్రం వెళ్ళిపోక అక్కడే నించుకొని కళ్ళు విప్పి భగవాన్ పడుకున్న గది వంకే చూస్తున్నారు. అంత దూరం నుంచి, సాధువు కళ్ళు వెడల్పుగా తెరుచుకున్నాయి.

గదిలోనుంచి వరండాలోకి వచ్చి
ఆయనకి దర్శనం యిస్తున్న భగవాన్ వైపు చూస్తున్నాయి ఆయన కళ్ళు.
అట్లానే ఒకరు నొకరు నాలుగు నిమిషాలు చూసుకున్నారు.
నిశ్చబ్దంగా, అంతే .

ఆ సాధువు వెళ్ళిపోయినారు.
భగవాన్ తన గదిలోకి వెళ్ళి పడుకొన్నారు.
మళ్ళీ ఆ సాధువు ఎన్నడూ కనపడలేదు.

ఆయన్ని తలుచుకుంటే ?

భగవాన్ కి జబ్బుగా వుంది. చివరి రోజులవి. దర్శనానికి వచిన వందలాది జనన్ని మధ్యాహ్నం నుంచి క్యూలో నడిపించి దూరమ్నుండి భగవాన్ దర్శనం చేయిస్తున్నారు.

ఆయన ఎవరి వంకా చూసేవారు కాదు.

తన వంక ప్రతిరోజు చూస్తారని చెప్పింది నర్తకి చలంతో.
'ఎట్లా?' అన్నాడు చలం ఆశ్చర్యంతో.

'ఏం లేదు! వెళ్ళేముందు మ్నసులో
'భగవాన్ ! నా వంక చూడండి అనుకుంటాను. చూస్తారు ' అన్నదామె.

భగవాన్ కరుణాప్రసారం

Monday, June 1, 2009
ఒక ఉదయం ఒక ముసలి తెలుగు అతను వొక గుడి దగ్గర గుమ్మంలో నుంచుని వున్నాడు. చలాన్ని చూసి మాట్లాడుతున్నాడు. అతను భగవాన్ కి దూరంగా ఆశ్రమంలో గంటల కొలది నుంచుని ఉండటం చూశాడు చలం .

రాత్రంతా ఇక్కడే పడుకొని వుంటాను ' అన్నాడు, మాటల సందర్భంలో.
'ఏమిటి, ఇక్కడా, వంటరిగానా, భయంలేదా?' అన్నాడు చలం.

'భయమా? ఏం భయం? రాత్రంతా నాపైన భగవాన్ కాంతి వేసి ఉంచుతారు,
నా చుట్టూ నీలం వెలుగు వుంటుంది.
ఆయన కాంతి నాతో వుంటే నాకేం భయం? ' అన్నాడతను.

Blessing

Blessing
Bhagavan Memories